| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| శా. |
నాపైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్ నాపే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్ గోపాలాంగన లెంత జాలిపడిరో? కోపించిరో? దూఱిరో? వ్రేపల్లెన్ నిజనర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై. |
1432 |
| వ. | అని చింతించి. | 1433 |
| క. |
సిద్ధవిచారు గభీరున్, వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్ బుద్ధినిధి నమరగురుసము, నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యన పలికెన్. |
1434 |
| శా. |
రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షించుచున్ సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో తమ్మున్ నమ్మినవారి డిగ్గ విడువన్ ధర్మంబు గాదండ్రు; వే పొమ్మా! ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్. |
1435 |
| క. |
లౌకిక మొల్లక న న్నా, లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా లోకనములఁ బోషింతును, నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్. |
1436 |
| క. |
‘సందేహము మానుం డర, విందాననలార! మిమ్ము విడువను వత్తున్ బృందావనమున’ కని హరి, సందేశము పంపె ననుము సంకేతములన్. |
1437 |
| వ. | అని మందహాససుందరవదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొలిపిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయసమయంబునకు నందవ్రజంబుసేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్నరథుండై చొచ్చి నందుమందిరంబు ప్రవేశించిన. | 1438 |
| శా. |
ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానందియై ‘మా పాలింటికిఁ గృష్ణుఁ డీతఁ’ డనుచున్ మన్నించి పూజించి వాం ఛా పూర్ణంబుగ మంజులాన్న మిడి మార్గాయాసముం బాపి స ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్. |
1439 |
| క. |
నా మిత్రుఁడు వసుదేవుఁడు, సేమంబున నున్నవాఁడె? చెలువుగఁ బుత్త్రుల్ నేమంబున సేవింప మ, హామత్తుండైన కంసుఁ డడఁగిన పిదపన్. |
1440 |
| శా. |
అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే? తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం బు న్నిత్యంబుఁ దలంచునే? వననదీభూముల్ ప్రసంగించునే? వెన్నుం డెన్నఁడు వచ్చునయ్య! యిట మావ్రేపల్లెకు న్నుద్ధవా! |
1441 |
| క. |
అంకిలి కలుగక మా కక, లంకేందుని పగిదిఁ గాంతిలసితంబగు త త్పంకజనయనుని నెమ్మొగ, మింక విలోకింపఁ గలనె యీ జన్మమునన్? |
1442 |
| క. |
అని హరి ము న్నొనరించిన, పను లెల్లను జెప్పి చెప్పి బాష్పాకుల లో చనుఁడై డగ్గుత్తికతో, వినయంబున నుండె గోపవీరుం డంతన్. |
1443 |
| క. |
పెనిమిటి బిడ్డనిగుణములు, వినుతింప యశోద ప్రేమవిహ్వలమతియై చనుమొనలఁ బాలు గురియఁగ, గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్. |
1444 |
| వ. | ఇట్లు గోవిందసందర్శనాభావవిహ్వలులైన యశోదానందులకు నుద్ధవుం డిట్లనియె. | 1445 |
| క. |
జననీజనకుల మిమ్ముం, గనుఁగొన శీఘ్రంబె వచ్చుఁ గని భద్రంబుల్ వనజాక్షుం డొనరించును, మనమున వగవకుఁడు ధైర్యమండనులారా! |
1446 |
| మ. |
బలుఁడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీభారంబు వారింప వా రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రభుం; డెవ్వఁ డు జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించు వాఁ డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై. |
1447 |
| సీ. |
అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు కారణమానవాకారుఁ డైనఁ జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి రతికృతార్థుల రైతి; రనవరతము శోభిల్లు నింధనజ్యోతిచందంబున నఖిలభూతములందు నతఁ; డతనికి జననీజనకదారసఖిపుత్త్రబాంధవశత్రు ప్రియాప్రియజనులు లేరు; |
|
| ఆ. |
జన్మకర్మములును జన్మంబులును లేవు;, శిష్టరక్షణంబు సేయుకొఱకు గుణవిరహితుఁ డయ్యు గుణి యయి సర్వ ర, క్షణవినాశకేళి సలుపుచుండు. |
1448 |
| వ. | అని మఱియుఁ బెక్కువిధంబుల హరిప్రభావము లుపన్యసించుచు నా రేయి గడపి మఱునాఁడు దధిమథనశబ్దంబు లాకర్ణించుచు లేచి కృతానుష్ఠానుండై యుద్ధవుం డొక్క రహస్యప్రదేశంబున నున్న సమయంబున. | 1449 |
| శా. |
‘రాజీవాక్షుఁడు సుందరాస్యుఁడు మహోరస్కుండు పీతాంబరుం డాజానుస్థితబాహుఁ డంబురుహమాలాలంకృతుం డుల్లస ద్రాజ త్కుండలుఁ డొక్క వీరుఁ డిచటన్ రాజిల్లుచున్నాఁడు; మా రాజీవాక్షునిభంగి’ నంచుఁ గని రా రాజాన్వయున్ గోపికల్. |
1450 |
| వ. | కని లజ్జాసహితహాసవిలోకనంబులు ముఖంబులకుం జెలు వొసంగ నిట్లనిరి. | 1451 |