పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
జరాసంధుండు ప్రవర్షణగిరిని దహించుట
వ. ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన, మనుష్యులు గొనిపోవు నెడ. 1668
సీ. ఘోటకసంఘాతఖురసమున్నిర్గతధూళి జీమూతసందోహముగను
మహనీయమదకలమాతంగకటదానధారలు కీలాలధారలుగను
నిరుపమస్యందననేమినిర్ఘోషంబు దారుణగర్జితధ్వానముగను
నిశితశస్త్రాస్త్రమానితదీర్ఘరోచులు లలితసౌదామనీలతికలుగను
 
తే. శత్రురాజప్రతాపాగ్ని శాంతముగను, వృష్టికాలము వచ్చు న వ్విధము దోఁప
నేఁగుదెంచె జరాసంధుఁ డిరువదియును, మూఁడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ.
1669
చ. ఇటు చనుదెంచియున్న మగధేశ్వరవాహినిఁ జూచి యుద్ధ సం
ఘటనము మాని మానవులకైవడి భీరుల భంగి నోడి ముం
దటి ధనమెల్ల డించి మృదుతామరసాభపదద్వయుల్‌ క్రియా
పటువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్‌.
1670
వ. ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారలప్రభావంబు లెఱుంగక పరిహసించి. 1671
ఉ. ‘ఓ యదువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం
బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాఁకినం
దోయధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద’నంచు సమస్తసేనతోఁ
బాయక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్‌.
1672
వ. మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు సని విశ్రాంతులై దమకు డాఁగ నెల వగు నని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ బ్రవర్షణాఖ్యంబై పదునొకండుయోజనంబుల పొడవును నంతియ వెడలుపును గల గిరి యెక్కి రంత. 1673
శా. ఆ శైలేంద్రముఁ జుట్టిరా విడిసి రోషావిష్టుఁడై మాగధో
ర్వీశుం డా వసుదేవనందనులఁ దా వీక్షింపఁగా లేక త
న్నాశేచ్ఛన్‌ బిలసానుశృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్‌
రాసుల్‌ గా నిడి చిచ్చువెట్టఁ బనిచెన్‌ రౌద్రంబుతో భృత్యులన్‌.
1674
వ. ఇట్లు జరాసంధపరిజనప్రదీపితంబైన మహానలంబు దరికొనియె నందు. 1675
క. పొగ లెగసెఁ బొగల తుదలను, మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱుగమి ము
న్నుగ బ్రహ్మాండము నిండెను, భగ భగమని మంట లొదవె భయదము లగుచున్‌.
1676
వ. మఱియు న మ్మహానలంబు బిలసానుశృంగవృక్షలతాకుంజపుంజంబుల దరికొని, శిఖలు కిసలయంబులుగ, విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూతధూమపటలంబులు బంధురస్కంధ శాఖావిసరంబులుగ, ననోకహంబుకైవడి నభ్రంకషంబై ప్రబ్బి కఠోరసమీరణసమున్నతమహోల్కాజాల తిరోహితవియచ్చ రవిమానంబును, వివిధవిధూమవిస్ఫులింగవిలోకనప్రభూతనూతనతారకాభ్రాంతి విభ్రాంతగగనచరంబును, సంతప్యమానసరోవరసలిలంబును, విశాలజ్వాలాజాలజాజ్వల్యమాన తక్కోలచందనాగరుకర్పూర ధూమవాసనావాసితగగనకుహరంబును, గరాళకీలాజాలదందహ్యమాన కీచకనికుంజపుంజసంజనితచిటపటారావపరిపూరితదిగంతరాళంబును, భయంకరబహుళతర శాఖాభిద్యమానపాషాణఘోషణపరిమూర్ఛితప్రాణిలోకంబును, సంతప్యమానశాఖిశాఖాంతరనిబిడనీడనిహిత శాబకవియోగదుఃఖడోలాయమానవిహంగకులంబును, మహాహేతిసందీప్యమానకటిసూత్రసంఘటిత మయూరపింఛకుచకలశయుగళభారాలసశబరకామినీసమాశ్రితనిర్ఝరంబును, దగ్ధానేకమృగ మిథునంబు నై యేర్చునెడ. 1677
క. ఇల నేకాదశయోజన, ముల పొడవగు శైలశిఖరముననుండి వడిన్‌
బలకృష్ణులు రిపుబలముల, వెలి కులికిరి కానఁబడక విలసితలీలన్‌.
1678
వ. ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి. జరాసంధుడు వారలు దగ్ధు లైరని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె; నంత. 1679
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )