పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
పుత్త్రమరణ దుఃఖితయగు గంగను కృష్ణద్వైపాయను లూఱడించుట (సం. 13-154-26)
తే. ‘నీవు శోకంబు దక్కుము; నీ సుతుండు | పరమగతి నొందె; శాప సంప్రాప్తిఁ జేసి
వసువు మర్త్యుఁడై వర్తించె; నసదృశప్ర | భావుఁ డాతఁడు; వగపేల దేవి! నీకు?
479
చ. అతని శిఖండి యేల? యమరాధిపుఁడున్‌ సమయింపఁ జాలునే
యతఁడు నిజేచ్ఛఁ జేసి నరు నంచిత దివ్య శరంబు లంగసం
గతములు చేసి పాన్పుగ సుఖస్థితి మృత్యువు మాన్చియుండి కీ
ర్త్యతిశయ మొంది తా వలచినప్పుడు వోయె విషాద మేటికిన్‌?’
480
వ. అని యూఱడిలం బలికెఁ; గృష్ణద్వైపాయన మునివరుండును బరమాదరణీయతత్పర వచనంబుల నజ్జాహ్నవీదేవికి నానందం బాపాదించెఁ; దదనంతరంబ యాత్మీయ సలిల సాంగత్యంబు నొందు నమ్మందాకినిచేతం గృష్ణాదులు నందఱు జనపతులును ననుజ్ఞాతులు నాశీర్వాద ప్రీతులునై మునులునుం దోడ నడవ నది వెడలి, రని యిట్లు భీష్ముని వృత్తాంతంబు వైశంపాయనుండు జనమేజయునకుఁ జెప్పిన నప్పుడమిఱేఁ ‘డిత్తెఱంగున న త్తాతకు వలయు విధానం బాచరించి చరితార్థుండైన యప్పార్థివ ముఖ్యుండు మఱి యెట్టి చందంబునం బ్రవర్తించె? మునీంద్రా! యెఱింగింపవే’ యని యడుగుటయు. 481
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )