| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
పీఠిక
పరమేశ్వరాయ నమః.
శైవమతాభిమానులగు సోదరులారా!
ఈ గ్రంథమును గీర్తిశేషులైన మాతండ్రిగారగు పరశివానంద వంటెద్దు నాగయ్యదేవరవారి ప్రాఁతకాగితపుఁగట్టలో శిథిలములగుచున్న కాగితములయందు వ్రాయఁబడియుండఁ గాంచు భాగ్యము గలిగి కవిత్వము మతాభిమానము చక్కగ నుండుటచే శుద్ధప్రతి వ్రాయించి సాధ్యమైనంతవఱకు వ్రాతప్రతి యందుండు వ్రాతతప్పులను సవరించి వ్రాసి మాతండ్రిగారికి శైవమతమునందుఁ గల యభిమానముచే నీగ్రంథము సంపాదింపఁబడినది కావున వారి పేరు స్థిరముగ నాంధ్రప్రపంచమున నుండునటుల వారి పుత్రులమగు మాచేఁ బ్రచురింపబడియె. ఈ గ్రంథము వ్రాసిన కవి యెవరైనదియు వ్రాతప్రతియందు లేకపోవుట చేతను గవినామధేయము తెలియనందులకుఁ జాల విచారముగ నున్నది. ఈ గ్రంథమును జదువు పాఠకమహాశయులలో నెవ్వరైన నీగ్రంథకర్త నామధేయము, పూర్ణమగు గ్రంథము దొరికిన మాకుఁ బంపెదరేని రెండవకూర్పు తిర్గి ముద్రింపఁ దలంచినారము; కానఁ దప్పక గ్రంథకర్త నామమును, సంపూర్ణగ్రంథమును బంపెదరు గాక!
ఇట్లు విధేయులు,
వంటెద్దు నాగయ్యదేవరగారి పుత్రులు.
1917