| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
హితుఁడైన తన పురోహితు నుపదేశంబు | పేర్మితోఁ జేకొని ధర్మసుతుఁడు నెమ్మిఁ బుష్పోపహారమ్ముల నాదిత్యుఁ | బూజించి, భాగీరథీజలంబు లం దుండి విషయంబులం దింద్రియంబుల | నమలవ్రతానుభావమున నుడిచి, వాయుభోజనుఁడుఁ బ్రాణాయామపరుఁడు నై | సూర్యాదినామముల్ సూర్యుగుఱిచి |
|
| ఆ. |
జపము సేయుచున్నఁ దపనుఁ డాతనికిఁ బ్ర | త్యక్షమయి త్రిలోకచక్షుఁ డమర వరుఁడు దురితహరుఁడు తరణి త్రయీమూర్తి | వనజమిత్త్రుఁ డిట్టు లనియెఁ గరుణ. |
42 |
| వ. | ‘నీ తపమునకు మెచ్చితి; నీ వరణ్యంబున నుండఁ గల పండ్రెండేండ్లును వన్యఫలమూలశాకంబులు నీ మహాన సంబున ద్రుపదరాజపుత్త్రిచేత సాధితంబులై యక్షయంబులైన చతుర్విధాహారంబులగు’ నని యొక్క తామ్రస్థాలి యిచ్చి, వరం బిచ్చి వనజహితుం డంతర్హితుం డైన. | 43 |
| చ. |
అడరఁగ ధర్మనందనుఁ డహర్పతిచేత వరంబు పేర్మితోఁ బడసి మహీసురోత్తముల భవ్యులఁ బల్వుర నిర్వహించె న ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండిన శాకమూలముల్ గడు రుచి నిష్టభోజనసుఖంబులఁ దృప్తులఁ జేయుచుండఁగన్. |
44 |
| వ. | ఇట్లనేకసహస్ర మహీసురవరుల ననుదినంబును నభిమత భోజనంబులం దనిపి, విఘసామృత భోజనంబులం దృప్తులైన తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్త్రిక యుపయోగించుచుండం గొన్నిదినంబు లంద యుండి, పాండవులు బ్రాహ్మణులచేతం గృతస్వస్త్యయనులై బ్రహ్మర్షిసంఘంబులతోఁ గామ్యకవనంబున కరిగి; రంత నిట ధృతరాష్ట్రుండు విదురుం బిలిపించి ‘నీవు భార్గవుకంటె బుద్ధిమంతుఁడవు; పాండవ కౌరవులకు సముండవు; సమ్మతుండవు, చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా?’ రనిన విదురుం డిట్లనియె. | 45 |
| మత్తకోకిల |
‘దేవమూర్తులు పాండుపుత్త్రులు ధీరచిత్తులు వారి పెం పీ వెఱుంగనివాఁడవే ధరణీశ! వాయుసుతుండు గాం డీవియున్ భుజవిక్రమప్రకటీకృతుల్ వివిధాస్త్ర వి ద్యావిశేషులు వైరివీరులఁ దక్కనిత్తురె పోరులన్. |
46 |
| క. |
మొనసి యధర్మద్యూతం | బున భేదము వుట్టుఁ బాండుపుత్త్రులకును నీ తనయుల కని మును చెప్పిన | విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడఁకన్. |
47 |
| వ. | ఇఁక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బడయంబడిన రాజ్యంబునందుఁ బ్రతిష్ఠించి, కీర్తియు ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మమూలంబులు గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి యధర్మవర్తి యయి కర్ణ శకుని దుశ్శాసన శిక్షితుండైన దుర్యోధను దుశ్చేష్టితంబుల కొడంబడ వలవదు. | 48 |
| తే. |
వీని పుట్టిన పాపంపువేళఁ బెక్కు | దుర్నిమిత్తముల్ పుట్టిన నిర్ణయించి యేను జెప్పితిఁ దొల్లియు వీనిచేత | నెట్టుఁ గౌరవులకు నెగ్గు వుట్టు ననియు. |
49 |
| వ. | కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీరాజ్యరక్షకుం జేసి పుత్త్ర పౌత్త్ర మిత్త్రా మాత్య బంధు వర్గంబుల నెల్ల రక్షింపుము; సభామధ్యంబునందు ద్రౌపదీ భీమసేనులం బ్రార్థింప దుశ్శాసనుం బంపుము. | 50 |
| చ. |
అతిశయితామరోత్తముఁ డహర్పతితేజుఁ డజాతశత్రుఁ డూ ర్జితుఁ డజితుండు నీ సుతులు సేసిన యెగ్గు దలంపఁ; డాతనిన్ ధృతి నభిషిక్తుఁ జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ కృతమునఁ గౌరవాన్వయ మకిల్బిషకీర్తిఁ బ్రకాశితం బగున్.’ |
51 |
| వ. | అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్ట్రుం డిట్లనియె. | 52 |
| క. |
‘నా దేహంబునఁ బుట్టిన | యాదిసుతున్ విడువ నెట్టులగు? నాత్మజులం గాదనక విఘాతించు ద | యాదూరులు గలరె? యిట్టు లన నీ కగునే? |
53 |