పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
కద్రువ తనకొడుకులకు జనమేజయునివలన నాశంబు గల్గునట్లు శపించుట (సం. 13-23-1(కుంభ))
చ. ‘అమృతకరాన్వయంబున మహాముని వేడ్క నరుండు పాండుభూ
రమణుని దేవి గొంతి యుదరంబునఁ బుట్టి, ధనంజయాది నా
మముల వెలుంగు దత్సుతుని మన్మఁడు సంభృతధర్మమైన పే
ర్మి మెఱయ నేల యేలు; జనమేజయనాముఁ డరాత్యజయ్యుఁడై.
197
ఉ. ఆతఁడు సర్పయాగమను నధ్వరముం గుపితాత్ముఁడై పితృ
ప్రీతిగఁ జేయుఁ; దద్దహనభీకర భూరి శిఖా ప్రవేశసం
జాతదురంతతాపమునఁ జావఁగలా’ రని శాప మిచ్చెఁ; ద
త్పాతన వృత్తికిన్‌ వెఱచి తక్కటి నాగము లా భుజంగితోన్‌.
198
తే. నల్లగాఁ జేయువార, మే మెల్లభంగి | నాతురంగమపతివాల| మని, రయమునఁ
బోయి, వాలధి రోమముల్‌ వొదివి, నీల - రోమసంచయమైరి కురుక్షితీశ!
199
క. కద్రువ, గన్గొని సంతో | షద్రుతమతి యగుచుఁ బిలిచి సవతికిఁ జూపెన్‌
భద్రాత్మక యవ్వినతయు | దద్ద్రోహం బెఱుఁగలేమి దైన్యము నొందెన్‌.
200
క. నగుచుం గద్రువ ‘వరవుడ | వగుము విచారంబు విడిచి’ యనుడు, వినత ‘య
ట్లగుఁగా’ కని, లజ్జయుఁ బెను | వగయుఁ దొలఁగఁ ద్రోచి, చేసె వరవుడము దగన్‌.
201
వ. ఇట్లు కపట జయంబునఁ గద్రువ సత్యవినయాది గుణవతి యయిన వినతం దనకు దాసి చేసికొని, పరిహీణంబు లయిన, పరిచారికాకృత్యంబుల నిత్యంబు నలంచుచుండెం; బదంపడి యప్పరమసాధ్వి దన యగ్రతనయుం డాదేశించిన తెఱం గూహించి, రెండవ యండంబున జనియించిన తనూజుం దలంచుచు నాసపాటు గదిరిన హృదయంబుతో దాస్యం బనాలస్యంబున నడపుచుండ. 202
ఉ. యౌవనదర్ప మంది, జవ మంతకు నంతకు నగ్గలింప, మై
లా వధికంబు గాఁగ, నుపలాలన సేయఁగఁ బద్మసంభవుం
డా విహగోత్తముండు హృదయంబున గర్వ మెలర్ప నుద్ధతుం
డై విహరింపఁ జూచి యొక యప్పుడు, నారదుఁ డల్లఁ జేరినన్‌.
203
వ. అతఁడు భక్తిం బ్రణమిల్లి నిల్చిన నప్పక్షిపుంగవునకు నమ్మునిపుంగవుం డిట్లనియె. 204
తే. ‘దాసియై సవతాలికిఁ దల్లి పనులు | సేసి నలఁగంగ, నద్దెసఁ జింత వంత
లేక నీ విట్లు దిరుగుట లెస్స యగునె? | యద్భుతోజ్జ్వలతేజ! కశ్యపతనూజ!’
205
చ. అనుడు, విహంగనాథుఁడు ‘మదంబకు దాస్యము రాకకుం గతం
బనఘవిచార!యెద్ది? తెలియన్‌ వినిపింపవె!’ యన్నఁ జెప్పె న
మ్మునివరుఁ డున్నరూపు, హయముం గను టాదిగఁ గల్గు కశ్యపాం
గనల చరిత్ర మాతని కఖండ పరిస్ఫుట భాషణంబులన్‌.
206
చ. చెప్పినఁ, గోపమున్‌ వగపుఁ జిత్తమునం గదురంగ ‘మేలు మే
లప్ప హితంబు సేసెఁ, జెలియల్‌ మనుచున్నది, పెంపుతోడ’ నం
చప్పుడ వాయువేగమున నయ్యెడకుం జని, మాట యెద్దియుం
జెప్పక తల్లికిం బ్రణతి సేసె విషాద భరార్తమూర్తియై.
207
వ. కద్రువపాలికిం బోయి. 208
చ. పరమ వినీతిమై నెఱఁగి, బాంధవ మారఁగ నల్ల నిట్లనున్‌
గరుడుఁడు దారితారి వగఁ గందుచు ‘నీ చెలియల్‌ చరించు ని
వ్వరవుడపుం జరిత్రమున వచ్చునె నీ కొక పేర్మి? యీసతిం
గరుణ యెలర్పఁగా విడువ గౌరవ సంపదఁ జేయు నెంతయున్‌.
209
చ. నీకును నేను బుత్రుఁడన; నెమ్మిఁ దగన్‌ ననుఁ జూచియైనఁ ద
ల్లీ! కృపసేఁత పెద్దయును లెస్స; యధర్మము ధర్మమ న్వగల్‌
నా కవి యేల? దాస్యకృతి నా జనయిత్రికి నివ్విధంబునన్‌
రాకయు దైవకృత్యమ మనంబునఁ బొంగుదు విడ్పుగల్గినన్‌.
210
వ. అనిన విని మొగంబు ముఱకటించు కొనుచుఁ గద్రువ గరుత్మంతున కిట్లనియె. 211
మ. ‘బలవంతుండవు, నేర్పు చందములఁ జెప్పంజాలి యీరిత్త ప
ల్కులఁ దేర్పం బనిలేదు; తల్లికి మదిం గూర్తేని వే పోయి లో
కులు నిన్నుం బ్రణుతింపఁ దె మ్మమృతమున్‌; ఘోరంపు దాస్యంబు నేఁ
దొలఁగం బెట్టెద మీ కనంతమగు సంతోషంబు సంధిల్లఁగన్‌.
212
చ. అన విని, దాని కియ్యకొని, యప్డు సుపర్ణుఁడు పోయి, కశ్యపుం
గని, తన భాషణంబులును, గద్రువ పల్కులుఁ జెప్పి, ‘తెచ్చువాఁ
డ నమృత మెట్లు నే నని యొడంబడి వచ్చితి’ నన్న నాతఁ డ
త్తనయునిఁ జూచి యుల్లము ముదంబును నచ్చెరుపాటు వొందఁగన్‌.
213
క. ‘అమృతంబు దుర్లభం, బ | య్యమరుల కేనియు నతిప్రయత్నంబున గు
ప్తము సేసి యుండు వాసవుఁ | డమలచరిత! నీకు నగునె యట్టిది తేరన్‌’
214
వ. వినుము. 215
చ. ఉదకము రక్షకం బగుచునుండఁగ, నుజ్జ్వలవహ్నియందునుం
బొదువఁ, గృపాణశక్తి ముఖ భూరితరాయుధహస్తులై బలో
న్మదులు, మహోగ్రకోపులు, ఘనస్థిరకాయు లనేకరాక్షసుల్‌
వొదిగొని కావ నిన్పవలలో నమృతంబు సురక్షితస్థితిన్‌.
216
క. ఉండు నన విని, విహంగ వి | భుం డల్లన నగుచు, ‘నీవు పుత్రస్నేహా
ఢ్యుండవయి పలికితే; బలి | యుండ, నుపాయజ్ఞుఁడను, మహోజ్జ్వలతేజా!
217
మ. అనుమానం బది యేల? తెత్తు నమృతం ‘బన్నం గడుం బొంగి, యా
తనిఁ దాఁ గౌఁగిటఁ జేర్చి కశ్యపుఁడు, పుత్రా! నిశ్చయం బట్లయే
ని, నిభంబుం గమఠంబునుం గలవు; వానిం దిన్న లావెక్కు; నా
ఘనజంతు ద్వితయంబు నీకు నెరగాఁ గల్పించితిం బోవనా!’
218
వ. అనుటయు సంతోషించి గరుత్మంతుం ‘డా గజకచ్ఛపంబు లెచ్చట నుండు? నెబ్భంగివి? యని యడిగిన నమ్మునీంద్రుం డవ్విహగేంద్రున కిట్లనియె. 219
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )