పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
ముచుకుందుని పూర్వకథాభివర్ణనము
ఆ. ‘ఎవ్వఁ డాతఁ? డితని కెవ్వండు దండ్రి ఘో, రాద్రిగుహకు నేటి కతఁడు వచ్చి
నిద్రవోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ?, దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!’
1641
వ. అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె; నిక్ష్వాకుకుల సంభవుండు మాంధాతకొడుకు ముచుకుందుం డను రాజు రాక్షసభీతులైన వేల్పులం బెద్దకాలంబుసంరక్షించిన మెచ్చి, వా రమరలోకరక్షకుండైన యా రాజకుమారునికడం జేరి వరంబు వేఁడు మనిన వారలం గనుంగొని, మోక్షపదం బడిగిన వార లతని కిట్లనిరి. 1642
మ. జగతి న్నిర్గతకంటకం బయిన రాజ్యంబున్‌ విసర్జించి శూ
ర గణాగ్రేసర! పెద్దకాలము మమున్‌ రక్షించితీ; లోన నీ
మగువల్‌ మిత్రులు బంధులున్‌ సుతులు సంబంధుల్‌ భువిన్‌ లేరు, కా
ల గతిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్‌.
1643
క. కాలము ప్రబలులకును బలి, కాలాత్ముం డీశ్వరుం డగణ్యుఁడు జనులం
గాలవశులుగాఁ జేయును, గాలము గడవంగలేరు ఘను లెవ్వారున్‌.
1644
క. వర మిచ్చెద మర్థింపుము, ధరణీశ్వర! మోక్షపదవి దక్కను మే మె
వ్వరమును విభులము గా మీ, శ్వరుఁడగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్‌.
1645
వ. అని పలికిన దేవతలకు నమస్కరించి, ముచుకుందుండు నిద్రం గోరి దేవదత్తనిద్రావశుండై పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱైన పిమ్మట, హరి ముచుకుందునిముందట నిల్చిన. 1646
సీ. వనరుహలోచను వైజయంతీదామశోభితు రాకేందుసుందరాస్యు
మకరకుండలకాంతిమహితగండస్థలుఁ గౌస్తుభాలంకృతు ఘనశరీరు
శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజమధ్యుఁ జతుర్బాహు మందహాసు
గాంచనసన్నిభకౌశేయవాసు గాంభీర్యసౌందర్యశోభితుఁ బ్రసన్ను
 
ఆ. న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది, తన్మనోజ్ఞదీప్తి దనకుఁ జూడ
నలవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ, బలికెఁ బ్రీతి నవనిపాలకుండు.
1647
మ. శశివో? యింద్రుఁడవో? విభావసుఁడవో?చండప్రభారాశివో?
శశిచూడామణివో? పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో?
దిశలున్‌ భూమియు మిన్ను నిండె నిదె నీతేజంబుఁ జూడంగ దు
ర్వశమై; యెవ్వఁడ? వేల వచ్చి తిచటన్‌ వర్తించె దేకాకివై?
1648
క. ఈ యడవి విషమకంటక, భూయిష్ఠము ఘోరసత్త్వపుంజాలభ్యం
బో యయ్య? యెట్లు వచ్చితి?, నీ యడుగులు కమలపత్త్రనిభములు సూడన్‌.
1649
వ. మహాత్మా! యేను నీకు శుశ్రూషణంబు సేయం గోరెద; నీ జన్మగోత్రంబు లే నెఱుంగ నర్హుండనేని నెఱింగింపుము; నే నిక్ష్వాకువంశసంభవుండ; మాంధాతృనందనుండ; ముచుకుందుం డనువాఁడ; దేవహితార్థంబు చిరకాలజాగరశ్రాంతుండ నయి నిద్ర నొంది యింద్రియసంచారంబులు మఱచి. 1650
శా. ఏ నిద్రించుచు నుండ నొక్క మనుజుం డేతెంచి దుష్కర్ముఁడై
తా నీఱై చెడె నాత్మకిల్బిషమునన్‌ దర్పోగ్రుఁడై; యంతటన్‌
శ్రీనాథాకృతివైన నిన్నుఁ గని వీక్షింప న్నశక్తుండనై
దీనత్వంబును జెందితిన్‌; ననుఁ గృపాదృష్టిన్‌ విలోకింపవే.
1651
వ. అనిన విని మేఘగంభీరభాషణంబుల హరి యిట్లనియె. 1652
సీ. భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ జనుఁగాని; నా గుణజన్మకర్మ
నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల రది యేల? నాకును నలవిగాదు
నేలకు వ్రేఁగైన నిఖిలరాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట
బ్రహ్మచే మున్ను నేఁ బ్రార్థింపఁబడి వసుదేవునింటను వాసుదేవుఁ డనఁగఁ
 
ఆ. గరుణ నవతరించి కంసాఖ్యతో నున్న, కాలనేమిఁ జంపి ఖలుల మఱియుఁ
ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ, ఱైనవాఁడు కాలయవనుఁ డనఘ!
1653
వ. వినుము; తొల్లియు నీవు నన్ను సేవించినకతంబున ని న్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబు లయిన వరంబు లడుగు మిచ్చెద. మద్భక్తులగుజనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా రనిన హరికి ముచుకుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి, యిరువదియెనిమిదవ మహాయుగంబునందు నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలంచి. 1654
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )