పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
చ్యవన నహుష సంవాదం బను నితిహాసము (సం. 13-50-1)
వ. అనిన విని ధర్మజుండు ‘సహవాసంబునను దర్శనంబునను బుట్టెడి స్నేహంబు లెట్టివి? వానిని గోవుల మాహాత్మ్యంబును నెఱుంగవలతుం జెప్పవే’ యని యడిగిన నప్పుడమిఱేనికి భీష్ముం డిట్లనియె. 257
సీ. ‘చ్యవనుని, నహుషుని సంవాద మితిహాస | మై చెల్లు జగమున ననఘ! నీకు
దానిఁ జెప్పెద విను; దాన నీ యడిగిన | యర్థముల్‌ దెలియు, మహాత్ముఁడైన
భార్గవచ్యవనుండు, భాగీరథీ యము | నలు గూడినెడ కేఁగి, యలఘునిష్ఠఁ
గ్రుంకి సుస్థిరుఁ డయి కూర్చుండి, యతుల స | మాధిపరుం డయి, మత్స్య కులము
 
తే. దనదు చుట్టు మెలఁగఁ దనువునఁ జెందంగ | మూరుకొనఁగఁ గృపయు ముదముఁ గదుర
భావవృత్తి తోడఁ బండ్రెండు వర్షము | లుండె; నట్టు లుండ నొక్కనాఁడు.
258
క. జాలరులు వలల నచ్చటి | మీలఁ దిగుచుచుండి, యయ్యమేయోగ్రతప
శ్శీలునిఁ గూడఁగఁ దిగిచి, భ | యాలోల మనస్కు లగుచు నమ్మునిపతికిన్‌.
259
ఆ. చాఁగి మ్రొక్కి, ‘తప్పుసైఁపు మెఱుంగమి | నింతపుట్టె, సంయమీంద్ర! మమ్ముఁ
బరమకరుణఁ జూచి పనుపుము; దీనికి | నేమి సేయువార మింక?’ ననుడు.
260
క. జలచరములపై నర్మిలి | గలిగెడు మదిఁ దాల్చి చేర్చి కారుణ్యము బో
యలమీఁద నించుకేనియు | నలుక వొడమనీక యుండె నతఁ డవికృతుఁడై.
261
వ. ఏటిదరికిం దిగువఁబడిన మీలదెస వారికిం జూపి వారితోడ. 262
తే. ‘వీనితోడి సంవాసంబు మానసమునఁ | జాల నర్మిలిఁ బెనిచె; నిమ్మీలతోడఁ
గూడఁ బ్రాణంబు విడుచుట కూడదండ్రె | జనులు; గావున నటుసేయుఁ డనఘులార!
263
వ. తగిన తెఱంగు సెప్పెద వినుండు. 264
క. ఇమ్మీలను నన్నును మీ | రమ్మికొనుఁడు సేయువెలల ’ కనుటయుఁ గడు శీ
ఘ్రమ్మున నహుషు కడకుఁ జని | యమ్ముని తెఱఁ గెల్లఁ జెప్పి రలుకుచు బోయల్‌.
265
వ. చెప్పిన భయంబును సంభ్రమంబును బెనంగొన నమ్మనుజపతి మంత్రి పురోహిత సహితంబుగా నప్పరమ మునిపాలికిం జనుదెంచి సాష్టాంగ దండప్రణామంబు సేసి ‘బోయలు సేసిన యపరాధంబు నేమి భంగి నీఁగు వాఁడ’ నని విన్నవించిన, నద్దయాళుం డిట్లనియె.’ 266
క. ‘బోయలు నిజకుల ధర్మము | సేయుట యపరాధ మగునె? చెప్పెద విను వీ
రాయాసపడిరి; వీరికి | నాయొడలికిఁ దగిన వెల జనస్తుత యీవే!’
267
క. అనుటయు మునివరు మనమునఁ | గినుక యొకింతయును లేమికిం బ్రీతుండై
జనపతి గిరాతులకు నిం | డని పనిచెను వేయుమాడ లాత్మసచివులన్‌
268
వ. పనిచిన యప్పలుకులు విని యమ్ముని యమ్మనుజ విభునితోఁ, ‘దగవెఱిఁగి యిత్తుగా’ కనవుడు, నప్పుడమిఱేఁడు పదివేలు సెప్పిన, నప్పరమ సంయమి యప్పటి మాటయ యాడిన, నా రాజు లక్ష యుగ్గడించె; దానికిం దపస్వి ముందటి పలుకు పలికిన; నతండు కోటి యిమ్మనియె; నమ్మాటకు నమ్మహాత్ముండు. 269
క. తల విసరి ‘వెలఁ దగఁగ బో | యల కీ వలదయ్య!’ యనిన నన్నరపతి ‘వా
రల కిల సగ మిచ్చెద’ నని | పలికిన, నప్పలుకు ద్రోపు వడ ముని పల్కెన్‌.
270
ఆ. రాజు దనదు సకలరాజ్యంబు బోయల | కిత్తు ననుడు నమ్మునీశ్వరుండు
‘నీవు మంత్రివరులు నెయ్యురుఁ దలపోసి | యుచితమైన మూల్య మొసఁగు’ మనియె.
271
వ. అనిన విని విషాదంబుతో నహుషుం డవులం జని సచివులుం దానును నింకనేమి సేయువాఁడ నని చింతిల్లుచున్న సమయంబున నయ్యెడకు గవిజాతుండను సంయమి సనుదెంచి వారలతో ‘మీరు చింత విడువుఁ డే నిమ్మునిపతి మూల్యంబు నిశ్చయించెద’ ననుటయు నయ్యవనీవిభుం డప్పరివారం ‘బింతటితో నాపత్పయోధి మునుంగకుండు నట్లుగా నన్నుంగావవే’ యనుపలుకు పలికిన నతం డతని కిట్లనియె. 272
తే. ‘గోవునకు బ్రాహ్మణులకును గుల మొకండ | కమలజుఁడు రెండు దెఱఁగులుగా నొనర్చె;
హవికిఁ బూర్వంబు గారణ మఖిల మంత్ర | ములకధిష్ఠాన మపరంబు భూపవర్య!
273
క. వివిధాగమాశ్రయం బగు | నవనీదేవునకు మూల్య మని వాక్రువ్వన్‌
శివునకును గాదు ధరణీ | ధవ! గోవును నట్టిదగుట దగు నది యొసఁగన్‌.’
274
తే. అనినఁ బ్రియమంది నృపతి సంయమి సమీప | మునకు వచ్చి మహాభాగ! ననుఁ గృపార్ద్ర
దృష్టిఁ జూడుము; భవదీయ దేహమునకు | నింత వెల యన వచ్చునే యేరికైన?
275
క. మునినాథ! గోవు నిచ్చెద | ననవుడు వికచముఖుఁ డగుచు ‘ననుగుణ మూల్యం
బున సంప్రీతిం బొందితి’ | నని భృగుకులముఖ్యుఁ డిట్టు లను నహుషునితోన్‌.
276
క. ‘గో వగ్ని మయ మమృతమయ | మో వసుధాధీశ ! వినుము హోమ విధాన
శ్రీవాహిని, నిచ్చెన త్రిద | శావాసంబునకుఁ బూజ్య మమరుల కైనన్‌.’
277
చ. అని యిటు లేర్పడం బలికి, ‘యా తలఁ పెంతయు మేలు; గోవు ని
మ్మనఘచరిత్ర! యన్న, విభుఁడట్టుల చేసిన, బోయ లప్డు నె
మ్మనములు, మోద మంద గరిమంబున భార్గవుఁ జేరి ‘మమ్ముఁ గ
న్గొనినది యాదిగాఁ గరుణ గూరెద వొక్కటి విన్నవింతుమే?’
278
క. అని ప్రీతిఁ బలికి, యమ్ముని | యనుజ్ఞఁ గొని, ‘మమ్ము, గావు మక్కటికమునం
గొనవయ్య! గోవు మాచే’ | నన విని మొగమాట మనము నార్ద్రతఁ బెనుపన్‌.
279
తే. వేఁడికొనినట్టి కృపణుపై, వాఁడి చూడ్కి | యరయ నాశీవిషము చూపునట్ల కాన
చేయఁ బ్రార్థనా భంగంబు, మీ యభీష్ఠ | మాచరించెద నని గోవు నతఁడు గొనియె.
280
వ. కొని యంత నిలువక. 281
తే. దర్శనప్రీతి వారిపైఁ దగుల, మీల | వలని యర్మిలి మనమున దళముకొనఁగ,
మీరు, మీలును, సమ్మోదమార దివికి | నేఁగుఁ’డని పల్కె భార్గవుం డెల్ల వినఁగ.
282
వ. పలికినఁ దత్‌క్షణంబ. 283
తే. మీనములుఁ దారుఁ దనువుల తోన నెగసి | నాకలోకంబునకుఁ బోవ, నహుష నృపతి
సపరివారంబు గాఁగ నాశ్చర్య పూర | మగ్న మానసుఁ డయి యుండె మానవేంద్ర!
284
వ. అప్పుడు. 285
క. చ్యవనుఁడు, గవిజాతుఁడు, న | య్యవనీశ్వరుఁ బిల్చి ‘వరము లడుగుము రెం డీఁ
దివిరితి’ మనుడు నతఁడు ‘మీ | యవిరళ సంప్రీతికంటె నర్థము గలదే!’
286
తే. అనిన విని, యగ్గలం బైన యాదరమున | వారు ధర్మపరత్వంబు వాసవాభ
వైభవము నయ్యెడుమ నీకు వంశపావ | నాత్మ!’ యనుచు, నంతర్హితు లైరి వత్స!
287
క. మది నద్భుతంబుఁ బ్రమదముఁ | బొదలఁగ నమ్మునుల మహిమఁ బొగడుచుఁ జనియెం
దదనంతరంబ పతి నిజ | సదనమునకు నెల్ల జనులు సమ్మద మందన్‌.
288
వ. అని చెప్పి భీష్ముండు. 289
క. వినిపించితి సంవాసం | బున దర్శనముననుఁ జిత్తమున నధిక స్నే
హ నిరూఢి గల్గుటయు గో | వునందు గల గౌరవముఁ జెవుల కింపెసఁగన్‌.
290
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )