| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| ఉ. |
వైరివినాశనక్రియకు వాసవుఁ డిచ్చిన డాఁచియున్న యా ఘోరపుశక్తి నాలుకలు గ్రోయ మెఱుంగులు ప్రజ్వరిల్ల ఘం టారవ మధ్రవీథి నిగుడం దగఁ గేల నమర్చి పేర్చి య వ్వైరికిఁ బూఁచినం దలఁకి వాఁడు మహోన్నతఘూర్ణితాకృతిన్. |
229 |
| తే. |
తెరలి పాఱఁగఁ దలఁచుచో దృష్టితోడఁ | గూడికొను ముష్టి మృత్యువు తోడఁబుట్టు వనఁగఁ జాలు నద్దివ్యసాధనము వైచె | గగన తలమున భూతసంఘములు మ్రోయ. |
230 |
| వ. | ఇ వ్విధంబున రాధేయుండు మహోగ్రంబుగా వైచిన. | 231 |
| క. |
మును మాయ మ్రింగి దనుజేం | ద్రుని యురము పగిల్చి కొనుచు దుర్భరగతి వీఁ పున వెడలి శక్తి యెగసెను | వినువీథికి నుడుగణంబు వెలుకం బాఱన్. |
232 |
| వ. | అప్పుడు. | 233 |
| క. |
సోలుచు బోరగిలంబడి | నాలుక వెడలంగఁ బెట్టి నడుము గఱచుచున్ లాలలు గ్రమ్మఁగ రక్షః | పాలుఁడు వికృతాస్యుఁ డగుచుఁ బ్రాణము విడిచెన్. |
234 |
| వ. | ఇట్లు ఘటోత్కచుండు వడిన మన సైన్యంబున శంఖభేరీ స్వన సహితంబులగు సింహనాదంబులు సెలంగె; నీ పుత్రుండు బంధుమిత్ర సమేతంబుగాఁ బ్రమోదంబు నొంది సూతనందనుం గౌఁగిలించి తనయరదం బెక్కించికొని యుల్లసిల్లె; ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. | 235 |
| క. |
బలు మాయా బల బాహా | బలములు గలవాఁడు భీముపట్టి వడిన న గ్గలమగు శోకముఁ గోపము |నలఁచుం బాండవుల నెట్టు లైరొకొ వారల్? |
236 |
| వ. | అని యడిగిన నమ్మహీపతికి నతం డిట్లను నట్లు మృతుం డైన హిడింబాసుతుం జూచి కౌంతేయు లత్యంత దీనమానసులై కన్నీరు గడలుకొన నడలునఁ గుందిరి; గోవిందుండు ప్రమోదంబు నొంది సింహనాదంబు సేసి శంఖంబు పూరించి పగ్గంబులు నొగల ముడిచి మందమారుతాందోళితంబగు మందారంబు చందంబు దోఁప నర్తించుచు నరదంబు నడిమి కరిగి కిరీటిం గౌఁగిలించికొని వీఁ పప్పళించి వెండియు నార్చిన నాతం డ య్యుపేంద్రు నుపలక్షించి. | 237 |
| ఉ. |
‘చచ్చె ఘటోత్కచుండు మన సైన్యము లెల్లఁ గలంగి నల్గడన్ విచ్చుటఁ జూచి మేము వగ నెక్కొన వందెద మిప్పు డెమ్మెయిన్ వచ్చెఁ బ్రమోద? మెట్లు గరువంపుఁ జరిత్రము దక్కి లాఘవం బచ్చువడం జెలంగెదు? మహాపురుషా! యిది యేమి సెప్పవే .’ |
238 |