| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
పురమున కేగి యుషాసుం, దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం బరదాసదాసికాజన, వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్. |
446 |
| క. |
కనకరథంబున నిడుకొని, ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా ననిరుద్ధుని గోవిందుం, డనుమోదింపంగఁ దెచ్చి యర్పించె నృపా! |
447 |
| ఉ. |
అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా కాంతుఁడు మున్నుగాఁ బటహకాహళతూర్యనినాదపూరితా శాంతరుఁడై వెసం జనియె నాత్మపురీముఖుఁడై ముదంబునన్. |
448 |
| మ. |
కనియెన్ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో క నదోత్తుంగతరంగసంగతలసత్కాసారకన్ భూరి శో భన నిత్యోన్నతసౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్ జనసంతాపనివారకన్ సుజనభాస్వత్తారకన్ ద్వారకన్. |
449 |
| వ. | కని డాయం జనఁ బురలక్ష్మి కృష్ణసందర్శనకుతూహలయై చేసన్నలం జీరుచందంబున నందంబు నొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకత తోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాదవీథికావిలసితంబును, మౌక్తికవితానవిరచితమంగళరంగవల్లీవిరాజితంబును, శోభనాకలితవిన్యస్తకదళికాస్తంభసురభికుసుమమాలికాక్షతాలంకృతంబును, గుంకుమసలిలసిక్త విపణిమార్గంబును, శంఖదుందుభిభేరీమృదంగపటహకాహళమృదంగాదిమంగళారావకలితంబును, వందిమాగధసంగీత ప్రసంగంబునునై యతిమనోహరవిభవాభిరామంబైన య ప్పురవరంబు సచివపురోహితసుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనాకరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె, నంత. | 450 |
| క. |
శ్రీకృష్ణునివిజయం బగు, నీ కథఁ బఠియించువార లెప్పుడు జయముం గైకొని యిహపరసౌఖ్యము, లాకల్పోన్నతి వహింతు రవనీనాథా! |
451 |
| క. |
అని చెప్పిన శుకయోగికి, జననాయకుఁ డనియెఁ గృష్ణచరితము విన నా మన మెపుడుఁ దనియ దింకను, వినవలతుం గరుణఁ జెప్పవే మునినాథా! |
452 |
| వ. | అనినఁ బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. | 453 |