పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
అర్జునుఁడు శిఖండికిఁ బ్రోత్సాహంబు గలిగించి భీష్ముపైఁ గవియించుట (సం. 6-104-51)
ఆ. ‘ఇట్టు లాడి పిదప నేమియుఁ జేయంగఁ | జాలకున్న మనల జగము నవ్వు
నేను గలుగ నిన్ను నెవ్వరి కేమియుఁ | జేయరాదు భీష్ము నేయు మడరి.’
328
వ. అనియె నప్పుడు గాంగేయుండు దొలంగి పాంచాలబలంబులపైఁ దఱిమినం దెఱపి గని పాండవబలంబులు గాండీవి మున్నుగాఁ గవిసినం గౌరవసేన దెరలి మరలినం జూచి కురురాజు సురనదీసూనుతోడ ‘నీవు గలుగ మన సైన్యంబు దైన్యంబు నొంద నగునే?’ యనవుడు రారాజుతో నతండు. 329
క. ‘మును పదివేవురఁ జంపుదు | ననియిచ్చినబాసవచ్చె నవనీశ్వర! నీ
మనిచినఋణంబు దీర్చితి | విను లా విటమీఁదఁ దఱుఁగువిధమై తోఁచెన్‌.
330
ఆ. నేఁటిభంగి సూడ నృపవర | పాండవు లొండె నన్ను, వారి నొండె నేను
సమయఁజేఁత గలుగు సమసెదరే? యొక | మర్త్యుచేత వా రమర్త్యబలులు.
331
వ. ఐనను నా చేతి బలుపు సూడుమీ యని పలికి పేర్చి పటుతరశరార్చులం బ్రచండ నరనాథ యూథంబులం బొదివికొని పాండవులకుం దేఱిచూడరాక నిర్ధూమదహనస్వభావుండైన పితామహు ప్రాపున భవత్పుత్త్రులు శత్రుబలంబుల బడలువడంజేయందొడంగిన వారిం గనుంగొని. 332
ఆ. పాండవేయమాత్స్య పాంచాలయాదవ | పాండ్యకేకయాదిబలము లొక్క
మొగిన త్రోవ నీదుమొనలు మార్కొనుటయు | నపుడు పోరు ఘోర మయ్యె నధిప!
333
వ. అట్టియెడ నర్జునుండు శిఖండి నాలోకించి. 334
తే. ‘నీవు భీష్మున కలికినఁ బోవ దేను | గలుగ వెఱపేల? యతనిపైఁ గవియు మెయిది
కొని మదీయబాణంబులఁ గుప్పఁగూరఁ | బఱపి కూల్చెద నీతనిఁ బటురయమున.’
335
వ. అనిన నాతని పలుకులు విని యెలుంగెత్తి ధృష్టద్యుమ్నుండు. 336
క. ‘మన యోధులందఱును శాం | తనవునిపైఁ దఱుముఁ డింద్రతనయుఁడు గలుగన్‌
మన మతనికి శంకింపఁగఁ | బనిలే’ దని పలికి యార్చి బలువిడి నడరెన్‌.
337
వ. అప్పుడు ధర్మజభీమనకులసహదేవులును సుభద్రాతనయద్రౌపదేయులును ద్రుపదవిరాటులును, సాత్యకి చేకితాన ధృష్టకేతు కేకయ మాగధులును మఱియునుం జేయంగల దొరలు నొక్కపెట్ట బెట్టఁడరిన నిక్కడ గురుపుత్రభూరిశ్రవసులును, గృతవర్మకృపకాంభోజపతులును, వికర్ణదుర్ముఖ వివింశతిచిత్ర సేనులును లోనైన యోధులు దేవవ్రతునకుం దలకడచి వారిం దలపడి రిట్లు మందాకినీనందనుపయిం గవియు పాండవసైనికులను నతని కడ్డ్డుపడు కౌరవ్యవీరులును జూచునెడ సురల కనిమిషత్వంబు సార్థకం బయ్యె నయ్యవసరంబున. 338
క. మొనసి శిఖండిని మున్నిడి | కొనియురవడిఁ దఱుము నరునకును వెస దుశ్శా
సనుఁ డడ్డపడియెఁ బొంగిన | వననిధిఙకిని వేలవోలె వసుధాధీశా!
339
వ. ఇట్లు నిలువరించి. 340
క. ఇరువురఁ గృష్ణుల నాతం | డిరువదిబలునారసముల నేసెం గ్రోధ
స్ఫురితుఁ డయి నొంచెఁ గ్రీడియు | నరనాయక! యతని నూఱునారాచములన్‌.
341
తే. అతఁడు నొచ్చియు నాటించె నైదుతూపు | లింద్రసుతుఫాలమున నాతఁ డేచి విల్లు
దునిమి పెల్లేయఁ దలఁకక దుస్ససేనుఁ | డన్యధనువున నిరువదేనమ్ము లేసె.
342
క. ఆ తూపులు నఱికి పరి | స్ఫీతంబగు నారసంబు పృథుతరవక్ష
స్స్యూ తంబు సేసి విజయుఁడు | నీ తనయుని మూర్ఛ వుచ్చె నిష్ఠురవృత్తిన్‌.
343
వ. ఇట్లు దుశ్శాసనుండు సోలి వ్రాలుటయు. 344
క. సారథి యరదము భీష్ముని | తేరివెనుక కెగిచె నంతఁ దెలివొంది ధృతి
స్ఫారుఁ డగు న క్కుమారుఁ డు | దారగతిన్‌ మగిడి వచ్చి తాఁకెం గ్రీడిన్‌.
345
వ. తదవసరంబున సాత్యకితో నలంబుస భగదత్తులును, నభిమన్యునితో సుదక్షిణుండును, విరాటద్రుపదులతో నశ్వత్థామయు, సహదేవునితోఁ గృపాచార్యుండును, నకులునితో వికర్ణుండును, ఘటోత్కచునితో దుర్ముఖుండును, భీమసేనుతో భూరిశ్రవసుండును, జేకితానుతోఁ జిత్రసేనుండును, ధర్మనందనుతో నస్త్రగురుండును దలపడిన బెట్టిదంబగు బవరం బయ్యె నందిరుదెఱంగుల యోధులు నన్యోన్యధ్వజభంజనంబును, బరస్పరతురగహననంబును, నితరేతరసూతనిపాతనంబును, మిథఃకోదండ ఖండనంబును జేయుచుండం బటుతరశరసంపాతసంపాదితశంపాజాలకాభీలంబును, భీషణ గుణరణనగర్జాస్ఫూర్జితంబును, రక్తధారాసారఘోరంబును, నగు నపూర్వ పర్జన్యసమయంబు దోఁచె నప్పుడు గయ్యంబు కలరూపంతయుం గనుంగొనుటకు మింటి క్రేవ నున్న వెరవు గా దను పరుసున సవితృండు సగమింటికిం జనుదెంచె; నట్టియెడ. 346
మ. పటుదుశ్శాసనబాణపంక్తి నతిదర్పస్ఫూర్తిమైఁ ద్రుంచి యు
త్కటకోపానలదీప్తవక్త్రుఁ డగుచున్‌ గాండీవి పెల్లేయుడుం
ద్రుటితజ్యాలతికాధనుర్ధ్వజుఁడు నిర్లూనాఖిలాంగుండు నై
రటదశ్వం బగుతేరితో నతఁడు సంత్రాసంబునం బాఱినన్‌.
347
తే. ఫల్గునుఁడు భీష్ముముందటిబలము నెల్లఁ | జటులరథవల్గనుం డయిఁ చంపుచున్నఁ
జూచి ద్రోణుండు గుణరవస్ఫురణఘూర్ణ | రోదసీభాగుఁ డగుచు మార్కొనఁ గడంగి.
348
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )