| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| కపిసేనతో శ్రీరామచంద్రుని లంకాప్రవేశము | ||
| వ. |
అంత సూర్యాస్తమయం బగుటయు వానరేంద్రులు తమబలంబులం గూడి వేగునందాఁక సేతుబంధనంబునకుఁ గాపుండి రంత సూర్యోదయం బయిన వెంటనే మహాబలశాలియగు హనుమంతుండు సువేలాద్రికరిగి యానగంబు పొంతనున్న హేమకూటంబును నాగపర్వతంబును సింహాచలంబును నను మూఁడుగొండలు వాలపాశంబునం బెకలించి నిమ్మపండ్ల మాడ్కిఁ బూల బంతుల వంతున నెగుఱవైచుచు నేతెంచి నలున కందిచ్చిన నా పర్వతంబులు మూఁడును దొంబది యోజనంబులు నిడుపుగల్గియుండ నవ్విధంబున శత యోజనములు నిడుపును దశయోజనంబులు వెడల్పుగా నీరధిని బంధించి నలుండావార్త రామున కెఱింగించినతోడనే యతండు లంక లగ్గలు వట్ట నుద్యోగించి పనసునుత్తరపుగవను జాంబవంతుఁ బడమటిగవను గవయు దక్షిణపుగవను హనుమంతు దూరుపు గవనుఁ బట్టనియమించిన వారలును లంకాపురంబు లగ్గలకుంజొచ్చి రాక్షసుల నుగ్గునూచంబు గావించుచుండ హతశేషులు పరుగెత్తి యావింతయంతయు రావణున కెఱింగించిన నతండు చింతాక్రాంతుడై దేవాంతక నరాంతకాతికాయ త్రిశిరోమహోదర మహాపార్శ్వాదుల రామలక్ష్మణులం జంపి వారి శిరంబులు గొనిరండని పనుప వా రరుగుదెంచి ఘోరాహవంబునం దమశిరంబులే రామలక్ష్మణుల బాణంబుల కర్పించిన వారిలోఁ జావక మిగిలిన యతికాయుం డరుగుదెంచి తండ్రి యగు రావణునకిట్టు లనియె. |
45 |