| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
యరయ విశ్వామిత్రు నతులప్రభావ మరుదు ప్రస్తుతిసేయ; నైనను వినుము: దశరథాత్మజ! బ్రహ్మతనయుండు గుశుఁడు; కుశుఁడర్థితోడుతఁ గుశనాభుఁగనియెఁ; గుశనాభునకు గాధికొడుకయ్యె; నట్టి కుశపవిత్రుఁడు గాధికొడుకయ్యె నీతఁ; డతిధర్మనిరతుఁఢై యతులసత్త్వమున నితఁడు మహీచక్ర మేలుచునుండి యొలసినవేడుక నొకనాఁడు దన్ను బలసి యక్షౌహిణిబలములు గొలువ వెడలి కాననముల వేఁటలు సల్పి పుడమియంతయుఁజరింపుచుఁజాలబడలి బహుగంధబంధుర ప్రసవమంజరుల బహుఫలంబుల నొప్పు పాదపావళుల బహుపక్షిరవముల బ్రహ్మఘోషముల బహుసరోవరముల బహువేదికలను నలరుచు జాతివైరాదులు లేక మెలఁగు నానావిధ మృగములు గలిగి యనిలాంబుజీర్ణ పర్ణాశులై తపము నొనరించు మునులచే నుల్లసిల్లుచును బన్నగ సిద్ధ సుపర్వ గంధర్వ కిన్నరాదుల వాలఖిల్యాదిమునులఁ గడునొప్పి బ్రహ్మలోకముఁబోలి ఘనత నడరు వసిష్ఠుని యాశ్రమంబునకు నతి478ముదంబున వచ్చి యా వసిష్ఠునకు నతిభక్తి మ్రొక్కిన నతఁడు దీవించి[వా.రా. సర్గ 52] యుచితాసనంబున నునిచి పూజించి ప్రచుర రసస్వాదుఫలమూల తతుల వరుసతో నిచ్చిన వానిఁగైకొనుచుఁ గరములు మొగుడించి కడుభక్తిఁబలికె: “ననఘాత్మ! తపములు నగ్నిహోత్రములు జనలోకనుతములై జరగుచున్నవియె? మీరు మీ శిష్యులు మీ యాశ్రమమున నారయ వీరు వారన కెల్లవారు ముదముననున్నారె మునినాథ!?” యనిన: “నొదవుసమ్మదముతో నున్నారమేము. నీతితోఁజేయుదె 479నీవు రాజ్యంబుఁ? బ్రీతిమై భరియింతె భృత్యవర్గముల? ముదమున రాజ్యాంగములు పరీక్షింతె? వదలక నిర్జింతె వాలుశాత్రవులఁ? గుశలమే సర్వంబుఁ? గుశలమే నీకుఁ? గుశలమే నీ పుత్త్రకులకుఁబత్నులకు?” ననిపల్క:“మీ కృప నఖిలంబుఁగుశల.” మనియెఁగౌశికుఁ.డంత నవ్వసిష్ఠుండు: “కరమొప్ప మా యింటికడ విందుగుడిచి యరుగు480ము నీ.”వని 481యతనిఁబ్రార్థింప నందుకుఁగౌశికుఁడనుమతించుటయు విందు సేయుటకునై వేగంబె యతఁడు తన హోమధేనువుఁదలఁచి రప్పించి: “జననాథవరునకు సకల సేనలకు వివిధభక్ష్యంబులు వివిధ భోజ్యములు వివిధ 482భంగులవిందు వేడ్కఁగావింప వలయుఁగావున నీవు వలయువస్తువులు గలిగింపు” మనవుడుఁ గామధేనువును[వా.రా. సర్గ 53] కలమాన్నతతులు శాకములు భక్ష్యములు కలవంటకము లూరుఁగాయ లంబళ్లు ఫలవిశేషంబులు పాయసాన్నములు జిలుఁగుపాలును వెన్న చీనిచక్కెరలు సద్యోఘృతంబు రసాయనంబులును మద్యవిశేషముల్ మాంసభేదములు వావిరి మఱియు నెవ్వారి కే మేమి కావలె నవి 483యెల్లఁగల్పింప నపుడు నా ధేనుమహిమ కత్యాశ్చర్యమంది గాధేయుఁడప్పుడు కడి మాడసేయఁ గుడిచి సేనలుఁదానుఁగోర్కి దీపింపఁ గడుఁదృప్తిఁబొంది యా గాధినందనుఁడు “ఈ కామధేనువు నెబ్భంగినైనఁ జేకొందు.”ననుచు వసిష్ఠునిఁజేరి: “లక్షగుఱ్ఱంబులు లక్షయేనుఁగులు లక్షధేనువులు వేలక్షలు మణులు నిచ్చెద నీ గోవు నిమ్మునా.” కనిన నిచ్చ నా మునినాథుఁడెంతయు వగచి: “ఇది నాకు జీవనం; బిది నాకుఁ బ్రాణ; మిది నా తపంబునకెల్ల సాధనము; హవ్యకవ్యంబులు నతిథిసత్కార మవ్యాహతముగ నీ యావుచే 484నమరు; నీ పుణ్యధేనువు నీ జాల.” ననిన నా పూర్ణబలుఁడు విశ్వామిత్రుఁడలిగి: “యిమ్మని బతిమాలి యే వేఁడనేల? ర”మ్మని భటసహస్రంబులుఁ దాను[వా.రా. సర్గ 54, 55] గోవు నుద్ధతిఁబట్టుకొని పోవ, నదియుఁ బోవక యమ్మునిపుంగవుఁజూచి “యనఘ!వసిష్ఠసంయమిచంద్ర! నన్నుఁ గొనిపోవుచున్నాఁడు గ్రొవ్వి కౌశికుఁడు; వారింప వకట! దుర్వారుండవయ్యు; నూరక తగునయ్య, యొప్పింప 485నన్ను? ననఘాత్మ! నీయెడ నప486రాధిఁగాను; నను నుపేక్షించుట న్యాయమా నీకు?” ననుడు, ధేనువు 487మాట కావసిష్ఠుండు మనమునఁగృప వుట్టి మఱుమాట వలికె: “నే నేలవిడుతు నిన్నెంతయు బలిమి భూనాయకుఁడు గొని 488పోయెడుఁగాని; క్షత్త్రియు లుద్దండ 489చరితులైరేని ధాత్రీసురోత్తముల్ దా రెంతవార? లీ క్షోణి కధిపతి యీ గాధితనయుఁ; డక్షౌహిణీబలం 490బమరు నీతనికి; నే విధంబున గెల్తు నితనినే?” ననిన నా వసిష్ఠునితోడ నా ధేనువనియె: “మునినాథ! నృప తేజమునకంటె నెందు వినుతింప నెక్కుడు విప్రతేజంబు; కావున నీ కంటెఁగౌశికుం డధికుఁ డే వెంటఁగాకుండు టే నెఱుంగుదును; పనుపుము నను వీనిబలములనెల్ల మునుమిడిఁద్రుంచెద మునినాథ!” యనుడు నా వసిష్ఠుఁడు గోవునపుడు:“సైన్యములఁ గావింపు;బలముల ఖండింపుముఱక.” యనవుడు హుంకార మడరించుటయును: గనుకని ధేనుహుంకారమాత్రమున భూరివిక్రములు కాంభోజులు వుట్టి; రారంగ నత్యుగ్రులగుచుఁ బల్లవులు ఘనవాలలతయందుఁగర్ణంబులందుఁ దనురుహంబులయందు దంతంబులందు ఖురపుటంబులయందుఁగొమ్ములయందు నురులోచనములందు నూరువులందు జననంబు నొందిరి; జఠరగోళమున నొనరంగ యవనులు; యోని వెల్వడిరి తెరలి శకులు; జత్రుదేశంబులందుఁ బొర నుద్భవించిరి భువనభీకరులు కూడి మ్లేచ్ఛులు హాలికులుఁగిరాతులును; క్రోడంబునఁబుళిందగుహ్యకాదులును; చిత్రరూపంబులుఁజిత్రాయుధములుఁ జిత్రలోచనములుఁజిత్రహుంకృతులు నై వీరులై ధీరులై మహోదారు లై వీరభటకోటు లందంద పుట్టి హరులతోఁ గరులతో నందంద491కడిమిఁ బరుగు విశ్వామిత్రబలములఁ492 ద్రుంపఁ జూచి యా కౌశికసుతులు నూర్వురును నేచి నానా 493హేతిహేతులు నిగుడ వచ్చి వసిష్ఠుని వధియింపఁగడఁగి యచ్చట భస్మమై రతని హుంకృతిని. అంత, విశ్వామిత్రుఁడఖిలసైన్యములు నంతకువీటికి నరిగిన వగచి యతులపరాక్రములగుచున్న తనదు సుతుల 494చావునుఁజూచి శోకించి యంతఁ దనరాజ్యమున నొక్కతనయుని నునిచి చని హిమాచలమునఁజలమున నిలిచి త్రిపురారిఁగూర్చి యతిప్రయత్నమునఁ దపమొనరింపఁబ్రత్యక్షమౌటయును హరుచేత వివిధ దివ్యాస్త్రముల్ వడసి యురువడిఁజనుదెంచి యుగ్రుఁడై కడఁగి మొగి వసిష్ఠాశ్రమంబున వహ్నిశిఖలు నెగయఁ బెల్లేసె నాగ్నేయబాణమున. నప్పుడా బాణాగ్ను లాశ్రమంబెల్లఁ గప్పి మండుటయును గని వసిష్ఠుండు[వా.రా. సర్గ 56] కాలదండముఁగొన్నకాలుఁడో యనఁగఁ గేల దండముఁదాల్చి కినుకతో వెడలి: “యోరి విశ్వామిత్ర!495యోడక వచ్చి భూరిపుణ్యాశ్రమంబులు గాల్పఁ496దగునె? యెనయ నీ వెక్కడ? యే నెక్క?”డనిన ఘనరోష దీప్తుఁడై కౌశికుం497డడరి యతనిపై రౌద్రంబు, నైంద్రంబుఁ,బాశు పతము, నైషికము, 498జృంభణము,శోషణముఁ, జటుల మోహనమును, సంతాపనంబుఁ, బటుతరవజ్రంబు, బ్రహ్మపాశంబుఁ, గనలు, పైశాచంబుఁ,గాలపాశంబు, ఘన 499విష్ణుచక్రంబుఁ,గాలచక్రంబు, వారుణ,గాంధర్వ,వాయవ్య, సౌర, ఘోరాస్త్రములు కోటికోటు లేయుటయుఁ గలయంగ విస్ఫులింగంబులు సెదర బలువడి నుగ్గాడె బ్రహ్మదండమున. నలుక విశ్వామిత్రుఁడంత బ్రహ్మాస్త్ర 500మలవడ సంధించి యార్చి యేయుటయు సకలగీర్వాణులు సకలసంయములు సకలగంధర్వులు సకలపన్నగులు సకలభూతంబులు సకలదిక్పతులు సకల501తారకములుఁజంద్రసూర్యులును సకలలోకంబులుఁ జలనంబునొంద సకలదిక్కులు మండఁ502జటులవేగమున బ్రహ్మాండ మద్రువంగ503బలువడి504నెగడి బ్రహ్మదండము దాటి పఱతేరఁజూచి బ్రహ్మాదులకు నడ్డపడరానియట్టి బ్రహ్మాస్త్ర మవలీలఁ 505బాఱంగ మ్రింగె. సురుచిరబ్రహ్మతేజోమూర్తి వెలుఁగ నరుదార యమ్మునియంగరోమముల నెఱమంట లెగయ ననేకబాణంబు లఱిముఱి వెడలి విశ్వామిత్రుఁ దాఁకి చుఱువుచ్చఁదొడఁగిన స్రుక్కి కౌశికుఁడు నెఱి సెడి యెంతయు నిజసత్త్వ మెడలి: “తరమిడి యా బ్రహ్మదండ మొక్కటనె వరశస్త్రకోటులు 506వ్రయ్యలై పొలిసె; నత్రస్త, మచల మీయన బ్రహ్మబలము; క్షత్త్రబలం బిది కాల్పనే.” యనుచుఁ[వా.రా. సర్గ 57] జెనఁటియై మగుడి కౌశికుఁడాలుఁదానుఁ జని ఘోర507తపమర్థిఁజలుపుచునుండె. నటమీఁద సుతుల విశ్వా 508మిత్రమౌని పటుసత్త్వవంతులఁబడసె నల్వురను విను మధుష్యంద హవిష్యందనాము లన దృఢనేత్ర మహారథులనఁగఁ. జలము డింపక వేయిసంవత్సరమ్ము లలఘు 509నిష్ఠను దపంబర్థితోఁజేయ వనజసంభవుఁడంత 510వచ్చి కౌశికునిఁ గనుఁగొని యెంతయుఁగరుణించి పలికె: “నీతపంబున మెచ్చి యిచ్చితి 511నీకుఁ బ్రీతిమై నిట రాజ512ఋషిపదంబనఘ!” యని పోవ గాధేయుఁడతిదీనుఁడగుచు: “నెనయంగ 513నేఁ దప మెంతసేసినను గడచని బ్రహ్మర్షిఁగానేర నైతి; 514నెడపడి చెడిపోయె నీ యుగ్రతపము నీరాజఋషి 515పదంబే నొల్ల.”ననుచు ఘోరతపంబు గైకొని సేయుచుండె. నంత నిక్ష్వాకు కులా 516గ్రణియైన సంతతకీర్తి త్రిశంకుఁడన్ రాజు తన శరీరముతోడఁ దా నాకమునకు నొనరంగఁజనుజన్న మొనరింపఁదలఁచి: భక్తి వసిష్ఠు రాఁబనిచి ధర్మాను రక్తుఁడై యా మునిప్రవరు నీక్షించి: “దివిజలోకమున కీ దేహంబుతోడఁ జవరఁగా జన నొక్కసవనంబు మీర లనురక్తిఁజేయింపుఁ డనఘ! నా చేత; మునులరప్పింపుఁడు ముదమొప్ప.” ననిన “నరనాథ! యొడలితో నాకలోకమున కరుగ నసాధ్య మీ నవనీశులకును.” అనవుడు రాజన్యుఁడట దక్షిణమున ఘననిష్ఠఁదప మొప్పఁ గావింపుచున్న చిరపుణ్యులగు నా వసిష్ఠపుత్త్రులకుఁ గరమర్థిఁ బ్రణమిల్లి కరములు మొగిచి: “దేవలోకమున కీ దేహంబుతోడఁ బోవచ్చుయాగంబుఁ517 బూని నాచేతఁ జేయింపుఁ.”డనిన“వసిష్ఠుఁ‘డీ తెఱఁగు 518సేయింపుఁ’డనెనేనిఁజేయింతు.”మనుడు నా రాజచంద్రుఁడిట్లనియె: “వసిష్ఠుఁ ‘డే రాజులునుజేయ రీక్రతు’ వనుడు మీకడ కిటు రాక; మీరైన నన్నుఁ జేకొని జన్నంబు సేయింపవలయు. నరయఁ బురోహితులగువారు గారె ధరణీశులకు సర్వధర్మసాధకులు.” 519అనిన వాసిష్ఠులా యవనీశుఁజూచి: “ఘనుఁడు వసిష్ఠుండు గాదన్న తెఱఁగు[వా.రా. సర్గ 58] నిర్మలమతి నొరుల్ నేర్తురే చేయ దుర్మతివగు నీకుఁదోపదుగాక?” యనవుడు నిర్విణ్ణుఁడై సంయమీంద్రు తనయుల నీక్షించి ధరణీశుఁడనియె: “మీ తండ్రి నిరసించె; 520మీరును జేయ రైతి రే తెఱఁగునైన నీ క్రతువు; హితబుద్ధిలేని మీ రేల నాకింక? నితరులచేతఁ జేయించెదఁగాక.” యనిన:“జండాలుండవగు.”మంచు నలుకఁ గనుఁగొని పల్కి రా ఘనపుణ్యు,లంత. భాసురంబగు మహీపాలుతేజంబు వాసిష్ఠకోపాగ్ని వడిఁగాలె ననఁగ నారయ నీలదేహంబును నీలి చీరయు విరిసిన శిఖయును దనర 521నంటిన శుద్ధంబునైన మాలిన్య మంటించు నీ రూపమనుభంగి దోపఁ బ్రణుతవర్ణస్ఫూర్తిఁ బరిగిన కనక మణిభూషణము లయోమయములై తనర నోజమైఁ గష్టనామోక్తి భేదములు నా జాతికనురూప522మై వింతమీఱ జననాథుఁ డతిఘోరచండాల 523రూప మొనరంగఁ524జొప్పడియున్న నీక్షించి పౌరభృత్యామాత్య బంధువర్గంబు లారాజు 525వర్జించి; రంత నా రాజు నొదవిన భయమున నొయ్య మెట్టుచును నొదుఁగుచు జనులకు నోసరింపుచును జని మహాతేజు విశ్వామిత్రుఁగనినఁ గనికరం బొదవ నా గాధినందనుఁడు: “ఇల నయోధ్యాపురం బేలెడి నీకు నెలమిఁజండాలత్వ మేల వాటిల్లె? నే తెఱంగున వచ్చె? నెఱిఁగింపు.”మనిన నాతండు ముకుళితహస్తుఁడై పలికె: “నిరవొంద బొందితో నింద్రలోకమున కరుగఁ జొప్పడునట్టి యాగంబు నన్నుఁ జేయింపుఁడనిన వసిష్ఠుఁ డత్తెఱఁగు సేయింపరాదని చెప్పె నుత్తరము. నా వసిష్ఠునిపుత్త్రులగువారు ‘నతఁడు గావింపరా దన్నఁగా’ దనిపల్కి రితరులచేతఁ జేయింతు నన్మాట కతిరోషమున ‘మాలవగు’మన్న నైతి; ననఘ!526నేఁ జేసెదనన్న యధ్వరము 527నొనరింతు;528బొంక నే నుర్వినెన్నఁడును నెట్టి యాపదలందు; నిటమీఁదనైన నెట్టన సత్యంబు529నెగడఁబాలింతుఁ; బెక్కుజన్నంబులుఁబెక్కు ధర్మములుఁ బెక్కువతోఁ జేసి పెంపు గైకొంటి; గురులఁబూజించితి; గురులు నా వలనఁ గరుణ సాలమి ధర్మకార్యంబు 530నిలిచెఁ; బౌరుషంబది దైవబలము లేకున్న నేరమి వాటించు; నిక్కువం బరయ. నే విధంబునైన531నీవు నా పాలి దైవమై రక్షింపఁదగుదు 532గా కనఘ!” యనిన విశ్వామిత్రుఁడతని వీక్షించి: “జననాథ! నీవింక 533సంతాప ముడుగు;[వా.రా. సర్గ 59] దీనునిఁజేపట్టితిని; త్రిశుద్ధిగను మౌనుల రప్పించి మఖము సేయించి దేహంబుతోడనే తివిఱి నీ పలుక పోహంబు గాకుండఁబుచ్చెద దివికి; విను, నిన్నుఁబరమపవిత్రుఁగావింతు.” నని పల్కి శిష్యులనందఱఁ జూచి: “మునుకొని మీ రెల్లమునుల ఋత్విజుల గొనిరండు వెసఁద్రిశంకునియాగమునకు.” నని నియోగించిన నట్ల వారరిగి మునివరేణ్యులనెల్ల మొగిఁదోడుకొనుచుఁ గదియ విశ్వామిత్రుకడ కేఁగుదెంచి “ముదమంద ననఘాత్మ! మునులదెచ్చితిమి; రారు వసిష్ఠునాశ్రమ534మువారెల్ల; వారలు దక్కంగ వచ్చిరందఱును. 535ఆ వసిష్ఠునిపుత్త్రులాడిరి గొన్ని; 536యా వాక్యములు విను.”మంచు వారనిరి: “మతి విచారింపక మఖము సేయించు నతఁడు రాజట! మాలఁడట సేయువాఁడు చండాలుమఖమున సకల 537మునీంద్రు లుండి భోజనము లే యుక్తిఁజేసెదరు? ఆడ కే మొగముల నర్థివచ్చెదరు వేడుక సురలు హవిర్భాగములకుఁ? బరగ విశ్వామిత్రపాలితుండైన నరుఁడెట్లు పొందెడు నాకలోకంబు? విన విస్మయం!”బని వెలయ దూషించి రనిన విశ్వామిత్రుఁడగ్నియై మండి: “కడునిష్ఠఁదప మిట్లు గావించునన్ను నడరి దూషించుపాపాత్ము లందఱును నూతనగతి నేడునూఱు538వేలేండ్లు భాతిగాఁగ్రవ్యాదభావంబుఁ దాల్చి మానుగా శునకాదిమాంసముల్ దినుచు హీనులై చరియింపనిమ్ము లోకముల; నసమున న న్నాడు నామహోదయుఁడు వసుధ నిషాదుఁడై 539వర్తింపనిమ్ము.” అని శపియించి సంయముల నీక్షించి: “మునులార! యీ రాజముఖ్యుఁ ద్రిశంకు[వా.రా. సర్గ 60] 540నున్నతకులశీలు నురుకీర్తిలోలు సన్నుతధర్మజ్ఞు సత్యప్రతిజ్ఞుఁ గ్రతువుసేయింపుఁడు గాత్రంబుతోడ నితఁడింద్రపురి 541కేఁగ నిరవొప్ప.”ననిన నా ఋషిమాటల కఖిలసంయములు దారు విచారించి తమలోన ననిరి: “గాధిసూనునిమాట గాదంటిమేనిఁ గ్రోధించి శపియించు ఘోరవాక్యములఁ; గాన చేయింతము క్రతువు గౌశికుఁడు మానుగాఁజెప్పిన మహితమార్గమున.” నని పల్కి మునులెల్ల నధ్వరకర్మ మొనరింప542మంత్రప్రయోగాదు లమర నా గాధితనయుండు యాజకుండగుచు యాగభాగములకు నమరులఁబిలిచెఁ. బిలిచిన“రా.”మంచుఁ బేరెలుంగెత్తి పలికిరి సుర. లటు పలుకఁగౌశికుఁడు దిశల రోషానల543దీప్తులు నిగుడఁ గుశపవిత్రము చేతఁగొని స్రువంబెత్తి: “నాకేంద్రలోకంబునకుఁద్రిశంకుండ, నీ కోరినట్ల నే నిన్నుఁబుచ్చెదను; నడరంగ నే బాల్యమాదిగా నియతి విడువక తపము గావించితినేని బొందితోడనెకూడఁబోయి స్వర్గంబు నందుము పొ.”మ్మన్ననతఁడు వోవుటయుఁ “జండాలుఁడవు నీవు; స్వర్గంబునందు నుండనీ.”నని యింద్రుఁడు దరిత్రోచుటయుఁ గడఁక“విశ్వామిత్ర,కావవే.”యనుచు వడిఁదలక్రిందుగా వచ్చుచుఁబలుక: శరణార్థియగు నా త్రిశంకునిఁజూచి కరుణావిధేయుఁడై గాధినందనుఁడు: “జననాథ! నీ వాకసమునందె నిలువు.” మని పల్కి నిలుపుచు నట544దక్షిణమున నలుకఁద్రిశంకున కమరేంద్రుతోడి చలమున వేఱొక్కస్వర్గంబు సేసి లలి నందు సప్తర్షులను దారకముల నలవడఁబుట్టించి యానాకమునకు వేఱు దేవతలఁగావింప, నింద్రునకు మాఱింద్రుఁగల్పింప మదిఁదలంచుటయుఁ జాల భీతిల్లుచు సంయముల్ సురలు నోలి విశ్వామిత్రునొద్దకు వచ్చి: “యిలలోన మునినాథ! యీ త్రిశంకుండు దలపోయ గురుశాపదగ్ధుండు గాన తగ నాకముననుండఁదగ.” దన్నమాట దగవుగాఁగొని గాధితనయుండువలికె: “సురలార!‘యీత545ఁడు సురలోకమునకు 546నరిగెడు మేనితో’నని పల్కినాఁడ; నా మాట నిజముగా నౌట కీనాక మీ మహీనాథున కిట సెల్లనిండు; ప్రభ నొప్ప లోకముల్ పరగునందాఁక నభమునఁబొల్చు నీ నక్షత్రపంక్తిఁ గలసి యచ్చరవీథి కంటెను మీఁదఁ దొలఁగని తేజంబుతో వెలుఁగొంది బృందారకస్ఫూర్తిఁబెంపొంది శిరము క్రిందై త్రిశంకుండు కృతపుణ్యుఁడగుచుఁ గరమొప్ప నీ తారకంబులనడుమ నురుతరకీర్తిమై నుండనిం.” డనిన ననుమతింపుచు నప్పు డా యనుగ్రహముఁ గొనియాడి ముని వీడుకొని సురల్ మునులు లలి నిజస్థానంబులకు నేఁగి; రంత, నెలమిఁగౌశికుఁడు మునీంద్రులఁ జూచి:[వా.రా. సర్గ 61] “యిమ్ముగా దిటమీఁద547నిది దపంబునకు; సమ్మర్ద మిక్కడ సాలంగఁ గలిగె; మునులార! మనమింక ముదము సిత్తమునఁ దనరనొండెడకుఁబో548దండురం.”డనుచు గడఁక నక్కడ వాసి కదలి విశాల కడ కేఁగి యందుఁబుష్కరతీర్థమునను అంబుఫలాహారి యగుచుఁ బెక్కేండ్లు పంబిననిష్ఠఁ దపంబు గావింప నంబరీషుం డయోధ్యాపుర విభుఁడు శంబరరిపుమూర్తిసముఁడట్టియెడను వెలయంగఁగ్రతువు గావింపంగఁబూని బలభేదిచే యాగపశువుఁ గోల్పోయి యరసి లేకున్నఁబ్రాయశ్చిత్తవిధికి నరపశు వడుగుచు నానాశ్రమముల భృగుతుంగమునయందుఁ బృథుతపోనిష్ఠఁ దగ నున్నరుచికునొద్దకుఁబోయిమ్రొక్కి: “కరుణాఢ్య!యేను యాగము సేయఁబూని పరికింపనేరక పశువుఁగోల్పడితిఁ; గొనకొని యొకలక్షగోవుల నిత్తుఁ; గొని 549నాకుఁబశువుగాఁగొడుకు నీ వయ్య.” నావుడు 550నతఁ:డేను నా పెద్దకొడుకు పై వేడ్కసేయుదుఁ; బశువుగా నీను.” నావుడు మునిపత్ని: “నా పిన్నకొడుకు పై వేడ్కసేయుదుఁ; బశువుగా నీను.” అని పూని యిరువురు నాడు వాక్యములు విని శునశ్శేపుఁ డుర్వీపాలుఁజూచి: “తనపెద్దకొడుకు మాతండ్రి వాటించుఁ; దనపిన్నకొడుకు మా తల్లి వాటించు; వారేల నీ? కేనువచ్చెద; నన్నుఁ గోరి వారికి నిమ్ము గో సహస్రములు.” ననిన నట్ల యొనర్చి యమ్మునిపుత్త్రుఁ గొని రథంబెక్కించుకొని శీఘ్రవృత్తి జననాథుఁడెంతయు సంతోషమొప్పఁ జనిచని పుష్కరాశ్రమభూమి విడిసె. నచట శునశ్శేఫుఁడతి తపోనిష్ఠ నచలుఁడై యున్న విశ్వామిత్రుఁగాంచి తన మేనమామ యాతఁడు గాన ప్రేమ ననలొత్త రచితప్రణాముఁడై పలికె: “ననుఁ దల్లిదండ్రు లీ నరవరాగ్రణికి ననఘాత్మ!పశువుగా నమ్మి పొమ్మనిరి. చెలువొంద నీ రాజు సేయుజన్నంబు ఫలియింపఁజేసి నా ప్రాణము ల్గావు; తల్లియుఁదండ్రియు దైవంబు గురువు నెల్ల 551చుట్టములు నా కీవేళ నీవ.” యని 552దైన్యపడఁగ విశ్వా553మిత్రమౌని దన తనూభవుల నందఱఁజూచి పలికెఁ: “బ్రాకటంబుగఁదమపరలోకమునకు నైక దా సుతులఁబుణ్యాత్ములు 554గండ్రు. పరలోక మిదియ నా పాలికి; నన్ను శరణంబు 555సొచ్చు నీ సంయమిసుతుఁడు; ఇతఁడు నా మేనల్లుఁ;డితని రక్షింపుఁ; డితనికై ప్రాణంబు లిండు మీరొకరుఁ; డడిగెద మి.”మ్మన్న నటు సేయఁగొడుకు లొడఁబడకున్న నత్యుగ్రుఁడై 556కినిసి: “శునకమాంసముఁ557దించు స్రుక్కి వేయేఁడు లనుభవింపుఁడు దుఃఖ”మని శాపమిచ్చి కౌశికుఁ డత్యంత కారుణ్యబుద్ధి నా శునశ్శేఫు నొయ్యనఁజేరఁబిల్చి: “యేను మంత్రములు రెండిచ్చెద558నీకు; వాని ననుష్ఠింపు వదలక నీవు; అవి నిన్ను రక్షించు; నంబరీషునకు సవనతంత్రంబెల్ల సఫలంబు సేయు.” ననిచెప్పి మంత్రంబు లారెండు నిచ్చె; ననుపమభక్తితో నతఁడుఁగైకొనియె. మఱునాఁడు వచ్చి యమ్మనుజవల్లభుఁడు వఱలెడు నిజయజ్ఞవాటంబు సొచ్చి విశసింపఁబూని యవ్విమలాత్ముఁదెచ్చి పశుపూజసేసి యూపమున బంధించె. నంత559నా మునిపుత్త్రుఁడా మంత్రయుగము శాంతుఁడై560జపియించి చలియింప561కున్న నచటికి562దేవేంద్రుఁ డర్థితో వచ్చి సుచరిత్రుఁడంబరీషుఁడు భక్తిఁజేయు క్రతువుఁబూర్ణము సేసి కడనున్నరుచికు సుతుఁజిరాయువుఁజేసి సురలతోఁ563జనియె. నరుదైనతపమున నంత వేయేఁడు లరిగిన బ్రహ్మ, విశ్వామిత్రుఁగదిసి:[వా.రా. సర్గ 63] “నీకు ఋషిత్వంబు నీ తపశ్శక్తిఁ జేకూరె.”నని యొప్పఁజెప్పి విచ్చేసె. నంతటఁదనియక యత్యుగ్రతపము సంతతనియతితోఁజలుపుచు నుండఁ గామరూపము లీలఁ గైకొననేర్చు కామునిబాణంబు కమనీయకంబు చెలువంద నప్సరస్ స్త్రీమూర్తిఁదాల్చి మెలఁగెడుగతి దోప మేనక యపుడు 564లలితయౌవనకళాలావణ్య 565మొప్ప జలకేళిఁదేల నా సతిజాఱుకొప్పుఁ? జికిలిచూపులు నునుఁజెక్కులు ముద్దు మొకముఁగెంపులమోవి మొలకనవ్వులును బొంగారుకుచకుంభములుఁబదార్వన్నె బంగారుపొడిరాలు బాహుమూలములుఁ జిన్నారి నూఁగారు సింగంపుఁగౌనుఁ బొన్నపూపొక్కిలిఁ బొదలెడిపిఱుఁదు లూరులతీరు నోరూరఁగాఁ జూచి పేరువాఁడి మరుండు పెళపెళ నార్వ ధ్యానంబు మౌనంబుఁదపముఁబోకార్చి మేనఁగళల్ గ్రమ్మ మేనకఁజూచి: “నన్నుఁ566గాయజుకేళి నలినాక్షి! పొందు.” మన్న 567నామాటకు నంగీకరించి పది568యేండ్లు మదిసోలి భావజుకేళి సదమదంబుగ సౌఖ్యసరసిఁదేలించె. 569నంత విశ్వామిత్రుఁడంతరంగమున నెంతయుఁజింతించి యిదియెల్లఁదెలిసి ‘నా తపోవిఘ్నంబునకునై నిలింపు లీ తలోదరిఁబుచ్చు; టెఱిఁగితి.’ననుచు సురలోకమునకు నా సుదతి వీడ్కొలిపి పరగంగ నుత్తరపర్వతంబునకు నరిగి కాముని గెల్తు ననువిచారమున నరుదార570వేయేఁడు లతిఘోరతపము కౌశికీతీరంబుఁ571గదిసి యచ్చోట నా శైలవనభూమి నతినిష్ఠఁ జలుప నమరులు భీతిల్లి యజునితో ననిరి: “కమలజ! నీచేత గాధినందనుఁడు పరగ మహర్షి యన్పలుకున కర్హుఁ; డరయంగనిటమీఁద.”ననిన బ్రహ్మయును జనుదెంచి యెంతయు సంతోషమంది కనుఁగొని కౌశికుఁగరమర్థిఁబలికె: “నీవు మహర్షివై నెగడులోకముల.” నావుడు నమ్మునినాథుండు వలికె: “నీరజాసన! నన్ను నీవు నీ చిత్త మారంగ బ్రహ్మర్షి వన్నంతదాఁకఁ జరియింతుఁదప”మన్న:“జరియింపు”మనుచు నరవిందభవుఁడేఁగె;నంతఁగౌశికుఁడు బ్రహ్మదేవుఁడు వోవఁ“బరమపావనత బ్రహ్మర్షి572తన మేను బడసెద.”ననుచు 573నాహారములు మాని యతినిష్ఠ నూర్ధ్వ బాహుఁడై మఱి వాయుభక్షుఁడై నిలిచి 574పనివడి వేసవిఁబంచాగ్ని మధ్య మున వానకాల మిమ్ముల బట్టబయల మంచుకాలంబున మడుఁగులయందు నంచితగతిఁ జేసె నత్యుగ్రతపము. నీ భంగి వేయేఁడు లేఁగినపిదప సౌభాగ్యవతి రంభ జంభారి సూచి: “యెలమిమై దేవతాహితకార్య మొకటి చెలువార నీకు నేఁ జెప్పెద వినుము:[వా.రా. సర్గ 64] కామగోచరుఁజేసి కౌశికుఁదపము వామలోచన! నీవు వారింపు.” మనిన: “నాకేశ! కోపించి నన్ను శపించు నా కౌశికుఁడు;575సైఁపఁ; డటుగాన వెఱతుఁ; గ్రూరతపంబుఁగైకొనియున్న యతనిఁ జేర నా తరమె? శచీనాథ! నీకు మ్రొక్కెద; నమ్మహామూర్ఖునిదిక్కు నిక్కి చూడఁగ నోప; నీ పాద మాన; యెఱిఁగియెఱింగి తా రెట్టివెంగలులుఁ గొఱవితోఁదలఁగోఁకుకొనువారు గలరె?” 576యనిపల్క నారంభ ననిమిషేంద్రుండు గనుగొని: “నీకేల? కమలాక్షి!వెఱవఁ. గుసుమాయుధుఁడు గండుగోయిలల్దాను నెసకంబు దోడుగా నేతెంచు.”ననిన నడతీగ కైవడి నవ విలాసంబు లడర విశ్వామిత్రునాశ్రమంబునకు రాయంచనడపున రంభ యేతెంచి కోయిల గూయంగఁగుసుమాస్త్రుఁడేయఁ గడునొప్పఁబాడుచుఁ గదియఁగౌశికుఁడు పడఁతుక నింద్రుఁడు పంచు టెఱింగి “పదివేలవర్షముల్ పాషాణ భావ మొదవంగఁగైకొనియుండి యా పిదప, నురుతపోనిధియైన యొక విప్రువలన సరసిజానన! పొందు శాపమోక్షణము.” అని పల్కఁబాషాణమయ్యె నా రంభ; మనసిజుండును నేఁగె మది భీతినొంది. తన తపమొక్కింత దఱిగిన నెఱిఁగి తనలోన నగ్గాధితనయుఁ డూహించి. “577అపుడు కామంబుననడఁగె నా తపము; ఇపుడు క్రోధంబున కిచ్చితి.”ననుచు మదిలోన వగచి:“కామంబుఁగ్రోధంబు వదలి నిరాహారవంతుఁడై 578నియతి విజితేంద్రియుండునై వేయువత్సరము లజుఁడు మెచ్చఁగఁదపంబతినిష్ఠఁజేసి అనయంబు బ్రహ్మర్షి ననిపించుకొందు, ననియుత్తరమువాసియటతూర్పు579దెసకు[వా.రా. సర్గ 65] నెనసి వెండియును దేవేంద్రుండుసేయు ఘనవిఘ్నకోట్లకుఁగలఁగక నిలిచి యరుదెంచి యంత సిద్ధాశ్రమభూమి నురుఘోరతపముసేయుచు నుండఁదొడఁగె వరతపోనియతిమై వర్షసహస్ర మరుగఁబారణ సేయనని580యున్నచోట581 బలభేది 582కపటంబుఁ583బాఱుఁడై వచ్చి నిలిచి గ్రాసము వేఁడ584నెమ్మితో నిచ్చె; నా యమరాధీశుఁడడరి భోజనము సేయుచో నన్నంబు శేషింపకున్న మఱియును వేయేండ్లు మౌనియై నిలిచి తఱుఁగని నిష్ఠతోఁదప మాచరింప నప్పుడమ్మునినాథు నౌఁదలఁబుట్టి కప్పె లోకముల నుత్కటమైన పొగలు; కలఁగెఁబయోనిధుల్; గంపించెధరణి; కులగిరుల్ గదలె; దిక్కులు 585వ్రక్కలయ్యె; నమరులు గంధర్వులఖిలసంయములుఁ గమలగర్భుని భక్తిఁగని మ్రొక్కియనిరి: “ఆయతచిత్తుఁడై యత్యుగ్రతపము సేయు586చునున్నాఁడు సెలఁగి కౌశికుఁడు; అతనిమనోరథం బర్థి 587సిద్ధింప మతి588నిచ్చి తపమింక మానుపకున్న ననఘ! విశ్వామిత్రు నత్యుగ్రమైన ఘనతపోవహ్నిచేఁగాలు లోకమ్ము.” లనవుడు వారితో నప్పుడ కదలి వనజాసనుఁడు వచ్చి వరదుఁడై నిలిచి: “వినుము589విశ్వామిత్ర!విపరీతతపము పనిలేదు చాలింపు; బ్రహ్మర్షివైతి.” వనినఁగౌశికుఁడు బ్రహ్మాదిదేవతలఁ గనుఁగొని పల్కె నక్కజమైన భక్తి: “బ్రహ్మర్షి 590తన మేను పడసితినేని బ్రహ్మపుత్త్రుఁడు లోకపావనమూర్తి చిరపుణ్యరాశి వసిష్ఠుండు వచ్చి యరసి నన్ బ్రహ్మర్షి 591వనకున్న నమ్మ.” ననిన వసిష్ఠుని నబ్జసంభవుఁడు 592ననిమిషులును బిల్వనతఁడేఁగుదెంచి: “బలితంపుఁదపమున బ్రహ్మర్షివైతి; తెలిసితి; మిందు సందేహంబు593వలదు. ముదమొప్పఁజను.”మన్న మునివసిష్ఠునకుఁ బదిలుఁడైమ్రొక్కి సద్భక్తిఁ బూజించె. నంత విశ్వామిత్రు నఖిలదేవతలు నెంతయు దీవించి యేఁగిరి దివికి. నా రూఢపదుఁడు విశ్వామిత్రుమహిమ లారయ నిట్టిమహాద్భుత క్రమము.” లని పల్క రఘురాముఁడాలక్ష్మణుండు జనకాదులగు సభాసదులు మోదిలిరి. ‘ఇల్లడ జనకునియింట నుగ్రాక్షుఁ డెల్లరు నెఱుఁగ మున్నిడిన చాపంబు కడఁకమై విఱిచి రాఘవుఁడేపు మిగిలి కడుమోదమున సీతఁగైకొను నెల్లి.’ యని రసాతలమున కంతయుఁజెప్పఁ జనినచందమున భాస్కరుఁడస్తమించె. జనకు వీడ్కొని గాధిసంభవుఁడొక్క యునికిపట్టున రామయుక్తుఁడై యుండె. ననుపమప్రీతిమై నా రాత్రి గడపి యినుపొడుపున నిత్యకృత్యముల్ దీర్చి[వా.రా. సర్గ 66] జనకుచెంతకు రామసహితుఁడైపోయి యనియె విశ్వామిత్రుఁడందఱు వినఁగ: “నినకోటిసమతేజు లీ దివ్యమూర్తు లనఘకీర్తులు వీ రనన్యగోచరులు; ఈ పుణ్య ధనులు నీ యింట నున్నట్టి చాపంబు సూడంగఁజనుదెంచినారు; |