| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనుచున్న యవసరంబున ననిలసుతుం డనిలవేగంబున నరుదెంచి జటాసురుచేత నిగృహీతులై గగనగతిం జను ధర్మజ నకుల ద్రౌపదులను, మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె. | 389 |
| తే. |
‘అతిథివై వచ్చి నీవు మాయందుఁ గుడిచి | యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె? యెందుఁ గుడిచినచోటికి నెగ్గు సేయ | రెట్టి దుర్జను లైనను నెఱుక విడిచి. |
390 |
| వ. | నీవు బుద్ధిగలవేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను; మట్లు గానినాఁడు బక హిడింబ కిమ్మీరులం జంపిన ట్లశ్రమంబునం జంపుదు’ ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుండై. | 391 |
| క. |
‘రయమున నీచేత నిహతు | లయిన సురారాతులకు రణాంతరమున నీ దయిన రుధిరమున నుదక | క్రియఁ జేసెద బక హిడింబ కిమ్మీరులకున్’. |
392 |
| క. |
అనుచుఁ గడు నలిగి మారుత | తనయు మహాబాహు నసుర దాఁకె; మరున్నం దనున కెడ సొచ్చి మాద్రీ | తనయులు తత్క్షణమ వానిఁ దాఁకిరి వీఁకన్. |
393 |
| సీ. |
వారల నిద్దఱ వారించి భీముండు | దాఁకె జటాసురు వీఁకతోడ; భీమాసురులకు సంగ్రామంబు గడుఘోర | మయ్యె; నిర్మూలంబు లయ్యె వారి యూరుఘట్టనముల ధారుణీరుహములు; | పదఘట్టనములఁ గ్రక్కదలె ధరణి; భూరుహపాణులై పోరి యాసన్న భూ | రుహములు వొలిసిన బృహదుదగ్ర |
|
| ఆ. |
శిలలఁ గొంతసేపు చెలఁగి పోరాడి రొం | డొరులు పెనఁగి పట్టి పరుషభంగి నుగ్రు లైన వాలిసుగ్రీవులట్టుల | యుద్ధ మొప్పఁ జేసి రిద్ధబలులు. |
394 |
| క. |
భీమాసుర వీరుల ము | ష్టాముష్టి రణచ్ఛటచ్ఛటాశబ్దం బు ద్దామం బై తద్విపిన మ | హామృగపక్షులకు నతిభయావహ మయ్యెన్. |
395 |
| ఆ. |
అంత భీమసేనుఁ డంతకాకారుఁడై | వాని బలవిహీనుఁగా నెఱింగి తడయ కపుడు వాని మెడ గ్రుంగఁ బిడికిటఁ | బొడిచె; నసుర ముడిఁగి పడియెఁ బుడమి. |
396 |
| వ. | ఇట్లు నిర్ఘాత నిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుంబోలె నేలఁబడిన జటాసురుశరీరం బెత్తి యొక్క విశాల పరుషపాషాణంబుపై జర్జరితంబుగా వైచి, వానిం గాలగోచరుంగాఁ జేసిన వాయుపుత్త్రుపరాక్రమంబు ధౌమ్యరోమశాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయన కథితంబైన కథ రమ్యంబుగ. | 397 |