పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
మాంధాతృన కుతథ్యుఁడు సెప్పిన హితవాక్యముల ప్రకారము (సం. 12-91-1)
తే. భూత వృద్ధులు ధనలాభములును గలుగు | ధర్మమును రాజనువాఁడు ధర్మరక్ష
కై జనించెను గావున నతఁ డరోష | కాముఁడై ధర్మనిరతుండు గాఁగ వలయు.
401
క. విను ధర్మమునకు బ్రాహ్మణ | జనము జననదేశ మగుట జనపతి భక్తిం
గొనియాడి యసూయా వ | ర్జనుఁడై తగు విప్రకోటి సంభావింపన్‌.
402
చ. అనిమిషులున్‌ విభీతు లగునట్టి పదంబునఁ బేర్చి మున్‌ విరో
చన తనయుండు భూమిసురజాతి సువృత్తి కసూయచేసి నె
ట్టన సిరిఁ బాయడే? బలి దృఢంబగు భక్తివిశేషమూఁదఁగా
ననఘ! యతండు దాఁ బిదప నవ్యయసౌఖ్య విభూతి నొందఁడే?
403
ఆ. ధర్మమునకు సిరికిఁ దగ జనించినయది | దర్ప; మనిమిషులు నుదాత్తమునులు
నైన నగ్గుణమున నూనినఁ జెడుదురు | దాని గెలువవలయు ధరణిపునకు.
404
మ. పరనారీగమనాదిదోషములు భూపాలుండు సేయంగఁ ద
ద్ధరకున్‌ వర్షము లేకయుండుఁ; బ్రజకున్‌ దైన్యంబు వాటిల్లుఁ; బె
క్కు రుజల్‌ పైకొను; నెందునుం గలయ నుక్కుం దేజముం దక్కు ;ను
ద్ధుర సైన్యంబుల శత్రు లొత్తుదురు; బంధుశ్రేణికిం జే టగున్‌.
405
క. కాని చెయిదములు సేయ క | నూనపు ధర్మమున నడచు నుర్వీశుఁడు సం
తానము బంధులుఁ బ్రజయును | దానును సేనలును శుభము దలకొనఁ బేర్చున్‌.’
406
వ. అని యిట్లు సెప్పిన వాక్యంబులం దెలివొంది ధర్మతత్పరుండై మాంధాతృండు మహావిభూతిం బొంది నెగడె; నీవును నట్ల నెగడు’ మనిన ధర్మతనయుండు ‘ధర్మంబున నెగడ దొరకొనుట యెట్టి భంగిం గలుగు?’నని యడుగుటయు, నతనితో నక్కురుపితామహుండు దొల్లి కౌసల్యుం డగు వసుమనుం డనురాజు వామదేవ మహాముని నిట్ల యడిగిన నతం డతనికి నుపదేశించిన తెఱం గెఱించెద విను మని యిట్లనియె. 407
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )