| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘తమయంత నెఱుఁగరు ధర్మంబు సదుపదే | శమునను గాన రసాధుజనులు; ధర్మబోధం బివ్విధంబులు రెంటను | గలిగెడువారు సాధులు; తదీయ చరితంబు విను; విడువరు మలమూత్రంబు | లర్హంబు గానిచో నధిప! యతిథి భోజనశిష్టాన్న భోజులు, దెరు విచ్చి | తగినవారలకుఁ బ్రదక్షిణముగ |
|
| తే. |
నరుగుదురు, నడపుదురు సత్యార్జవములు, | శరణు సొచ్చినఁ గాతురు, సురతగుప్తి పరులు, నిజదారతృప్తులు, గురువినీతు, | లమలహృదయులు, సంతోష మారఁ గలరు.’ |
426 |
| వ. | అని వెండియు. | 427 |
| తే. |
‘సాధు లింద్రియ విభ్రాంతి సంహరింతు, | రఘముఁ దెలిసి ప్రాయశ్చిత్త మాచరింతు, రప్రకాశంబుగా ధర్మ మాచరింతు, | రఖిలభూతదయాళుత్వమారఁ గలరు.’ |
428 |
| వ. | అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్త్రుతో నప్రయత్నులకు నర్థంబు సిద్ధించుట గలుగు; ధర్మపరులును నీతివిదులును నైన బలవంతులు బహుమార్గంబులగు సదుపాయంబుల నర్థంబు లాకాంక్షింప సిద్ధింపకుండెడుఁ; గొందఱకు సిద్ధించియు నవి భోగంబుల కుపయోగ్యంబులు గాకుండు; శిక్షలు పెద్ద లేకయుం గొన్ని చిత్తంబులందు విద్య లలవడు; శిక్షితులయ్యును నిర్విద్యు లగుటయుం గలుగుఁ; దెవుళ్ళ నోసియుం బోట్లం బడియును గొందఱు చావరు; పూరి పుడుక దాఁకి బలాధికులు చచ్చుట చూచెద మిట్లు గాఁ గతం బేమి? యెఱింగింపవే’ యనుటయు న మ్మహీపతి కమ్మహాత్ముం డి ట్లనియె. | 429 |