పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
వేదవ్యాస మునీంద్రుఁడు ధర్మజునకు సువర్ణష్ఠీవి చరిత్రంబు సెప్పుట (సం. అను 1-8-300 పంక్తి)
క. ‘జనపాలక! సృంజయుఁ డను | మనుజేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁ డి
వ్వననిధి వలయములోని య | వని నొక్కఁడ యేలు దుర్నివారస్ఫురణన్‌.
188
వ. సంతానార్థి యయి సంతతంబును భూసుర పూజనంబులు సేయుచుండు నా నరపతికి నారదుండు సఖుం డగుట నతని పాలికిఁ బలుమాఱు నరుగుదెంచుచుండు; నొక్కనాఁడు విప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని యమ్మునివరునితో నిమ్మహీపతి కోర్కి దీర్పవలదే యని చెప్పిన. 189
క. ‘అతఁ డతనితోడ ‘భవదీ | ప్సిత మెయ్యది నాకు నేల చెప్ప?’ వనుడు ‘నం
చితగుణుఁడు రూపసియు నగు | సుతుఁ గోరుదు నెపుడు నేను సురగణవంద్యా!
190
వ. అక్కుమారుండును మూత్రపురీష లాలాశ్రుస్వేదంబులు సువర్ణంబు లగునట్టివాఁడు గావలయు’ ననిన నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె; నా సృంజయుండు నత్తెఱంగుతనయుం బడసి సువర్ణష్ఠీవి యను పేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ధి యగుచుండ సమృద్ధి నొంది, శయనాసన సదన ప్రాకార ప్రభృతి సమస్త వస్తువులను కాంచన మయంబులు గావించికొని యసమాన మహిమానందంబునం బ్రకాశుం డై. 191
క. విలసిల్లుచు నుండఁగ మ్రు | చ్చిలి పట్టి కుమారునోరఁ జీర దుఱిమి వెం
గలు లగు క్రూరులు కొందఱు | వెలువడఁ గొనిపోయి యొక్క విపినములోనన్‌.
192
ఆ. కడుపు (వ) వ్రచ్చి యొడలు గలయంగ జల్లించి | పాపి పాపి చూచి, పసిఁడి గాన
కచట శవము వైచి యరుగుచునుండి త | త్కర్మ ఫలముఁ దమ్ముఁ గలఁచుటయును.
193
వ. ఆ పాపాత్ములు తమలోనం గలహించి, యొండొరుల వధియించి, యందఱు నధోగతిం జెందిరి; సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు గని పరలోక క్రియలు నిర్వర్తించి, శోకంబునం బలవించుచున్న న న్నరేంద్రు కడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్చితుండై. 194
క. ‘జననాథ! యిట్లు శోకం | బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యుసుఱు? స
చ్చిన వారలు వత్తురె యే | డ్చినఁ? జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్‌.
195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )