పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మజునకు భీష్ముండు సమరంబున పాడి దెల్పుట (సం. 12-96-6)
సీ. పగవాఁడు బలములఁ బన్ని త్రోచినఁ దాను | సబలుఁడై యొంటిమై సంగరంబు
గోరిన నమ్మెయి గొనకొని మాయ లొ | నర్చిన మాయలఁ బేర్చి గెలుపు
గొనునది; వెన్నిచ్చినను బ్రమాదంబునం | బడినను గైదువు భగ్నమైన
శరణన్న మ్రొక్కినఁ దురగాళి యెడలిన | నొరుతోడఁ బోరుచునున్న నెట్టి
 
ఆ. పగతునైనఁ జంపఁ దగ దధర్మంబునఁ | జంపు కంటె ధర్మసమర కేలిఁ
జావు మేలు; రాజు శయ్యఁ జచ్చుట గొఱ | గాదు గాన యోడఁ గాదు పోర.
420
క. విను చిల్లయిడిన యాయుధ | మును విషలిప్తమగు శస్త్రమును నెట్టియ మి
త్త్రునిపై నైనఁ బ్రయోగిం | చిన నరపతి నరకమున వసించు నృపాలా!
421
క. తనకుం దోడ్పడి యని నొ | చ్చిన వానిం గాంచి కడఁగి చేష్టింపక యు
న్న నరేంద్రుఁ బొందు పాపం | బునకుఁ గొలఁది గలదె భరతపుంగవ! తలఁపన్‌.
422
వ. అని చెప్పి వెండియు. 423
చ. అరిపయిఁ బోయి వాని పుర మగ్గలికం జెఱుపంగఁ దద్ధరం
బరఁగు ప్రజం జలంబు మెయి బాధలఁ బెట్టు టధర్మమట్టి ని
ష్ఠురత యొనర్చుటప్పటికిఁ జూడఁగ మానఁగరాదయేని భూ
సుర గృహదేవగేహముల చూఱ నవశ్యము మాన్చు టొప్పగన్‌.’
424
వ. అనిన విని యజాతశత్రుండు ‘రాజధర్మంబు కంటెం బాపకర్మంబు లేదు పొ’మ్మని పలికి ‘యిట్లేని రాజున కెట్లును నధోగతి వాటిల్లుఁ గదే!’ యనుటయు నాపగాతనయుం డిట్లనియె. 425
క. ‘శరణాగతుఁ గాచియు, నని | నరిపోటులఁ బడ్డఁ దెచ్చి యరసియు, ధరణీ
సురులం బ్రోచియు, నానా | ధ్వరములు సేసియును రాజు దలుఁగు దురితముల్‌.
426
క. అన విని యమ్మనుజేశ్వరుఁ | ‘డని ననివర్తు లయి శౌర్య మభినుతి కెక్కం
దనువుఁ దొఱంగిన వారికి | ననఘా! యెబ్భంగి లోక మగు?’ నని యడిగెన్‌.
427
వ. అడుగుటయు, నమ్మహీకాంతునితో ‘శాంతనవుండు శక్రాంబరీష సంవాదంబు చెప్పెద; దాన నీ యడిగినయది దేటపడు నని యిట్లనియె. 428
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )