పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు సెప్పుట (సం. 7-51-1)
సీ. ‘అనఘ! సంశప్తక హననంబునకు నీవు | సనిన నొడ్డన మేర్చికొని కడంగి
నడచి ద్రోణునిఁ దలఁపడితి మవ్వీరు మో | హర మేము సొరఁ జాలమైతి మనఁగ
నేల తద్బాణార్చు లేర్చిన నక్కడఁ | దేఱిచూడను లేక త్రిప్పికొంటి
మమ్మొన భేదింప నభిమన్యుఁ డోపుఁ బొ | మ్మనియెడు తలఁపు నా కపుడు పుట్టి,
 
ఆ. వానిఁ బిలిచి ‘నీవు వాకిలిఁ బుచ్చు మం | దఱము మొగ్గరంబుఁ దఱియఁ జొచ్చె
దము వడిని భవత్పథంబున’ ననుడు నం | భోధి సొచ్చు కరటి పోల్కిఁ జొచ్చి.
270
క. నీ యుపదేశముఁ దనచే | దోయి బలువుఁ దోడు గాఁగ ద్రోణుఁ గడచి వే
పోయి మొనఁ జొచ్చి సైన్యము | పాయ వడఁగఁ గలఁగఁ జెదరఁ బఱవఁగఁ జేసెన్‌.
271
క. కని కుంభజముఖ్యులు వా | నిన పొదువఁగ నేముఁ జొచ్చి నిరతిశయ రయం
బున వానికిఁ దోడ్పడుటకుఁ | జనఁ జన మా కడ్డపడియె సైంధవుఁడు వడిన్‌.
272
వ. అతండు రుద్ర వరానుభావంబునం జేసి యక్షుద్ర బలుం డగుటనే మతని మిగులం జాలక చిక్కితి; మా సౌభద్రుం జుట్టుముట్టి గురుకర్ణ కృతవర్మ కృపగురు పు త్తాది యోధవీరులు పెక్కండ్రు సిక్కు వఱుపం, జేవ సెడక వాఁడు బలంబు మెఱయఁ జలంబు నెఱయ నా రాధేయ ప్రముఖులం బఱపియు, బృహద్బల లక్ష్మ ణ ప్రభృతులగు రాజుల రాకుమారులఁ బలువురం జంపియు, సొంపారెం; బదంపడి పదాతియు గదాపాణియునై రథాంగపాణి యల్లుండు దూఁగాడుచుం బోరాడునెడ దుశ్శాసన తనయుండు దాఁకి వానిచే విరథుండై తానును గదగొని పెలుచం దలఁపడియె; నత్తెఱంగున నైన గదారణంబున వారిరువురుం బరస్పర నిహతులై పడి; రివ్విధంబున నక్కుమారుండు దన తండ్రులకును మామలకును రూఢియగు రణక్రీడం గీర్తిపరిస్ఫూర్తియు నాకలోక సుఖంబునుం జేకొనియె’ నని చెప్పుటయు. 273
క. తెల్లముగ సుతుపడుట విని | జల్లని డెందంబు సెదర, సంధులు ప్రిదులం,
దల్లడ మగ్గలమై మూ | ర్ఛిల్లె నరుఁడు బంధు లెల్లఁ జేష్టలు దక్కన్‌.
274
వ. ఇట్లు పరవశుండైనఁ గృష్ణయుధిష్ఠిరులు గరతలంబుల నెత్త, నొక్కింతసేపునకు సేదదేఱి సైంధవుం దలంచి యతండు. 275
ఆ. అవుడు గఱచి యెఱ్ఱ నగు నాననంబుతో | బొమలు ముడిచి, చెమట పొడమ, మేను
కంప మొందఁ, గనలు గదిరిన కటికి న | వ్వెసక మెసఁగ నన్న కిట్టు లనియె.
276
మ. ‘వినుఁడీ! నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్‌; సింధురా
జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్థుండై నినుం జొచ్చినన్‌,
వనజాక్షున్‌ శరణంబు వేఁడినను, గర్వం బేది నన్నుం దగం
గనినం, బోరు దొఱంగి పోయిన నెఱుంగం గాని సత్యవ్రతా!
277
క. బాలధ్వంసకు నా దు | శ్శీలుం గాచుటకు నన్నుఁ జెనకిన నస్త్ర
జ్వాలలఁ గౌరవ యోధులఁ | దూలించుచు వానిఁ గవియుదుం జటుల గతిన్‌.
278
ఆ. ఇట్లు సేయనైతి నేని గురుద్రోహి | గతికి, బ్రహ్మఘాతిగతికి, మద్య
పానరతుని గతికి, మానార్హ జనపరి | వాదిగతికిఁ బోవువాఁడ నధిప!
279
వ. మఱియు నొక్క ప్రతిన యవధరింపుము. 280
చ. అనిమిష దైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం
దునుముదు నెల్లి సైంధవునిఁ దోయజమిత్త్రుఁడు గ్రుంకకుండుము
న్న నరవరేణ్య! యిత్తెఱఁగు నా కొనరింపఁగ రాక యున్న నే
ననలము సొచ్చువాఁడ నృపులందఱుఁ జూడఁగ గాండివంబుతోన్‌.’
281
వ. అని పెలుచం బలికి, యప్పరమ కోదండంబు దెప్పించి, సజ్యంబు గావించి, గుణధ్వని నిగుడం జేయుటయుఁ, బద్మనాభుండు పాంచజన్యంబు పూరించె, దేవేంద్ర పుత్త్రుండు దేవదత్తం బొత్తె; నన్నాదంబులును దత్సైనిక సింహనాదంబులును దూర్యనినదంబులును నింగి వొంగం జెలంగె; నగ్గాండీవంబును నృత్తంబు సేసిన చందంబు నొందె; నస్త్రంబు గవదొనలు వెలువడి వెలింగె; నయ్యవసరంబునం గొండొక దెలివొంది పవననందనుఁ డప్పురందరనందను వదనంబు వీక్షించి. 282
క. ‘అతి తీవ్రమైన నీదగు | ప్రతిన కుపోద్బలము గాఁగ బరఁగిన ధీరో
ద్ధతి పాంచజన్య రవమున | ధృతి తూలక యున్నె కురుపతికి నింద్రసుతా!’
283
వ. అని యగ్గించె; నా సమయంబునం గోపంబు పెంపునను బూనికిపై భరంబునను భీమసేనుని సల్లాప సౌహార్దంబునను దన డెందంబు శోకంబు డిందువడం గలయం గనుంగొని విజయుని వంది మాగధసందోహంబులు సంస్తుతించె; నట్టియెడ నిక్కడ. 284
క. జననాథ! పాంచజన్య | ధ్వనిఁ గూడి చెలంగు దేవదత్తరవంబున్‌
విని, భీతి సంభ్రమంబుల | మన సైన్యము లెల్ల ఘూర్ణమానము లయ్యెన్‌.
285
క. అప్పుడు వేగులవారలు | సెప్పిన నంతయు నెఱింగి సింధువిభుఁడు దన్‌
గప్పెడు నెవ్వగపెల్లున | నిప్పులఁ బడినట్లు గాలు నిలువఁగ లేమిన్‌.
286
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )