| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| వ. | ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న ఇంచువిలుకానిం గొంచు నాకాశసంచారిణియైన యా రతీదేవి గగనపథంబుఁబట్టి ద్వారకానగరోపరిభాగమునకుం జనుదెంచిన. | 24 |
| ఆ. |
మెఱుఁగుఁదీఁగెతోడి మేఘంబుకైవడి, యువిదతోడ మింటి నుండి కదలి యరుగుదెంచె మదనుఁ డంగనాజనములు, మెలఁగుచున్న లోని మేడకడకు. |
25 |
| మ. |
జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం కులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా క్షులు దా రేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యై యెడన్. |
26 |
| క. |
కొందఱు హరి యగు నందురు, కొందఱు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లే వందురు మెల్లనె తెలియుద, మందురు మరుఁ జూచి కొంద ఱబలలు గుములై. |
27 |
| క. |
హరి యని వెనుచని పిదపన్, హరిఁ బోలెడువాఁడు గాని హరి గాఁ డనుచున్ హరిమధ్య లల్లనల్లన, హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్. |
28 |
| ఉ. |
‘అన్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం పన్నగుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రేఁ గన్నుల నా కుమారకునికైవడి నేర్పడఁ జూచి బోటితోఁ జన్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్. |
29 |
| శా. |
ఈ కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో యీ కల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నేనోములన్ నోఁచెనో యే కాంతామణియందు వీనిఁ గనెనో యే కాంతుఁ డీకాంతునిన్. |
30 |
| శా. |
ఆళీ! నా తొలుచూలిపాపనికి బోర్కాడించి నే సూతికా శాలామధ్యవిశాలతల్పగతనై చన్నిచ్చి నిద్రింప నా బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ము లే త్రోవ ము న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో! |
31 |
| క. |
కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ, జెడిపోయిననాఁట నుండి చెలియా! తెలియం బడ దే వార్తయు నతఁడే, వడువున నె చ్చోట నిలిచి వర్తించెడినో! |
32 |
| క. |
ఇందాఁక వాఁడు బ్రదికిన, సందేహము లేదు దేహచాతుర్యవయ స్సౌందర్యంబుల లోకులు, వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ! |
33 |
| మ. |
అతివా! సిద్ధము నాఁటి బాలకున కీయాకార మీ వర్ణ మీ గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ డతఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశుసారూప్య సం గతి సిద్ధింపదు, వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్. |
34 |
| క. |
పొదలెడి ముదమునఁ జిత్తము, గదలెడి నాయెడమమూఁపు, గన్నులవెంటం బొదలెడి నానందాశ్రులు, మెదలెడిఁ బాలిండ్లఁ బాలు, మేలయ్యెడినో! |
35 |
| వ. | అని డోలాయమాన మానసయై వితర్కించుచు | 36 |
| క. |
తనయుఁ డని నొడువఁ దలఁచును, దనయుఁడు గాకున్న మిగులఁ దతిగొని సవతుల్ దను నగియెద రని తలఁచు న, తనుసంశయ మలమికొనఁగఁ దనుమధ్య మదిన్. |
37 |
| వ. | ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరికావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె, నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన, | 38 |
| క. |
“చచ్చిన బాలుఁడు గ్రమ్మఱ, వచ్చినక్రియ వచ్చెఁ బెక్కువర్షములకు నీ సచ్చరితు నేఁడు గంటిమి, చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?” |
39 |
| వ. | అని యంతఃపురకాంతలును, దేవకీ వసుదేవ రామకృష్ణులును యథోచిత క్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి, రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించుకొని. | 40 |
| శా. |
‘అన్నా? నా చనుఁబాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే సన్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్ నిన్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్. |
41 |
| వ. | అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె, నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి, రందు. | 42 |
| క. |
సిరిపెనిమిటిపుత్త్రకుఁ డగు, మరుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ గరఁగుదు రఁట పరకాంతలు, మరుఁ గని మోహాంధకారమగ్నలు గారే? |
43 |
| వ. | అని చెప్పి శుకుం డిట్లనియె. | 44 |