పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న
వ. మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుం గని శుకయోగీంద్రుం ‘డయ్యా! జన్మకర్మవ్యాధి విమోచనంబునకుఁ గారణంబగు దివ్యౌషధంబు గావున శ్రీమన్నారాయణకథామృతంబుఁ గ్రోలు’ మని యిట్లనియె. 2
మ. బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహాబలోపేతుఁడై
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభార ము
జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళికతనం జావంగఁ గౌరవ్య స
ద్బలముం బాండవసైన్యము న్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
3
వ. అంత. 4
క. మునివరులు సంతసిల్లిరి, యనయము నందాదులకును హర్షం బయ్యెం;
దన నిజభక్తులు యాదవ, ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.
5
మ. విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.
6
సీ. ఈ రీతి శ్రీకృష్ణుఁడేపారఁబూతనా శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన నతఁడు భూపాలనం బమరఁ జూచి
 
తే. భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి, యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁదక్క వేఱొకండు, దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు.
7
వ. అని వితర్కించి జగదీశ్వరుం ‘డత్యున్నతవేణుకావనంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించుచందంబున యదుబలంబుల కన్యోన్యవైరానుబంధంబులు గల్పించి హతం బొన ర్చెద’ నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె. 8
క. ‘హరిపాదకమల సేవా, పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫురణంబు సంభవించెనొ, యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే !
9
క. అనిన జనపాలునకు ని, ట్లని సంయమికులవరేణ్యుఁ డతిమోదముతో
విను మని చెప్పఁగఁ దొడఁగెను, ఘనతరగంభీరవాక్ప్రకాశస్ఫురణన్‌.
10
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )