పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
అశ్వత్థామాది రథికత్రయంబు దుర్యోధనుం గనుంగొనుట (సం. 10-9-1)
తే. రక్త సంసిక్తమైన ధరాతలమున | నార్తిఁ బొరలుచు నూర్పు లందంద సంద
డింప జీవంబు వెడల నుంకింపఁ జేష్ట | లొయ్యనొయ్యన యడఁగంగ నున్న యధిపు.
213
మహాస్రగ్ధర కని శోకం బాత్మలం దగ్గలముగ రథముల్‌ గ్రక్కునన్‌ డిగ్గి, భూమిన్‌
ధనువుల్‌ వోవైచి, భాష్పోద్గమము వొదువు వక్త్రంబులన్‌ విప్రలాపం
బును దైన్యం బావహిల్లం బొరలుచుఁ బొరి నా భూవిభున్‌ శాంతదృష్టిం
గనుఁగొంచుం జేరి, కే లంగముపయి నిడుచుం గౌఁగిటం జేర్చుకొంచున్‌.
214
చ. పురపురఁ బొక్కి యా నృపతిపుంగవు చుట్టును నుండి ‘యక్కటా!
ధరణి సమస్తమున్‌ భవదుదారమహాజ్ఞకు లోను సేసి యి
ప్పరుసున నీవు దీనతకు భాజనమైతి; విధాత కెందు దు
ష్కర మగు కార్యముం గలదె? కౌరవనాయక! మ మ్మెఱుంగుదే?’
215
క. అన నప్పలుకులు వెడ వెడ | విని యా విభుఁ డల్లఁ గన్ను విచ్చిన వదనం
బునఁ జూడ్కి నిలిపి కలశజ | తనయుం డి ట్లనియె గద్గదగళుం డగుచున్‌.
216
చ. ‘అమితబలంబు దర్పమును నద్భుత ధీరతయున్‌ గదాపరి
శ్రమముఁ బొగడ్త కెక్కు నినుఁ జక్క నెదుర్చుట గాక పోర రం
ధ్రముగని యొక్కఁ డుద్ధతి గదం దెగటార్చుట గల్లెనట్టె యిం
క మగల కెట్టివారలకుఁ గల్గ దపాయము దైవ మల్గినన్‌?
217
చ. దురమునఁ బెంపుఁ జేవయును దుర్దమలీల వెలుంగుచుండ సు
స్థిరత శమంతపంచక విశిష్ట తలంబునఁ బోరి సద్గతిన్‌
బొరసెదు; నీకునై వగపు పుట్టదు; బంధులు, రాజు, దేవులుం
దిరియుదు రింక; వారి దగు దీనత కోర్వక యుమ్మలించెదన్‌.
218
ఉ. సీరి యనారతంబుఁ దన శిష్యులలోపల నెల్ల నిన్ను దు
ర్వార పరాక్రమాఢ్యుఁడని వర్ణన సేయుట గేలిచేసి యా
మారుతికిన్‌ జయం బొసఁగె మాల విధాతృఁడు; వాని గెల్పుకో
లేరికి సమ్మతంబగునె యిట్టిది? దీనను బెంపు గల్లునే?
219
చ. కురువర! నీ మగంటిమియుఁ గోల్తలయున్‌ బలముం జలంబు దు
స్తరగతిఁ బేర్చి భీమునకుఁ జావక పోవఁగరాని యట్టిదై
నరు బెదరించి కేశవు మనంబు గలంచి యధర్మవృత్తికిం
జొరుఁడని పంచె; దీని దివిజుల్‌ గని; రిం కిటవేయు నేటికిన్‌?
220
ఉ. ధర్మము మాని యూరులు గదం బొడి సేసినయంతఁ బోక దు
ష్కర్ముఁడు వాయుజుం డెడమకాల శిరంబటు దన్నెఁ జూచి యా
ధర్మసుతుండు శాస్తిఁ దగ దానికిఁ జేయఁడ; యాతఁడెప్డు నం
తర్మదదుష్టుఁ; డీ గెలుపు దైన్యము సేయదె? కీర్తి మాయదే?
221
క. కౌరవనాయక! నీదు గ | దారణ గౌరవము సకల ధరణీజన చే
తోరంజనమై నిర్మల | సారయశోధనము నీకు సంపాదించెన్‌.’
222
వ. అని పలికి తన మానుషంబు తెఱం గూహించి. 223
చ. ‘కుడువఁగఁ గట్ట, బంధులకుఁ గోటి విధంబులఁ బెట్ట, జన్నము
ల్నడుప, ననేక ధర్మవిధులం బొగ డొందఁగఁ జాలునట్టి యె
క్కుడు సిరి యిచ్చి పేర్మి నొక కొండగ మన్చిన నీవు సావఁగా
నొడ లిటు లోమితిం; గురుకులోత్తమ ! యేనొక సేవకుండనే?’
224
వ. అని తన్నుఁ దాన నిందించుకొనుచు మఱియు. 225
ఉ. ‘న్యాయము దప్పకుండఁగ రణం బొనరించి దివంబు గైకొనం
బోయెద; వందు రాఁదగిన పుణ్యము సేయుటలేదు గాని, మా
చేయు మనంబునుం దనియఁ జెండఁగఁ బడ్డ విరోధివర్గమున్‌
నీయెడ కిం పొనర్పఁగ గణింపఁగ భాగ్యము గల్గె భూవరా!
226
ఆ. పుణ్యలోకమునకుఁ బోయినయప్పుడు | ద్రోణుఁ గాంచి నీకు ద్రోహియైన
జనవినింద్య చరితుఁ జంపె దృష్టద్యుమ్ను | నీ తనూజఁ డనుము తొలుత.
227
వ. అని నా మాఱుగా నమస్కరించి కౌఁగిలించుకొనుము. మఱియు వలయు సల్లాపంబులు సేయుము. బాహ్లిక సోమదత్తభూరిశ్రవస్పైంధవప్రముఖ భవదీయ బాంధవజనంబులతో నా చేసిన కుశలప్రశ్నంబుగా సంభావింపు మది యట్లుండె రేయింటి తెఱం గెఱింగించెద. 228
సీ. అమృతంబు నింపు కర్ణములకు నొసఁగెడు | మాట లాకర్ణింపు మనుజనాథ!
శాత్రవ శిబిరంబు సౌప్తికవేళఁ బ్ర | వేశించి నీచుఁ గిల్బిషమయాత్ముఁ
దొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచితిఁ బశుమర | ణంబుగాఁ దదనంతరంబ కవిసి
వాని బంధులనెల్ల వరుస గీటడఁగించి | ద్రౌపదీసుతుల నందఱను బొదివి
 
తే. మిడుక మిడుకంగఁ జంపి యప్పుడమి యెల్లఁ | దునియ పెంటగఁ గరివాజిమనుజతతుల
నెల్ల నఱికితిఁ బాండవు లేవురును ము | రారియును సాత్యకియును నా బారిఁ బడరు’.
229
వ. అని చెప్పి 230
ఉ. ‘ఏ మటు పోక శౌరి మది నేర్పడ మున్‌ గని డాఁగురించెనో
యేమిటి కెందుఁ బోయిరొ నరేంద్ర! యెఱుంగము ధర్మదూష్య సం
గ్రామ విధంబులం జయము గల్గియు వారికి దక్కదయ్యె వా
రేమయి రేమి మా కెలస మెక్కె నెఱుంగుము మమ్ము మువ్వురన్‌.
231
వ. అని కలిపికొని పలికి కృపకృతవర్మల వలనుం జూచి. 232
క. ‘వీరి పెనుఁబ్రాపు వడసినఁ | గౌరవకులనాథ! యేన కా దరయంగాఁ
జీరికిఁ బోవని వారును | వైరుల సమయంగఁ జేయ వలఁతుల కారే?’
233
వ. అనిన నమ్మాటలు మనఃప్రియంబులై నాలుకకు లావిచ్చిన నా భూవరుం డమ్మహీసురవరున కిట్లనియె. 234
క. ‘నీవును నీ యోధవరులు | నావైరులఁ బఱిచినంత యాచార్యుండున్‌,
దేవవ్రతుండుఁ బఱిచిరె? | భావింపఁగ దుష్కరంపుఁ బని యిది యనఘా!
235
ఆ. కర్ణు మనము పెద్దగాఁ గొనియాడుదు; | మతనికంటె శల్యుఁ డధికుఁడందు;
రతఁడు నతఁడు నిట్టి యాక్రమంబున నాకుఁ | బ్రియము సేయఁ జూచిరే మహాత్మ!’
236
వ. అని యమ్మువ్వుర మొగంబులు గలయం గనుంగొని ‘మీరు కృతకృత్యులరు. సుఖులరై యుండుఁడు, పునర్దర్శనంబు త్రిదివంబున నయ్యెడుఁగాక. వగలు మాని పొం’ డని పల్కి ప్రాణంబులు విడిచిన, వారలవ్వసుమతీ పతిఁ గౌఁగిలించుకొని వలగొని వచ్చి మరలి మరలి చూచుచు నరదంబు లెక్కియరిగి; రంత నుదయగిరి శిఖరంబునకు ఖరకరుండు వచ్చె, నేను నిత్తెఱంగు నీకెఱింగింపవచ్చితి; నాహవప్రకారం బంతయు నీకు వినిపించుటకు నాఁడు మునీశ్వరుండు నన్నుఁబనిచి యొసంగిన దివ్యదర్శనత్వంబు నీ కొడుకు తోడిదయయ్యె’ నని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రునకు నశ్వత్థామాది రథికత్రయ వ్యాపార కథనపూర్వకంబుగా దుర్యోధను లోకాంతరగమనంబు సెప్పె; ననిన విని ‘యటమీఁదఁ బాండునందను లెవ్విధంబునం బ్రవర్తించి?’ రని యడుగుటయు. 237
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )