| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
‘హరుఁ, బరమేశ్వరేశ్వరుఁ, గృపాతిశయార్ద్రు, నమేయమూర్తి, శం కరు, నచలైక భక్తిరసగమ్యుని, నవ్యయు, నిందుమౌళిఁ ద త్పరమతి నాశ్రయించి యనపాయబలోద్భటశౌర్యసంపదన్ గురుతనయుండు గాంచి యధికుం డగుటం బగదీర్చె నమ్మెయిన్. |
107 |
| చ. |
శివుఁడు ప్రసన్నుఁడైన నఱచేయునె యెవ్వరికైన? రాజపుం గవ! యమరత్వమైన, బలఘస్మరు గెల్వఁగ నోపునట్టి ద ర్ప విభవమైన నిచ్చుఁ; బరిపంథు లనేకుల నొక్కరుండు బా హువిలసనంబు ఘోరముగ నోర్వఁగఁ జాలుట యీగి చోద్యమే? |
108 |
| ఉ. |
తెల్లమి గాఁగ నేను శివదేవు నెఱుంగుదు; భూతసంచయం బెల్ల జనింప, నిల్వఁగ, లయింపఁగఁ జేయు నతండె; యవ్విభుం డుల్లమునం దలంప భువనోత్కరవిశ్వవిధానయుక్తి వ ర్తిల్లుచునుండు; భక్తికి విధేయుఁ, డమేయుఁడు కౌరవేశ్వరా! |
109 |
| వ. | అమ్మహాదేవుని దివ్యలీలలు సెప్పెద నాకర్ణింపుము. | 110 |
| సీ. |
భూతసంచయ సృష్టి బుద్ధిఁ దలంచి య | ప్పరమేశుఁ గానఁగ బ్రహ్మ యరిగి తనదు మనోవృత్తి దగ నెఱింగించిన, | నమ్మహాత్ముండు తదభిమతంబు గావింపఁ బూని తపోవిభవం బేమి | పనులకు నైనను బ్రథమసాధ నంబని యూహించి, యంబుసమర్పిత | నిజమూర్తియై, తపోనిష్ఠ నుండె; |
|
| తే. |
నా విరించియు నద్దేవదేవు రాక | బహుసహస్రవర్షంబులు వార్చియుండి, నిజతపఃప్రభావంబున నిపుణచిత్తు | దక్షుఁడనువాని సృజియించె; ధరణినాథ! |
111 |
| వ. | ఇట్లు సృజియించి యవ్విరించి యతని నాలోకించి ‘ప్రజల సృజియింపు’ మని పంచిన, నతండు ‘పెద్దవా రొండ్లు లేరై రేనియు సృజియించెద’ ననిన, నప్పరమేష్ఠి ‘పరమేశ్వరుండు జలనిమగ్నుండై యున్నవాఁ; డేను నిన్ను నియోగించెద; నింక సృజియించుపెద్ద లెవ్వరును లేరు. సృజియింతువు గాక’ యనవుడు నమ్మహాత్ముండు దేవాసురమనుష్యతిర్యగాత్మకభూతంబుల సృజియించిన, నాఁకొని యవి దక్షప్రజాపతి భక్షింపం గవిసిన. | 112 |
| ఆ. |
అతఁడు బ్రహ్మపాలి కతిరయంబునఁ బాఱి | ‘భూతతతులు నన్నుఁ బొదువకుండ నాఁగవలయు; వాని కాహారములు గల్పి | తములు సేయవలయుఁ దగ మహాత్మ!’ |
113 |
| వ. | అనిన విని యా జగత్కర్త యోషధులును ఫలమూలాదిభక్ష్యసంపదుపకారంబులుగా వృక్షలతాగుల్మంబులను గల్పించి, యా భూతంబులకు వాని నాహారంబులుగా సమర్పించి, మఱియును బలిష్ఠభూతంబులకు దుర్బల భూతంబులు భక్ష్యంబగుం గాక యనియు నాదేశించె; నంత నా భూతంబులు ప్రీతంబులై చని తత్ప్రకారంబున వృద్ధినొంది సంతానరూపంబున సమృద్ధంబు లగుచునుండెఁ; బెద్దకాలంబునకు బాలేందుధరుండు జలంబులు వెడలివచ్చి భూతకోట్ల నాలోకించి కోపించి నిజలింగంబుఁ బుచ్చి నేలనిడినం గని యా నీరజాసనుండు భవునిం బ్రశమనవాక్యంబుల ననునయించుచుఁ జేరనరిగి ‘లింగంబు నిట్లేల చేసి?’ తనుటయు నద్దేవుండు. | 114 |
| క. |
‘భూతంబుల సృజియించుట | కై తోయములందు మునిఁగి యత్యుగ్ర తపః స్ఫీతుఁడనై వచ్చితి నొరు | చేత సృజనమగుట నిట్లు సేసితి దీనిన్.’ |
115 |
| వ. | ‘భూతంబుల సృజియించుటకుం గాక లింగంబు దన కేల?’ యని పలికి సంరంభవిజృంభితుం డగుచు మాల్యవంతంబునకుఁ జని మహాతపంబు సేయుచుండ. | 116 |
| క. |
ఆ సమయంబున లింగము | భాసురగతిఁ జూడ నొప్పె బ్రహ్మాదులకుం; జేసిరి పూజలు వారలు | వాసవముఖ్యామరాదివర్గముఁ దారున్. |
117 |
| వ. | అంతం బెద్దకాలంబునకు. | 118 |