పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణు డుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికిఁ బోవుట
క. ‘ఉద్ధవ! మహితవివేక స, మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్‌
వృద్ధవరానుమతంబుగ, బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా!
666
తే. అనఘచారిత్ర ! నీవు మా యక్షియుగము, వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ
జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు, ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత!’
667
వ. అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండపోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తమునిభాషణంబులకు మనంబున సంతసిల్లి, యతనిపాదంబులు దన మనంబున నిడికొని, ‘వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయభక్తుండైన యుధిష్ఠిరుయాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుం గాక నిఖిలదిగ్విజయమూలంబగు రాజసూయకృత్యంబునందు జరాసంధమర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహవిముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీబలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థులుగా; రట్లగుట నతండు భూసురులేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గపటవిప్రవేషంబునం జని యాజరాసంధుని నాహవభిక్ష వేఁడి, భవత్సన్నిధానంబున న ప్పవమానతనయుం డతని వధియించు నట్టి కార్యంబు సేఁత బహుళార్థసాధనం బగు’ నని పలికిన నారదుండును యాదవజనంబులును సభ్యులునుం బొగడి; రంత. 668
సీ. తరలవిచిత్రకస్థగితప్రభావలిఁ దనరారు గరుడకేతనము వెలుఁగఁ
గాంచనచక్రసంఘటితఘంటాఘణ ఘణనినాదముల దిక్కరులు బెదర
సలలితమేఘపుష్పకవలాహకశైబ్యసుగ్రీవతురగవిస్ఫురణ దనర
బాలసూర్యప్రభాభాసమానద్యుతిదిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ
 
తే. బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర, నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె
శంఖకాహళపటహనిస్సాణడిండి, మాదిరవములు భరితదిగంతములుగ.
669
క. మనుజేశ్వరునకుఁ దాలాం, కునకును గురువృద్ధజనులకును జెప్పి ప్రియం
బున ననుపఁ గాంచన స్యం, దనసామజవాజిభటకదంబము గొలువన్‌.
670
తే. వందిమాగధసూతకైవారరవము, వసుమతీసురకోటిదీవనల మ్రోఁత
లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర, సీమలందుండి ముత్యాలసేస లొలుక.
671
క. లీలం జని కృష్ణుఁడు వా, హ్యాలిన్‌ నవకుసుమఫలభరానతశాఖా
లోల ఘనసారసాల ర, సాల వనస్థలములందుఁ జతురత విడిసెన్‌.
672
వ. అట్టి యెడ సరోజనాభుశుద్ధాంతంబున. 673
సీ. వికచమరందనవీనసౌరభలసన్మందారకుసుమదామములు దుఱిమి
చారుసుగంధకస్తూరికాఘనసారమిళితచందనపంకమెలమి నలఁది
కనకకుండలరణత్కంకణనూపురముద్రికాభూషణంబులు ధరించి
యంచితముక్తాఫలాంచలమృదులదివ్యాంబరమ్ములు సెలువారఁగట్టి
 
తే. యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి, యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి
పెంపు దీపింప నుడురాజబింబముఖులు, నవచతుర్విధశృంగార మవధరించి.
674
తే. జలజలోచనుకడకు నుత్కలికతోడఁ, దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ
గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర, కలితులై పౌరులను నెడగలుగ జడియ.
675
క. అసమాస్త్రుఁడు పులు గడిగిన, కుసుమాస్త్రములను హసించుకోమలతనువుల్‌
మిసమిస మెఱవఁగ వేశ్యా, విసరము దాసీజనంబు విభవ మెలర్పన్‌.
676
ఆ. హరుల వేసడములఁ గరులను నెక్కి తో, నరుగుదేర బహువిధాయుధములు
దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు, రాంగనలు సితాంబుజాక్షుకడకు.
677
వ. వచ్చి రంత. 678
క. నారదుని, మాధవుఁడు స, త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును, వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్‌.
679
క. నరవరుల దూతయును ముర, హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ
వరుల కడ కేగి పద్మో, దరువచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్‌.
680
వ. అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయబంధుసుహృజ్జనసమేతుండై కదలి చనునెడ. 681
చ. కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను
త్కటపటుచామరధ్వజపతాకకిరీటసితాతపత్త్ర వి
స్ఫుటఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌
చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్‌.
682
క. కరిహరిరథసుభటసము, త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్‌
సరిదుపవనదుర్గసరో, వరజనపదపురపుళిందవనగోష్ఠములన్‌.
683
వ. ఇట్లు గడచి చనుచు నానర్తకసౌవీరమరుదేశంబులు దాటి ఇందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీ నది దాఁటి మత్స్యవిషయంబులు లోనుగాఁగడచి యింద్రప్రస్థ నగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన. 684
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )