| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె. | 1370 |
| ఉ. |
వల్లవబాలురన్ నగరివాకిటికిన్ వెడలంగ ద్రొబ్బుఁ; డీ గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టుఁ; డుర్వికిం దెల్లము గాఁగ నేఁడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ డెల్లవిధంబులం బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్. |
1371 |
| వ. | అని పలుకు సమయంబున. | 1372 |
| శా. |
జంఘాలత్వముతో నగోపరిచరత్సారంగహింసేచ్ఛ ను ల్లంఘింపన్ గమకించు సింహముక్రియన్ లక్షించి పౌరప్రజా సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థియై లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్. |
1373 |
| క. |
తమగమున కెగురు యదు స, త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం దమగమివారలు వీరో, త్తమగణవిభుఁ డనఁగ గంసధరణీపతియున్. |
1374 |
| శా. |
పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లా కల్పాంతవేళాపత న్నక్షత్రంబులభంగి రాల రణసన్నాహంబు డిందించి రం గ క్షోణిం బడఁ ద్రోచెఁ గృష్ణుఁడు వెసన్ గంసున్ నృపోత్తంసునిన్. |
1375 |
| శా. |
మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగాఁ బంచత్వంబును బొందియున్న విమతున్ బద్మాక్షుఁ డీడ్చెన్ వడిన్ పంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై. |
1376 |
| క. |
రోషప్రమోదనిద్రా, భాషాశనపానగతులఁ బాయక చక్రిన్ దోషగతిఁ జూచి యైన వి, శేషగతిన్ గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా! |
1377 |
| వ. | అ సమయంబున. | 1378 |
| క. |
గోపాలుఁ డొక్కఁ డద్దిర!, భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత ద్రూపాలస్యము లేలని, తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై. |
1379 |
| శా. |
న్యగ్రోధుండును గహ్వుఁడున్ మొదలుగా నానాయుధానీక సా మగ్రిన్ గంసునిసోదరుల్ గవియుడున్ మాద్యద్గజేంద్రాభుఁడై యుగ్రుండై పరిఘాయుధోల్లసితుఁడై యొండొండ చెండాడి కా లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్స్థేముఁడై వారలన్. |
1380 |
| వ. | అ య్యవసరంబున. | 1381 |
| క. |
చేతులఁ దాళము లొత్తుచు, జేతోమోదంబుతోడ సిగముడి వీడన్ బాతర లాడుచు మింటను, గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్. |
1382 |
| క. |
వారిజభవరుద్రాదులు, భూరికుసుమవృష్టి గురిసి పొగడిరి కృష్ణున్ భేరులు మ్రోసెను నిర్జర, నారులు దివి నాడి రధిక నటనముల నృపా! |
1383 |
| వ. | అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోఁదుకొనుచు నశ్రుధారాపరిషిక్తవదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యానిద్రితు లయిన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించిరి. అందుఁ గంసభార్య లిట్లనిరి. | 1384 |
| సీ. |
గోపాలసింహంబు కోపించి వెల్వడి నిను గజేంద్రునిభంగి నేఁడు గూల్చె యాదవేంద్రానిల మాభీలజవముల నిను మహీజముమాడ్కి నేల వ్రాల్చె వాసుదేవాంభోధివారి యుద్వేలమై నిను దీవికైవడి నేఁడు ముంచె దేవకీసుతవజ్రి దేవత లలరంగ నినుఁ గొండక్రియ నేఁడు నిహతుఁ జేసె |
|
| తే. |
హా మనోనాథ! హా వీర! హా మహాత్మ!, హా మహారాజ! నీ విట్లు హతుఁడ వయిన మనుచు నున్నార మక్కట! మమ్ముఁబోలు, కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు? |
1385 |
| క. |
భూతముల కెగ్గుసేసిన, భూతంబులు నీకు నెగ్గుఁ బుట్టించె వృథా భూత మగు మనికి యెల్లను, భూతద్రోహికిని శుభముఁ బొంద దధీశా! |
1386 |
| క. |
గోపాలకృష్ణుతోడను, భూపాలక! మున్ను దొడరి పొలసినవారిన్ నీ పాల బుధులు సెప్పరె, కోపాలస్యములు విడిచి కొలువం దగదే. |
1387 |
| వ. | అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుం డయిన హరి కంసాదులకుఁ బరలోక సంస్కారంబులు సేయం బనిచి దేవకీవసుదేవుల బంధనంబు విడిపించి, బలభద్రసహితుం డయి, వారలకుఁ బ్రణామంబులు సేసిన. | 1388 |