| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| మ. |
కని లోకేశులుగాని వీరు కొడుకుల్ గారంచుఁ జిత్తంబులన్ జనయిత్రీజనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. |
1389 |
| సీ. |
మమ్ముఁ గంటిరి గాని మా బాల్యపౌగండకైశోరవయసులఁ గదిసి మీర లెత్తుచు దింపుచు నెలమి మన్నింపుచు నుండు సౌభాగ్యంబు లొంద రైతి; రాకాంక్ష గలిగియు న్నది దైవయోగంబు తల్లిదండ్రులయొద్దఁ దనయు లుండి యే యవసరమున నెబ్భంగి లాలితు లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ |
|
| తే. |
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మఱియు వినుఁడు, నిఖిలపురుషార్థహేతువై నెగడుచున్న మేని కెవ్వార లాఢ్యులు మీర కారె, యా ఋణముఁ దీర్ప నూఱేండ్ల కైనఁ జనదు. |
1390 |
| క. |
చెల్లుబడి గలిగి యెవ్వఁడు, తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్ సెల్లింపఁ డట్టి కష్టుఁడు, ప్రల్లదుఁ డా మీఁద నాత్మపలలాశి యగున్. |
1391 |
| క. |
జననీజనకుల వృద్ధులఁ, దనయుల గురువిప్రసాధుదారాదుల నే జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక, వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్. |
1392 |
| వ. | అదియునుం గాక. | 1393 |
| శా. |
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా రాక ని ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్ సారాతిక్షములార! మమ్ముఁ గొఱఁతల్ సైరించి రక్షింపరే! |
1394 |
| వ. | అని యిట్లు మాయామనుష్యుం డయిన హరి పలికిన పలుకులకు మోహితులై, వారల నంకపీఠంబుల నిడుకొని, కౌఁగిలించుకొని, కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులయి, దేవకీవసుదేవు లూరకుండిరి. అంత వాసుదేవుండు మాతామహుం డయిన యుగ్రసేనునిఁ జూచి. | 1395 |
| చ. |
అనఘ! యయాతిశాపమున యాదవవీరులకున్ నరేశ్వరా సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్; నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరివెట్టుదు రన్యరాజులం బనిగొను టెంత! రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్. |
1396 |
| వ. | అని పలికి. | 1397 |
| క. |
మన్నించి రాజుఁ జేసెను, వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్ సన్నుతమానున్ గదన, చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్. |
1398 |
| వ. | తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు వృష్ణి భోజ మధు దశార్హ కుకురాంధక ప్రముఖులగు సకల జ్ఞాతిసంబంధులను రావించి, చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియోగించె; ని వ్విధంబున. | 1399 |
| క. |
మధుసూదనసత్కరుణా, మధురాలోకనవిముక్తమానసభయులై మధురవచనములఁ దారును, మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా! |
1400 |
| వ. | అంత నొక్కనాఁడు సంకర్షణసహితుండై నందునిం జీరి గోవిందుం డిట్లనియె. | 1401 |
| శా. |
తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం దొల్లి యే తండ్రుల్ బిడ్డల నిట్లు వెంచిరి? భవత్సౌజన్యభావంబులన్ దండ్రీ! యింతటివార మైతిమి గదా! తత్తద్వయోలీలలన్. |
1402 |
| ఉ. |
ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము సేసి వత్తు మే మక్కడికిన్; మదీయులకు నందఱకున్ వినిపింపు మయ్య నే మెక్కడనున్న మాకు మది నెన్నఁడు బాయవు మీ వ్రజంబులో మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్. |
1403 |
| వ. | అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత. | 1404 |
| క. |
గర్గాదిభూసురోత్తమ, వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స న్మార్గంబునఁ జేయించెను, నిర్గర్వచరిత్రులకును నిజపుత్త్రులకున్. |
1405 |
| క. |
ద్విజరాజ వంశవర్యులు, ద్విజరాజ ముఖాంబుజోపదిష్ట వ్రతులై ద్విజరాజత్వము నొందిరి, ద్విజరాజాదికజనంబు దీవింపంగన్. |
1406 |
| వ. | ఉపనయనానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గోహిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబులందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై. | 1407 |
| శా. |
ఉర్విన్ మానవు లెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని త త్పూర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియుం గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్. |
1408 |
| వ. | చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు, సకలవిద్యా విలాసియు నైన సాందీపని యను బుధవర్యుం గని యథోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తిసేయుచుండ, వారలవలన సంతుష్టుండై. | 1409 |
| శా. |
వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ న్వాదివ్యాహృతధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్క వి ద్యా దక్షత్వము రాజనీతియును శుద్ధప్రక్రియం జెప్పె నా భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్. |
1410 |
| క. |
అఱువది నాలుగు విద్యలు, నఱువది నాలుగు దినంబు లంతన వారల్ నెఱవాదులైన కతమున, నెఱి నొక్కొకనాఁటి వినికి నేర్చి రిలేశా! |
1411 |
| క. |
గురువులకు నెల్ల గురులై, గురులఘుభావములులేక కొమరారు జగ ద్గురులు త్రిలోకహితార్థము, గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్. |
1412 |
| వ. | ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మాహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపని యిట్లనియె. | 1413 |
| శా. |
అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం డంభోగాహముసేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునికిం జోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబునఁ బుత్త్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే! |
1414 |
| క. |
శిష్యులు బలాఢ్యులైన వి, శేష్యస్థితి నొంది గురువు జీవించును; ని ర్దూష్యగుణబలగరిష్ఠులు, శిష్యులరై గురునికోర్కి సేయం దగదే? |
1415 |
| వ. | అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి. | 1416 |
| క. |
సాగర! సుబుద్ధితోడను, మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ వాగడ మగుదువు; దుస్సహ, వేగరణాభీలనిశితవిశిఖాగ్నులకున్. |
1417 |
| వ. | అనిన వారలకు జలరాశి యిట్లనియె. | 1418 |
| ఉ. |
‘వంచన యింత లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం దంచితమూర్తి విప్రసుతుఁ డార్యుఁడు తోయము లాడుచుండ ను త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్. |
1419 |
| వ. | అని వాని వసియించు చో టెఱింగించిన. | 1420 |
| శా. |
శంఖారావముతోడఁ బంచజనుఁడున్ శంకించి చిత్తంబులో సంఖిన్నుండుగ వార్ధిఁ జొచ్చి దహనజ్వాలాభహేమోజ్జ్వల త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వానిజఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై. |
1421 |
| క. |
దానవుని దేహజంబగు, మానితశంఖంబు గొనుచు మసలక బలుఁడుం దో నేతేరఁగ రథియై, దానవరిపుఁ డరిగె దండధరపురికి నృపా! |
1422 |
| వ. | చని సంయమనీనామనగరంబుఁ జేరి తద్ద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీరనినదభీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి. | 1423 |
| శా. |
అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మానసా పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగర ప్రాంతంబునం జేసె? మ ద్విస్మేరావహరోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా భస్మంబై చెడు నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై. |
1424 |
| వ. | వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లయిన విష్ణుమూర్తులని యెఱింగి; భక్తితోడం బూజ చేసి సర్వభూతమయుండగు కృష్ణునకు నమస్కరించి ‘యేమి సేయుదు నాన’తి మ్మనిన న మ్మహాత్ముం డిట్లనియె. | 1425 |
| క. |
‘చెప్పెద మా గురునందనుఁ, దప్పు గలుగఁ జూచి నీవు దండనమునకున్ దెప్పించినాఁడ వాతని, నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!’ |
1426 |
| క. |
అనిన విని ‘వీఁడె వీనిం, గొని పొం’డని భక్తితోడ గురునందను ని చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొనియెను, ఘనదుర్జనదమను మహిషగమనున్ శమనున్. |
1427 |
| వ. | ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపనికిం బుత్త్రుని సమర్పించి ‘యింక నేమి సేయవలయు? నానతిం’ డనిన నతం డిట్లనియె. | 1428 |
| క. |
‘గురునకుఁ గోరిన దక్షిణఁ, గరుణన్ ము న్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ ద్గురునకుఁ గోరిన దక్షిణఁ, దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై. |
1429 |
| క. |
కాలునివీటికిఁ జని మృత, బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్ మేలు దొరకొనియె మాకు; వి, శాల మగుంగాత మీ యశము లోకములన్. |
1430 |
| వ. | మహాత్ములారా! ‘యేను గృతార్థుండ నైతి’ నని దీవించిన సాందీపని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి, మథురకుం జనుదెంచి పాంచజన్యంబు పూరించినఁ గని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్క నాఁ డేకాంతంబున. | 1431 |