| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
సీతఁదెచ్చుటకు నాశించి వచ్చుటయుఁ బ్రీతిఁజెప్పుటయు మారీచుఁడిట్లనియె: “నిది యేమి రావణ!యెల్లభోగములు కొదలేనిసుఖమునఁగుడిచికూర్చుండి యిట్టిదుర్బుద్ధి నీ కెట్లొకో పుట్టె? నెట్టి దుర్మంత్రి నీ కీ బుద్ధి సెప్పె? వాని నీ వటు పగవానిఁగాఁజూడు; మే నీకుఁబోరానిహితమంత్రిఁగాని యితరుఁడఁగాను; నీకిది బుద్ధిగాదు. క్షితిఁబతివ్రతలఁనాశించుట దగదు. ఆశించి తేని నీ యన్వయంబెల్ల నాశిల్లుఁ; గాన దానవనాథ! మఱలి చనుము లంకకు; సుప్రసన్నుండ వగుము. కనుము సౌఖ్యము నీదుకాంతలవలన.” ననిన మారీచువాక్యంబు లప్పటికి విని లంక కేతెంచె వింశతిభుజుఁడు. |