ఇతిహాసములు ఉత్తరరామాయణము జయంత మేఘనాదుల యుద్ధము
జయంత మేఘనాదుల యుద్ధము
ఉ.స్వామి! మహాప్రసాదమని చయ్యన నాతని తేరి సూతుఁడౌ
గోముఖుఁ డాగతిం బఱప గోముఖనాదము లుల్లసిల్ల సు
త్రామసుతుండు రావణి నుదగ్రత మార్కొని భూరి బాణధా
రామయగాత్రుఁ జేసె నమరప్రకరం బది చూచి క్రమ్మఱన్‌.
312
చం.పకపక నవ్వి రావణి సెబాసుర యోరి జయంత! దేవతా
నికరములో బలాఢ్యుఁడవు నీవె యొకించుక సేపు పాఱి పో
వక నిలు నిల్చినం బొగడవచ్చును నిన్నని పల్కి శాతసా
యకముల సారథిన్‌ హయచయంబుల నొంచి యహంకరించినన్‌.
313
చం.శతమఖనందనుం డతని సారథి నొంచి నిశాతసాయక
ప్రతతుల నించి మేనురుధిరంబున ముంచిన నొచ్చి దండతా
డితభుజంగము మాడ్కి భ్రుకుటిప్రకటీకృతరోషుఁడై దశా
స్యతనయుఁ డా జయంతుని సహాయుల నొవ్వఁగ నేసెఁ దూపులన్‌.
314
వ.ఇచ్చెలువున జయంతునికిఁ దోడుపడవచ్చిన వియచ్చరుల మేను లుచ్చిపాఱ శరోచ్చయంబులు నిగిడించి, యచ్చిఱుత రక్కసుండు వెండియు.315
చం.అరదముమీఁదనుండియె బయల్పడ కుగ్రతమంబు పన్ని యం
బరగతుఁడై శరాసనకృపాణ పరశ్వథ భిండివాల ము
ద్గర పరిఘాస్త్రతోమర గదా ముసలక్షురికాదిసాధనో
త్కరములు శైలశృంగములు గాటముగాఁ గురియించె నొక్కటన్‌.
316
ఉ.అందున భీతిఁ బొంది సురలందఱు నిల్చినచోట నిల్వ కెం
దెందొ చనంగ నాత్మభటులెంతయు వంతఁగనంగఁభజూచి సం
క్రందననందనుండు దశకంఠసుతోత్థ తమః పరంపరన్‌
గుందియు దేవసైన్యములఁ గోల్తలఁ జేయఁ గడంగుచున్నెడన్‌.
317
తే.గీ.ఆ మహేంద్రకుమారు మాతామహుండు
మనుమఁ డలయుటఁగని తన మాయవలన
నెత్తికొనిపోయె జలరాశి కెవ్వరతని
పోక తెలియక యద్భుతాంబుధి మునుంగ.
318
కం.పతి లేని చానవలె దై
వతసేన గలంగి దానవప్రభుసుతుచే
నతిదైన్య మొందఁగని సుర
పతి మాతలి దిక్కు చూచి పటుమతిఁ బలికెన్‌.
319
చం.అలజడిఁ జెందె సేనలు, జయంతుని నెక్కడ గాననైతి వే
ల్పులకు నజయ్యుఁడై సమరభూస్థలి రావణి మించె వీనితోఁ
గలహ మొనర్పకున్న నిఁకఁగార్యము గాదు రథంబు వేగ మా
తలి! యటుపోవని మ్మరివధం బొనరించెద నేఁడు నావుడున్‌.
320
సీ.కమనీయ శతకోటి ఘంటికాఘణఘణా - రవముచే దిక్కరుల్‌ సెవుడు వొరయ
దశసహస్రోదగ్రతర మణీమయచక్ర - చంక్రమణస్థితి జగతి వడఁక
సకలలక్షణవిచక్షణ లక్షహయఖురో - త్థరజోహతుల సముద్రములు గలఁగ
శరదభ్ర విభ్రమ స్ఫురదదభ్ర ధ్వజో - ద్భటభటార్భటి నభస్తటము వగులఁ
 
గీ.జక్రచాపగదాఖడ్గశక్తి శూల
కుంతతోమర పరిఘాది ఘోరసాధ
నాంశువులు శత్రుదృక్కాంతు లపహరింప
నమరవిభు తేరు మాతలి యపుడు నడిపె.
321
చం.నలుగడలన్‌ మరుద్వసుగణంబులు సాధ్యులు రుద్రు లశ్వులుం
గొలువ వరాప్సరోయువతికోటులు ముందు నటింప శంఖమ
ర్దళమురజాది వాద్యనినదంబులు బోరుకొనంగఁ జారణుల్‌
పలుమఱు నెంచఁగా ననికిఁ బాకహరుం డరుదెంచుచున్నెడన్‌.
322
చం.అభిముఖుఁడై దశాననుఁ డుదంచిత కాంచన కింకిణీక్వణ
క్షుభితదిశాకరిశ్రవణకోటరమౌ రథ మెక్కి వాహినీ
ప్రభు లిరువంకలం గొలువ బంధురతూర్యరవంబు లొప్ప స్వ
ర్విభు నెదిరింప మాన్చి రణవీరుఁడు రావణి తా నెదుర్కొనెన్‌.
323
ఉ.అత్తఱిఁ గ్రొత్తగా బవర మయ్యె సురాసురయోధకోటికిన్‌
గత్తులబల్‌ తళత్తళలు కత్తళపున్‌ మగఱాతళత్తళల్‌
మొత్తములై నభోమణిని ముంచె నభస్తటినీ మహోర్ములన్‌
జొత్తిలఁ జేసె సైన్యయుగ శోణ రజః పటలంబు లొక్కటన్‌.
324
ఉ.అందును నిందుఁ బేరుగలయట్టిదొరల్‌ నెఱియోధు లుగ్రులై
యందఱి కందఱై పెలుచనార్చుచు నొండొరుఁదాఁకి పోరి రా
క్రందునఁ గుంభకర్ణుఁ డధికత్వర ముందుగ నన్న డెంద మా
నందముఁ జెందఁగా రణమొనర్చె మహోన్నతశూలహస్తుఁడై.
325
మ.పదఘాతంబుల జానుఘట్టనములన్‌ బార్ష్ణి ప్రహారంబులన్‌
ద్రిదశానీకిని నొంచుచున్‌ గలఁచుచున్‌ దీనత్వ మొందించుచున్‌
రథసంఘర్షములన్‌ నభంబు వగులన్‌ రౌద్రాకృతిన్‌ మించఁగా
నెదిరింపన్‌ వసపోక భీతిలిరి దేవేంద్రాదు లుర్వీశ్వరా!
326
ఉ.అద్రి తెఱంగునన్‌ సురబలార్ణవమున్‌ మథియించు శాత్రవో
పద్రవకారి నయ్యసురభర్తఁ గనుంగొని రౌద్రమూర్తులౌ
రుద్రులు వచ్చి తాఁకిరి మరుత్తులు బిట్ట్టెదిరించి యద్రిశృం
గద్రుమసంఘముల్‌ గురిసి కాఱియవెట్టిరి యొక్కపెట్టునన్‌.
327
శా.ఆదిత్యుల్‌ చెలరేఁగి యయ్యసురమే నస్త్రప్రవర్షంబులన్‌
భేదింపన్‌ గిరినిర్‌ఝరంబుల రహిన్‌ బెన్నెత్తురుల్‌ వాఱి యా
చ్ఛాదింపన్‌ రణభూమి యెల్ల నపుడీర్ష్యాగ్రస్తులై యా ప్రహ
స్తాదుల్‌ సేనలనెల్లఁ గోల్తలనుజేయన్‌ మీఱెఁ బోరయ్యెడిన్‌.
328
చం.కరిమకరాహికర్కటకకచ్ఛపమీనవరాహఖడ్గకా
సరచమరీతరక్షు హరిశల్యకురంగతురంగగండకా
ద్యురుతరనైకవాహనము లుద్ధతి నెక్కి సురారివీరు లా
సురల నెదిర్చి రొక్కమొగిఁ జూపరు లచ్చెరువంది చూడఁగన్‌.
329
కం.ఆ సంకుల సమరంబున
వాసవుఁ డౌ మే! లనంగ వసువులు తుషితుల్‌
డాసిరి యసిధారలఁ దెగ
వ్రేసిరి రోసమున నసురవీరుల శిరముల్‌.
330
వ.అప్పుడు331
సీ.తెగు బుజంబులు తుమురగు ధ్వజంబులు కూలఁ - బడు గజములు నడరెడు రజములు
వ్రీలునెమ్ములు నేల రాలు సొమ్ములు చిక్కు - లొందు కా ళ్ళురవడి మ్రందు జోళ్ళు
సడలు ఛత్రములు కీ లెడలు గాత్రములు మ్ర - గ్గెడు కరములు దునిఁగెడు శిరములు
పొరలు రౌతులు భీతిఁదెరలు సూతులు వ్రస్సి - యొఱుగు బండ్లును బెట్టు విఱుగు విండ్లు
 
గీ.పాఱు నెత్తురుటేరులుఁ దీఱు శస్త్ర
ధారులును మీఱు గాముల బారు గల్గి
పేరుగల వేల్పు దొరలచేఁ దీఱునాత్మ
బలము వీక్షించి రోషించి పంక్తిముఖుఁడు.
332
మ.అమరాధీశచమూసమూహముల దివ్యాస్త్రానలజ్వాలలన్‌
సమరక్షోణిఁ గలంచినన్‌ దెరలి యా సైన్యంబు దైన్యంబుతో
నముచిధ్వంసిరథంబు మాటునకుఁ జన్నన్‌ గిన్క నేత్రారవిం
దము లారక్తసరోరుహద్యుతులఁజెందన్‌ జిష్ణుఁ డత్యుగ్రతన్‌.
333
కం.అరదము దశముఖు మీఁదం
బరువడి నడిపింపు వేగ మాతలి! యనుచున్‌
గురుకార్ముక మౌర్వీటం
కరణముతో వచ్చు నింద్రుఁగనుఁగొని యతఁడున్‌.
334
ఉ.సారథి నెచ్చరించి రభసంబున నిర్జరరాజుతేరికిన్‌
జేరువయై తనుం బొదువు చిల్లరవేల్పుల వాఁడితూపులన్‌
భీరులఁజేసి మాతలి ననేకశరంబుల నొవ్వనేసినన్‌
బేరలుకన్‌ శతక్రతుఁడు పేర్చి దశాస్యు నెదిర్చె శూరతన్‌.
335
మ.శతకోటి ప్రతికోటి శాత విశిఖాసారంబులన్‌ సైంధవ
ప్రతతిన్‌ నొంచి, ధ్వజంబు ముంచి మకుటీభాగంబులన్‌ నించి, సూ
తతనుత్రాణముఁజించి, మించిన సురాధ్యక్షున్‌ నిరీక్షించి యు
ద్ధతిమై రావణుఁ డాగ్రహించి, దశకోదండీకరోద్దండుఁడై.
336
మ.పదిహస్తంబుల నస్త్రముల్‌ దొడి, నభోభాగంబు భేదిల్ల వే
ల్పు దొరన్‌ నొవ్వఁగ నేసి యార్చిన మరుల్లోకేశ్వరుండున్‌ శిత
ప్రదరాసారము నించె నింద్రదనుజేంద్రస్ఫారబాణావళుల్‌
గదిసెన్‌ భానుని దానఁగ్రమ్మె దిశలన్‌ గాఢాంధకారచ్ఛటల్‌.
337
శా.ఆ పెంజీఁకటిలో స్వకీయపరకీయానీకినీభేదదృ
గ్వ్యాపారేతరులై సురాసురులు తా రన్యోన్యమున్‌ బోరుచో
దీపింపెన్‌ భుజఖడ్గకాంతు లపు డుద్రేకించి పౌలస్త్యు సే
నాపంక్తిన్‌ దశమాంశముం బొదివి మ్రందం జేసి రద్దేవతల్‌.
338
శా.ఆ సేనాక్షపణంబుఁ గన్గొని దశాస్యాదిత్యవిద్వేషి రో
షాసూయావిలమానసుం డగుచు సింహస్ఫూర్తి గర్జించి వీ
క్షాసంఘంబుల నిప్పు లుప్పతిల నుగ్రభ్రూకుటుల్‌ మోములన్‌
భాసిల్లన్‌ దన సారథిం గని యనున్‌ బ్రావృట్పయోదార్భటిన్‌.
339
కం.ఇదె నందనమున నుండియు
నుదయశిఖరిదాఁక నిండియుండెడు నైక
త్రిదశానీకిని నడుమన్‌
బదరక మన రథము నడుపు ప్రావీణ్యమునన్‌.
340
మ.వసురుద్రానిలభాస్వరప్రముఖ దేవశ్రేణులన్‌ నేఁడు జి
ష్ణుసమీపంబున సంహరింతుఁ బొలియింతున్‌ దోడుగా వచ్చురా
క్షస పాశాయుధయక్షరాజశమన స్వాహావధూనాథులన్‌
వెసఁ గైకొందుఁ దదీయలోకములు దోర్వీర్యంబుతో నావుడున్‌.
341
మ.అతఁ డాలాగె రథంబు దోలఁగ సహస్రాక్షుండు వీక్షించి య
ద్దితిజాధీశ్వరు నిశ్చయం బెఱిఁగి, యాదిత్యాదులం బల్కె నేఁ
డతిశౌర్యంబున బ్రహ్మదత్తవరగర్వాయత్తుఁడౌ రావణున్‌
మృతిఁ బొందింపఁదరంబు గాదు గద బల్మిం బట్టి తెత్తుంజుఁడీ.
342
మ.అవలోకింపుఁడు మీర లందఱు మదీయంబైన శౌర్యం బటం
చు విజృంభించి బలారి దక్షిణపథస్థుండై చరించెన్‌ సురా
రివరుం డుత్తరభాగవర్తియయి మీఱెన్‌ గొంతసే పంత న
ద్దివిజేంద్రుం డెదిరించె దైత్యు నతఁ డద్దేవేంద్రుఁ దాఁకెన్‌ వడిన్‌.
343
వ.ఇవ్విధంబున344
కం.కుడియెడమలుగాఁ దిరుగుచు
నెడనెడమార్కొనుచుఁ దలఁగి యేఁగుచు శరముల్‌
జడిగొన నిగిడించుచు బడి
బడి నడరుచుఁ దొడరి తెంపుపనికిఁ దివురుచున్‌.
345
మ.పలు చందంబులఁ బోరుచున్నయెడ జంభద్వేషి యాదిత్యరు
ద్రులతో ముప్పదిమూడుకోటుల సురల్‌ దోడ్తో విజృంభించి కో
ల్తలనేయన్‌ దశకంఠునిన్‌ దొడరి రథ్యవ్రాతమున్‌ నొంచి చే
తుల విండ్లం దేగవ్రేసి పట్టికొన నుద్యోగించి ధైర్యంబునన్‌.
346
చం.అరదము చుట్టు ముట్టుకొని యాఁగి దశాస్యుని బిట్టదల్చి పై
కుఱికి తెమల్చి పట్టుకొని యుద్దవిడిం దనతేరి మీఁదికిన్‌
సురపతిగొంచుఁబోవుటలు సూచి నిశాటులు స్రుక్కి దానవే
శ్వరుఁడదె చిక్కె, దైత్యులకు వచ్చె నుపద్రవ మంచుఁ గూయిడన్‌.
347
ఉ.ఆ రొద లాలకించి తమయయ్య యుపాధియుఁగాంచి సంగర
క్రూరుఁడు మేఘనాదుఁ డతికోపముతో శిఖిఁబుట్టినట్టిబల్‌
తేరును గేతువున్‌ హరులు దివ్యధనుశ్శరధుల్‌ వెలుంగ గౌ
రీరమణీమనోహరవరిష్ఠవరాగత శౌర్యధుర్యుఁడై.
348
చం.కడువఁడి నేఁగుదెంచి దశకంఠుని చుట్టును నిండి యాఁగి యుం
డెడి తెఱగంటి మూఁకల గడింది బలంబున డాసి యంప పెం
జడి నిగుడించి వర్మములుఁ జర్మములుం బగిలించి నెత్తురుల్‌
మడువులు గట్టఁజేసి బలుమచ్చర మెచ్చను హెచ్చరింపఁగన్‌.
349
సీ.అరదంబు లదలించి ద్విరదంబుల నడంచి - దరదమ్ము లగునాయుధములఁ ద్రుంచి
పడగలగుమిఁజీల్చి గొడుగులగమిఁ గూల్చి - వడిగల తేజీలఁ బుడమివ్రాల్చి
శిరములఁబగిలించి కరముల నొగిలించి - నరముల విశిఖసంతతులఁద్రుంచి
హనువుల నొప్పించి ధనువులు దప్పించి - తనువులు నిశితశస్త్రముల ముంచి
 
గీ.భటుల బడలించి యాశ్వికార్భటుల మాన్చి
సారథుల నేసి రథికులఁ జదియఁజేసి
హస్తిపకకోటి నలయించి యభవదత్త
తానుసీవిద్యఁ దాల్చి యద్దనుజసుతుఁడు.
350
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju