పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు సెప్పుట: (సం. 12-321-7)
సీ. ‘విను మవ్యయుఁడు సనాతనుఁడు విశ్వాత్ముఁడు | నైన నారాయణుండను మునీంద్రు
బదరికాశ్రమమున భక్తిమైఁ గొలిచి నా | రదుఁ డెద్ది సిద్ధి కారాధనీయ
మానతి యిమ్మన్న నతఁడుఁ ధ్రువం బచ | లం బింద్రియాగోచరంబు సూక్ష్మ
మనుపమ మన సర్వమున కంతరాత్మయై | వెలుఁగు తత్త్వము దక్క వేఱ కలదె?
 
తే. అరయ నారాధ్యమై యజుఁ డాదిగాఁగ | సకల భూతంబులకును బూజ్యంబు దాన
యనియె నిట్లన్న నరసఖుఁ డతికృపార్ద్ర | భావుఁడై చెప్ప నప్పద్మభవసుతుండు.
349
వ. సంప్రీతుండై సవిశేష వినయంబున నమ్మహాత్మున కిట్లనియె. 350
క. ‘లోకేశ! నీవు ధర్మ | శ్రీ కావలి గాఁగ నవతరించుట విద్వ
ల్లోకంబు సెప్పు నమ్మూ | లాకృతి యెట్లుండునో? దయాత్మకమూర్తీ!
351
క. శ్రుతిపరతయు గురుభక్తియు | మతిఁ గల వొకకొంత కొంత మన్నింపఁగఁ బా
త్రత గలిగెనేని నా కొసఁ | గు తదీయాలోకనం బగు తెఱంగు కృపన్‌.
352
వ. అని వేఁడిన భక్తపరాధీనుండైన యమ్మహానుభావుం డద్దేవసంయమితోఁ బరమైకాంతి వగుము. నీ కట్టి పెంపు సంపాదించెదం బొ మ్మని యత్యాదరంబున వీడుకొలిపినం బ్రీతుండై యవ్వియద్వీథిం జని యమ్ముని గనకనగంబునందు నియతాత్ముండయి యుండి దుగ్ధార్ణవంబు నుత్తరంబు చేరువ నున్న శ్వేతద్వీపంబునం దనాహారులు నింద్రియవృత్తిరహితులు నస్వేదులు సుగంధిశ్వేతాంగులు నగు పురుషులం గాంచె ననిన విని ధర్మపుత్రుం డవ్విశేషంబులు ముక్తలక్షణంబులై యున్నయవి యప్పురుషుల తెఱం గెఱింగింపవే ? యని యడిగిన శంతనునందనుం డతని కిట్లనియె. 353
క. ‘వారల కథ మా తండ్రికి | గారవమున బుధులు సెప్పఁగా నే వింటిం
గౌరవముఖ్య! విశిష్టా | చారుఁడు నృపుఁ డొక్కఁ డుపరిచరవసు వనఁగన్‌.
354
ఆ. కలిగెఁ దొల్లి భూమి గలయంతయును నేలు | సత్యమును దమంబు శమము విష్ణు
భక్తియును నయంబు బలిమియుఁ గ్రతుకుతూ | హలము బ్రాహ్మణ ప్రియంబుఁ గలఁడు.
355
వ. అమ్మహాత్ముండు. 356
చ. అలఘు తపంబుఁగోరి వసుధాధిపతిత్వము డిగ్గఁద్రావి కా
నలఁ జరియించుచుండ సురనాయకుఁ డాతని పాలికేఁగి ‘నె
చ్చెలివయి నా కడం దగ వసింపుము వచ్చుచుఁ బోవుచున్న మే
లిలయును నేలు దివ్యతయు నిచ్చితి మెచ్చితి నీదు నిష్ఠకున్‌.
357
తే. దేవభావంబునకుఁ దగ దీనినెక్కి | తిరుగు మెల్లెడ’ నని రత్నదీప్తమైన
యొక విమానంబు సంప్రీతి నొసఁగె నతఁడు | నతని మాటకు మిగులక యట్ల చేసె.
358
వ. దానం జేసి వసునామధేయుండైన యతం డుపరిచరుఁ డనం బరఁగె నదియునుం గాక వేఱొక్కటి యవ్విభుని విశేషంబు వినుము -కల్పాదియందు మరీచి యత్రి అంగిరసుండు పులహుండు పులస్త్యుండు క్రతువు వసిష్ఠుండనియెడు మహామునులు చిత్రశిఖండినామధేయులు స్వాయంభువుండను మనువుం దారు ననేకవర్షంబులు విష్ణు నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుం డదృశ్యరూపంబున వారల కట్టెదుర నిల్చి వారితో ‘మీరు ధర్మశాస్త్రకరణ ప్రవణులరై నన్నాశ్రయించితిరి. భారతి మీయందు నిలువ నియోగించితి. మీచేతం బ్రణీతంబై సకల జగంబులకు హితంబును మర్యాదాప్రవర్తకంబును నై శాస్త్రంబు వెలుంగు నంగిరసువలన బృహస్పతి యను నొక్క మహామతి జన్మించు వానియం దాసందర్భంబు ప్రతిష్ఠించునది’ యని యానతిచ్చి వెండియు. 359
తే. ‘ఉపరిచరవసు వను నొక్క నృపతి వుట్టు | నాతఁ డర్హుఁ డా శాస్త్రంబు నధిగమింప
నా బృహస్పతి సెప్పంగ నధిగమించి | తత్సమాచార నాయకత్వము వహించు.
360
వ. ‘అమ్మహితాత్ముండు మద్భక్తుండు మీకు సంభావనీయుం’ డని పలికి చనియె నత్తెఱంగునన యా పెంపు నొందినయట్టి యవ్వసువు హయమేధంబునకుం బ్రవర్తించిన నమ్మరీచ్యాదులగు సప్తసంఖ్యులును మఱియునుం దత్సములగు మహానుభావులును ఋత్విక్కరణంబు లాచరించిరి, బృహస్పతి యుపదర్శనంబు నడపెఁ, బ్రజాపతిపుత్రు లగు నేకతుండును ద్వితుండును ద్రితుండును నను మునిసత్తములు సదస్యులై రిట్లు సెల్లు నయ్యధ్వరంబునందు. 361
తే. అన్నరేంద్రుం డహింసకుం డగుటఁ జేసి | పశు విశసనంబు లేకుండఁ బరమనిష్ఠ
నాతఁ డారణ్యకోద్గీత మైన వాక్య | సంచయము విష్ణుగుఱిచి పఠించె నధిప!
362
క. కరుణావిధేయుఁ డగు నా | హరి యతనికిఁ గానవచ్చు నట్టులుగాఁ జె
చ్చెర వచ్చి హవిర్భాగా | హరణం బొనరించి చనుడు నతికుపితుండై.
363
వ. దివ్యధిషణుం డగు ధిషణుండు గన్నీ రొలుక నన్నరపతితోఁ దనకై యెత్తిన పురోడాశభాగంబు విష్ణుం డెల్ల వేలుపులుంబోలె నాకు దర్శనగోచరుండై కొనక యదృశ్యుండై కొనియె నని యుగ్గడించిన నయ్యుపరిచరుండు భరితవినయుండై యతని ననునయించె. సదస్యులు సంభ్రమంబు లేక యన్నాకేశమంత్రితో నిట్లనిరి. 364
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )