ఇతిహాసములు ఉత్తరరామాయణము శత్రుఘ్నుండు శ్రీరామపాదసేవార్థియై అయోధ్యకు మరలి చనుట
శత్రుఘ్నుండు శ్రీరామపాదసేవార్థియై అయోధ్యకు మరలి చనుట
మ.సుగుణాంభోధుల మంత్రిపుంగవుల నచ్చోనుంచి యంచన్మతిం
దగు వారిన్‌ దన వెంటఁ బెట్టుకొని రత్నస్యందనారూఢుఁ డై
నగరావాసుల నెల్ల వీడ్కొని ప్రయాణవ్యాప్తిఁ గొన్నాళ్లకున్‌
మిగులన్‌ వేడుకఁ జేరె నా ఘనుఁడు వాల్మీక్యాశ్రమ స్థానమున్‌
156
తే.గీ.చేరి వాల్మీకులకు నతుల్‌ చేసి యాతఁ
డంచి తాశీర్వచస్స్ఫూర్తి నాదరించి
యిచ్చు నర్ఘ్యాదికములు గ్రహించి శ్రాంతి
దొరఁగి పరిజనయుక్తి శత్రుఘ్నుఁ డలరె
157
ఉ.అమ్మునిచంద్రుఁడంత దయ నాతనిఁ గన్గొని పల్కె నెల్లలో
కమ్ముల కుక్కుముల్లయిన కంటకునిన్‌ దృణలీల నొక్క బా
ణమ్మునఁ గూలనేసితి వనంతభుజాబలశాలి వెంచఁగా
నిమ్మహి నీకు సాటిగలరే? శరకౌశలి లక్షణానుజా!
158
ఉ.ఇంకొకనాఁటికిన్‌ లవణుఁడీల్గునె లోకుల బాధ తీఱునే?
శంక దొఱంగి వీని ననిఁ జంపెడి శూరుఁడు భూమిఁబుట్టునే?
యంకిలిలేక యుండుదుమె? యంచుఁ దలంపుదు మా తలంపు నీ
వంక ఫలించెనేఁడు బుధవత్సల! నిన్ను నుతింప శక్యమే?
159
ఉ.రావణుఁ ద్రుంచునాఁడు రఘురామునకున్‌ బహుళప్రయత్నముల్‌
గావలసెన్‌ దశాననునికంటె మహోద్ధతుఁడై యనేకులన్‌
భూవరులన్‌ హరించిన రిపున్‌ నిమిషంబునఁ ద్రుంచెనంచు న
ద్దేవసభన్‌ సురేంద్రుఁడె నుతింపఁ గ వింటిమి నీ ప్రభావముల్‌
160
చం.లవణునితోడ నీ వవికలస్థితిఁ బోరెడువేళ మేము వా
సవుకడనుండి చూచితిమి సర్వము నీ ధృతి యింత యొప్పునే?
యవునవు నీకుఁ జెల్లు నని యక్కునఁ జేర్చి శిరంబు మూర్కొనెన్‌
బ్రవిమలచిత్తుఁ డత్తపసి పంక్తిముఖాంతకుఁ బిన్న తమ్మునిన్‌
161
చం.ఇటువలె నాదరించి జటిలేశ్వరుఁ డాప్తబలాధిభూసుకృ
ద్భటయుతుఁడైన యాతనికిఁ బక్వఫలాదులఁ దృప్తిఁ జేసి చెం
గటి యుటజంబునన్‌ నిలువఁ గా సెల విచ్చిన నక్కుమారుఁ డ
చ్చట వసియించె భృత్యు లుపచారములన్‌ శ్రమమున్‌ హరింపఁగన్‌
162
వ.అయ్యవసరంబున163
సీ.ఉరుసుధా రసధార లొలికెడు చందాన - సరసస్వరస్ఫూర్తి సంఘటిల్లఁ
దిన్నగాఁ దావిపూదేనె సోనలు మించు - విధమునఁ దానముల్‌ విస్తరిల్లఁ
గండ చక్కెర పానకమ్ములు ప్రవహించు - రహి ఘనరాగముల్‌ రక్తి గులుక
విరివియై చెఱకుపాల్‌ వెల్లువవాఱెడి - క్రమమున నాలాపగతులు వెలయఁ
 
గీ.గవలు కవవీణె లూని ద్రాక్షా ఫలోప
మాన మానిత వాల్మీకి మౌని రచిత
చారు రామాయణ శ్లోక సమితి గాన
లీలఁ బఠియింప శత్రుఘ్నుఁ డాలకించి
164
కం.ఆ మధురార్థ నిగుంభన
లా మృదువర్ణానువృత్తు లా పదసంద
ర్భామిత కౌశలి యా వా
క్ప్రామాణ్యము నెంచి యతఁడు పరవశుఁడయ్యెన్‌
165
కం.పరవశుఁడగుఁ దెలియున్‌ గ్ర
మ్మఱ విని తలయూఁచు నింత మాత్రము సీతా
వరపుత్రు లిత్తపోనిధి
కరుణన్‌ మనిరిగద! యనుచుఁ కౌతుక మొందున్‌
166
చం.అతని నిజాప్తు లద్భుతరసాబ్ధి మునింగి నిజంబొ స్వప్నమో
క్షితి నిటువంటి గానములు సేయఁగ వింటిమె వీరలెవ్వరో
యతివరుఁ జేరి వేఁడఁదగు నయ్య? యనన్‌ బరమాద్భుతంబు లి
య్యతివరు పాల నున్నయవి యారయ నెంతటి వారమంచనెన్‌
167
కం.శత్రుఘ్నుఁ డిటుల సీతా
పుత్రుల గానమును వేడ్కఁబొంది వినుచు నా
రాత్రి గడపె నర్ధక్షణ
మాత్రముగా నంత భానుమంతుఁడు వొడిచెన్‌
168
చం.దివసముఖోచితక్రియలు దీర్చి మునీంద్రుఁ డనుజ్ఞనీయఁగా
సవినయవృత్తి వీడుకొని సైన్యముతోఁజని లక్ష్మణానుజుం
డవిరళవేగలీల రవి యంబరమధ్యముఁ జేరు నంతకున్‌
రవికులనాథుఁడేలెడి పురంబు గనెన్‌ నయనోత్సవంబుగన్‌
169
వ.ఇత్తెఱంగునం గనుంగొని యభంగహర్ష తరంగితాంతరంగంబునం బురలక్ష్మికిఁ గరాంబుజంబులు ముకుళించి, సముచిత ప్రకారంబునం బ్రవేశించిఁ170
సీ.సామజ హయభటస్యందనావళులతో - నెడనెడ సామంతు లెదురుకొనఁగ
భూసురాశీర్వాద పుణ్యనాదములతో - వందిమాగధుల కైవార మొలయఁ
గమనీయ ఘృణిమణి కంకణక్వణనలై - చెలులు మేడలనుండి సేస లొలుక
నబ్జమండల పాండురాతపత్రములతో - ముందర బలుటెక్కెములు రహింపఁ
 
గీ.బౌరు లాడాడఁ బొడఁ గని ప్రస్తుతింపఁ
బటహ బహు వాద్య రవముతోఁ బ్రజల యులివు
మీఱ మొగసాల ముందఱఁ దేరు డిగ్గి
శిరముపై నంజలి ఘటించి నరగ నతఁడు
171
చం.కొలువున కేఁగి రామనృపకుంజరు పాదయుగంబు మస్తకం
బొలయఁగ మ్రొక్కి శత్రుపురినుండియుఁ దెచ్చిన దివ్యరత్నరా
శులు దగు కాన్క సేసి పరిశుద్ధమతిన్‌ గరముల్‌ మొగిడ్చి చూ
పులు ఫలియింప స్వామి మొగముం గనుఁగొంచటనిల్చియిట్లనున్‌
172
ఉ.దేవర యాజ్ఞ శత్రుని వధించి తదీయపురం బుదంచిత
శ్రీ విలసిల్లఁ జేసి పదిరెండు శరత్తులు వాసి యుండితిన్‌
గావున మీ పదాబ్జములు గన్గొన వచ్చితిఁ దాళ శక్యమే
యావును బాయు క్రేపు వలె నచ్చట నొంటిగ నిల్చి నావుడున్‌
173
సీ.నగుచుఁ దమ్మునిఁ జేరఁ దిగిచి కౌఁగిటఁ జేర్చి - వసుధేశుఁడను నేల వగపు వత్స !
యరి శిక్షయును ధరా పరిరక్షయును జేయ - కూరకుండఁగ క్షత్రియునకుఁ దగునె?
యుచితకృత్యము మాన్ప నోడి యుండుట గాక - నినుఁ బాసి మేమైన నిలువఁ గలమె?
వలసినయపు డిందు వచ్చి తల్లుల మమ్ముఁ - జుట్టాల మిత్రులఁ జూడరాదె?
 
గీ.తామసింపక సప్త రాత్రములు మాత్ర
మిచట వసియించి పురి కేఁగు మింత తడవు
రాజు లేకున్న రాజ్య మరాజకమగు
ననినఁ బతియాజ్ఞ శిరమున నతఁడు పూని
174
చం.భరతుని లక్ష్మణుం గదిసి భక్తి నతుల్‌ ఘటియించి వారి యా
దరణముఁ గాంచి ప్రేమమునఁ దల్లుల కెల్ల నమస్కరించి త
త్పర మహితోక్తులం దనరి బంధుల నాప్తుల మిత్రులన్‌ ధరా
మరుల యథోచితక్రియల మన్ననఁ జేసి యనంతరంబునన్‌
175
చం.ఇనకులుఁ డానతిచ్చినటు లేడు దినంబులు నిల్చి యవ్విభుం
డనుమతి సేయఁగాఁ బయనమై జననీబుధ బంధుకోటి వీ
డ్కొని భరతుండు లక్ష్మణుఁడుఁ గూర్మిని వెంబడి వచ్చి పంపఁ జ
య్యన నతఁ డయ్యెడన్‌ సబలుఁడై చనియెన్‌ నిజరాజధానికిన్‌
176
కం.ఈ శత్రుఘ్నుని కథ యే
ధీశాలులు వినిన హితమతిన్‌ జదివిన స
త్కౌశలి వ్రాసిన శత్రువి
నాశనమగు రాజ్యమును ధనమ్ములుఁ గలుగున్‌
177
ఉ.అల్లవణారి యిట్లు చని యాత్మపురీజను లుల్లసిల్ల సం
ఫుల్లమనస్కతన్‌ ధరణిఁ బ్రోచుచు విశ్రుతకీర్తియుక్తి రా
గిల్లియు నర్హభంగి శ్రుతకీర్తి మనోరథపూర్తి సేయుచున్‌
క్షుల్లకులార్తిఁ బెంచు భయజూర్తి పడన్‌ దగె ధర్మమూర్తియై
178
ఉ.అక్కడ నక్కడాని మల యంతటి ధైర్యముఁ బూని రామభూ
భుక్కుల చక్రవర్తి క్రతుభుక్కులు సర్వసుదృక్కులున్‌ సుమ
స్రక్కుల సాధు వాక్కులఁ బ్రసన్నతతో నిగిడింప సత్క్రియా
భాక్కులుగా ధరా జనులఁ బాలన సేసె సదృక్కు లౌనన్‌
179
సీ.శ్రుతిమర్మము లెఱింగి సుస్థిరాంతర్యాగ - విమలులై బ్రహ్మ భావమున మించి
యధిగతధర్ములై యరినాశ మొనరించి - యాశలు గెలిచి బ్రాహ్మణులఁ గొలిచి
పరమార్థవంతులై సురుచిరాష్టాంగసం - గతి గాంచి రాజయోగము వహించి
తగు శాస్త్రములు నేర్చి ద్వంద్వసహిష్ణులై - తెలిసి మహార్యసేవలు ఘటించి
 
గీ.బ్రాహ్మణ క్షత్రి యోరవ్య భటులు యోగి
జనులవలె మించ జగతి ప్రశస్త సస్య
వతి యయి ఫలింప నెల మూఁడు వానలెచ్చ
రాజ్య మొనరింపుచుండె శ్రీరామవిభుఁడు
180
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju