పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
దేవత లర్థావసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట (సం. 3-139-18)
తే. ‘తమ్ముచేసిన దురితముల్‌ తలఁగఁ బూని | ధర్మబుద్ధివై వ్రతములు పేర్మిఁ జలిపి
తనఘ! నీకు నభీష్టంబు లైన వరము | లడుగు మిచ్చెద; మీ మెచ్చు గడవ నగునె!’
279
వ. అనినఁ దన తండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించియుండను, నిజజనకుండు పరావసుచేత నిహతుం డగుట నిస్తరింపను వలయు నని ప్రార్థించి, దేవతల వరంబున నర్థావసుండు రైభ్య భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె. 280
తే. ‘ఏను బహువేదశాస్త్రమ్ము లెఱిఁగి, వ్రతము | లెల్లఁ జేయుచు రైభ్యుచే నిట్లు హతుఁడ
నైతి; నాకంటె రైభ్యున కధికశక్తి | యైన తెఱఁ గెట్టు?’ లనిన నిట్లనిరి సురలు.
281
క. ‘గురుశుశ్రూష యొనర్చుచుఁ | బరమక్లేశమునఁ జేసి పడసిన విద్యల్‌
స్ఫురియించుఁగాక; గురుముఖ | విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్‌?
282
వ. నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీయధ్యయనశ్రుతంబులు నిర్వీర్యంబు లయ్యె; గురుసంతోషకరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్జించెం గావున నాతం డిట్టి శక్తివడసె నని దేవతలు దివంబున కరిగి; రిది యవక్రీతు నివాసం; బిందు వసియించినవారు దురిత విముక్తులగుదు; రిది కాలశైలం; బిది సప్తవిధం బైన గంగ; యిది మనుష్యుల కగోచరం; బింద యుండి సమాధి శౌచపరులై చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుష సుపర్వులు సురేంద్రుం గొలిచి పోయెద; రిందుల కాఱునూఱుయోజనంబులు గలదు కైలాసపర్వతం; బందు గుబేరుం డుండు’ నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వాని నెల్లం జూచి; రంత నంతక సుతుండు భీమున కిట్లనియె. 283
సీ. ‘దుర్గమం బైన యీ దుర్గమార్గంబున | నడవంగ నేర; మున్నతరథముల
నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల | ద్రుపదతనూజను దోడికొనుచు
సహదేవుఁడును నీవు చట్టనఁ గ్రమ్మఱుఁ; | డేనును నకులుండు నేఁగి రోమ
శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు | నాడి వచ్చెదము; మా యరుగుదెంచు
 
ఆ. నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణఁ | గాచి యుండుఁ’ డనిన ఘనుఁడు భీముఁ
డనియె ‘నిట్టి రాక్షసాకీర్ణవనములో | నిన్నుఁ బాయనగునె నిమిషమేని.
284
చ. అనఘచరిత్రు నర్జును మహాభుజు నొక్కనిఁ బాసి వంతఁ బొం
దిన యెడ నిట్టిచోట సహదేవుఁడు నేనును గృష్ణయున్‌ జగ
జ్జననుత! నిన్నుఁ బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే
దన యగు; నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్నఁడున్‌.
285
క. కడు డస్సి నడవనోపని | యెడ నీ కమలాయతాక్షి నీ కవలను నేఁ
దడయక నఱకట నిడికొని | కడఁకం గొనివత్తు విషమగహనాంతములన్‌.
286
వ. ఈ రథంబులతోఁ బోవ నిమ్ము గాదేని వీని నింద్రసేనాదుల నెందేనిం బెట్టి పోద’ మనిన రోమశుం డిట్లనియె. 287
క. ‘అతులతపోవీర్యబలో | న్నతిఁ బోదము గంధమాదనంబునకు; సమా
గతు నందుఁ గాంతు మర్జును | నతివీరు నుదారు సురగణార్చితుఁ బార్థున్‌.’
288
వ. అనిన నందఱు సంతసిల్లి యరుగువారు ముందర ననేకప హయరథసనాథంబై యపారకిరాతబల సంకులంబైన దానిఁ బుళిందాధిపతి యైన సుబాహుపురంబుఁ గని, యందు వానిచేతం బూజితులై తమ రథసూతహయనివహంబుల నింద్రసేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి, పాదచారులై పాంచాలిని బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుండు భీమున కిట్లనియె. 289
సీ. ‘అలిగి వజ్రాయుధునైనను బోరిలో | నోర్వంగ నోపు నత్యుగ్రవీరు.
జవమునఁ బవనుఁ దేజంబున నాదిత్యుఁ | బోలినవాని, నంభోజనేత్రు,
నాయతబాహుఁ, గృతా స్త్రు, సింహస్కంధు | సర్వధనుర్ధరాచార్యు, విజయు,
నిత్యక్షమాన్వితు, నీ తమ్ము నర్జును | శుభగుణసుందరుఁ జూచునంత
 
ఆ. కధికతాపతప్త మైనది నా చిత్త; | మొనర నతనితోడ నొక్కటునికి
యెన్నఁ డొక్కొ మనకు! నిందఱ కగునాతఁ | డేల మసలెనొక్కొ యిన్ని యేండ్లు!’
290
మ. అనుచుం బార్థవిలోకనంబు మదిలో నర్థింపఁగా ధర్మజుం
డనవద్యుల్‌ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్‌ గంధమా
దనశైలేంద్రముఁ గాంచి రున్నతబృహద్ధాతుస్థలీసంహతిన్‌
ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్‌ మహిన్‌.
291
క. నానావర్ణ శిలావిహ | గానేక మృగాభిరామమై భూనారీ
నానాభరణవిభూషిత | పీనోన్నతకుచముఁ బోలె వెలిఁగెడు దానిన్‌.
292
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )