పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకుఁ బిలువ వచ్చుట
క. సుర గరుడ ఖచర విద్యా, ధర హర పరమేష్ఠిముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన, నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
83
క. కని పరమేశుని యాదవ, వనశోభితపారిజాతు వనరుహనేత్రున్‌
జనకామితఫలదాయకు, వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.
84
తే. అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు, నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తరశతాబ్దపరిమితంబు, నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
85
వ. అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ ‘యాదవుల కన్యోన్యవైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం’ డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాది బృందారకులు నిజస్థానంబులకుం జని రంత. 86
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )