పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
వైన్యుం డనురాజు చరిత్రంబు భీష్ముఁడు ధర్మజునకుం జెప్పుట (సం. 12-59-201)
వ. వానిం జూచి యా ఋషులు ‘నిషీద’ యని పలికి వర్జించుటం జేసి తత్సంతాన జాతులు నిషాదు లనం బరఁగి వింధ్యాది గిరి వన ప్రదేశంబులఁ గ్రూరత్వంబున వర్తిల్లి; రమ్మునులు మఱియు నా రాజు దక్షిణ బాహువు మథించిన నుజ్జ్వలత్కవచ శరశరాసన భాసమానుండును వేద వేదాంగ ధనుర్వేద పారగుండును నగు పరమాకారవంతుం డుదయించె; సకల దండనీతియు నప్పురుషు నాశ్రయించె; నతం; డమ్మహాత్ముల కభిముఖుండును బ్రాంజలియు నై వినయంబున. 207
తే. ‘వినుఁడు! ధర్మార్థ తత్త్వ ప్రవీణ యగుచు | సూక్ష్మ దర్శిని యైనది సుకృతులార!
నాదు బుద్ధి; మీ కెప్పని నడపవలయు | దీనిఁ గొని నన్నుఁ బనుపరే దాని’ కనిన.
208
వ. వారునుం దత్సమయ సమాగతు లయిన విబుధులును నవ్వైన్యాభిధాను నభినందించి. 209
సీ. మాన లోభములఁ గామ క్రోధములఁ బాసి | సర్వ జంతువులకు సముఁడ వగుచు
నియత ధర్మము నీవు నిశ్శంక నడపుము; | ప్రియము నప్రియము నుపేక్షఁ గూర్పు;
‘దండనీత్యాశ్రయ ధర్మంబు నా పని; | దీనిఁ జేయుదు సావధాన వృత్తి;
రక్షింతు శ్రుతుల; వర్ణముల సంకరములు | సొరనీ; నదండ్యులు ధరణి దివిజు
 
తే. లరయువాఁడ నే భూప్రజ’నని ప్రతిజ్ఞ | యను మహోన్నత పద మెక్కు మనుడు, నాతఁ
‘డవనిసురులు సహాయత్వ మాచరించి | రేని న ట్లగుఁ గా’ కనియెం గుమార!
210
వ. అనిన విని వారలు ప్రీతచిత్తులై యాతనికి మహీసురులు సహాయత్వం బాచరించువారుగా ననుమతి సేసి; రయ్యవసరంబున వాత్సల్యంబున సకల దివ్య పరివృతులై వచ్చి విష్ణు విధాతలు నమ్మునీశ్వరులును నక్కుమారు నఖిల ధరణీ సామ్రాజ్యాభిషేకంబు నిర్వర్తించి; రవ్విభునకు శుక్రుండు పురోహితుండును వాలఖిల్యుల యందు సారస్వతగణం బమాత్యులును గర్గుండు సాంవత్సరికుండు నై నడచిరి. మున్ను మహి విషమ యగుటయు నమ్మనుజపతి సమమూర్తి గావించుటయు విందుము. కరచరణాద్యవయవములతో నవనియు సాగరంబులును మహాగిరులును నగ్గురు ప్రభావుని భజియించె. 211
క. సురపతి విభవము, మేరువు | హిరణ్యమును, గిన్న రేశుఁ డీడిత సంప
ద్గురుతయు నొసఁగిరి రథ కరి | తురగ భటావళులు తలఁపుతో నొడఁగూడెన్‌.
212
వ. ఇట్లు మహనీయ ప్రభుత్వ పదస్థుండై యమ్మహాత్ముండు శాస్త్రోక్త మార్గంబున దండనీతి పరిపాలనంబు ధర్మతాత్పర్య సమీచీనంబుగా నాచరించె. 213
క. ఉరగాదులవలని భయముఁ | బొరయక యొండొరులతోడఁ బొసఁగి రుజలుఁ జి
త్తరుజలు లేక యతని తఱి | ధరణీప్రజ సస్యసంపదయుఁ గల్గి మనున్‌.
214
తే. బ్రాహ్మణ క్షత సంత్రాణ పరతఁ జేసి | క్షత్రియాభిధానంబు, రంజనము నెల్ల
ప్రజకుఁ జేయుట కతమున రాజనామ | మును బ్రవర్తిల్లె నా నృపాలునకు నధిప!
215
వ. తత్సంతతి జాతు లెల్లను దత్కల్పులై రాజత్వంబు వహించి దండనీతి పాలించిరి; రాజని యొకండు కలిగిన తెఱంగును రాజ్య స్థాపనంబును రాజు మిగిలి వర్తింపం దక్కిన జనంబులకు రాకుండుటయు విష్ణు విహితంబులు విష్ణుండు రాజుల నిజ తేజోంశంబులం బ్రవేశించి యుండునట్లగుటంజేసి దైవ నిభుండగుచు రా జెల్ల వారిచేతను మ్రొక్కుం గొనజాలుఁ , దద్రక్షణంబును నాచరించు; నొక్కని వశంబున లోకంబంతయు వర్తిల్లుటకు దేవ సంబంధ కలితం బయిన గుణంబు వెలిగా నొండు కారణంబు కలదే? యాకర్ణింపుము. 216
మ. హరిఫాలంబునఁ బుట్టి ధర్మమున కాలై యర్థమన్పుత్రకున్‌
సిరి కాంచెన్‌ దగ వారు మువ్వురును సుస్థేమోన్నతిన్‌ సంశ్రయిం
తురు భూపాలకు నాతఁ డన్యజనతా తుల్యోద్భవుం డెట్లు ని
ర్జర లోకార్హ సమగ్ర పుణ్య వితతి ప్రాప్తుండు గా కారయన్‌.
217
వ. దివంబున నుండి దండనీతి నయించుటకు వచ్చి వాసుదేవ మహత్త్వ భావితుండైన మహానుభావుండు కావున వర్ణంబులు నాశ్రమంబులుం దదాచార ప్రవర్తనంబులైన; వేద పురాణేతిహాసంబులును రాజున కధీనంబులు తదీయ మాహాత్మ్యంబున నతనియందు సౌందర్య శౌర్య చాతుర్యాది గుణంబులు కలుగ జనంబులు తలంతురు; తదాజ్ఞకు లోనై వర్తింతు రిది రాజులు దేవసములైన తెఱంగు; మఱియు నడుగవలయు వాని నడుగు’ మనిన నయ్యాపగానందనునకుం బ్రణమిల్లి యప్పాండునందనుం డి ట్లనియె. 218
తే. ‘అనఘ! నాలుగు వర్ణము లాశ్రమములు | నెన్ని కల? వెవ్విధంబుల నన్నిటికిని
వర్తనమ్ములు? వేర్వేఱ వానిఁ దెలుపు | విశ్వ రాజధర్మములను విస్తరింపు.
219
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )